శుభవార్త: సంస్కరణల ఎఫెక్ట్, చైనాను దాటేసి ముందుకు భారత్!
ఢిల్లీ: చైనాను దాటేసి 2018లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించనుంది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు ప్రపంచంలోనే అయిదో అతిపెద్ద మార్కెట్గా రూపాంతరం చెందుతాయని సాంక్టమ్ వెల్త్ మేనేజ్మెంట్ పేర్కొంది.
మిగతా ప్రపంచమంతా తక్కువ వృద్ధిని నమోదు చేస్తుంటే అందుకు భిన్నంగా భారత్ మాత్రం ఆర్థిక సంస్కరణలతో దీర్ఘకాలిక వృద్ధిలో దూసుకుపోతోందని తెలిపింది. చైనాను దాటేసి భారత్ అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న అతిపెద్ద వ్యవస్థగా అవతరిస్తుందని తెలిపింది.
చైనా వృద్ధి రేటు మందగిస్తోందని తెలిపింది. భారత్ ఈక్విటీ మార్కెట్లు 6-8 శాతం కన్నా అధికంగా రాబడులు అందిస్తున్నాయని తెలిపింది. అయితే పెరుగుతున్న ధరలు, ద్రవ్యోల్భణం ప్రభావం మార్కెట్ ఎదుగుదలపై ఉంటుందని పేర్కొంది.
ఆధార్, జన్ధన్, నోట్ల రద్దు, జీఎస్టీతో పాటు మరెన్నో ఆర్థిక సంస్కరణలు ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత ముఖచిత్రాన్ని పూర్తిగా మార్చేస్తాయని తెలిపింది. ఇది సరికొత్త సమ్మిళిత మౌలిక సదుపాయాలను సృష్టిస్తాయని పేర్కొంది.