మళ్లీ భారత్, చైనా డైరెక్ట్ విమానాలు ? కైలాష్ సరోవర్ యాత్ర కూడా..!
భారత్, చైనాల మధ్య దాదాపు మూడేళ్లుగా సాగిన సరిహద్దు ప్రతిష్టంభన వీడిన నేపథ్యంలో ఇరు దేశాలూ మరికొన్ని సానుకూల అడుగులు వేస్తున్నాయి. ముఖ్యంగా ఇరు దేశాల మధ్య కరోనా సమయంలో సరిహద్దు వివాదం రాకముందు ఉన్న పరిస్ధితుల్ని తిరిగి పునరుద్ధరించేందుకు అడుగులు పడుతున్నాయి. ఇదే క్రమంలో ఇవాళ చైనా విదేశాంగమంత్రితో మన విదేశాంగమంత్రి జై శంకర్ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా కొన్ని కీలక నిర్ణయాలు తీసుకున్నారు.
బ్రెజిల్ లోని రియోడిజనీరోలో జరిగిన భేటీలో భారత్, చైనా విదేశాంగమంత్రులు జై శంకర్, వాంగ్ యీ రెండు కీలక అంశాలపై చర్చలు జరిపారు. జీ20 సదస్సు కోసం హాజరైన వీరిద్దరూ విరామంలో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా వీరిద్దరూ భారత్, చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసుల పునరుద్ధరణపై చర్చించారు. అలాగే కైలాష్ మానస సరోవర్ యాత్రను పునరుద్ధరించే అంశంపైనా చర్చించారు.

కోవిడ్ మహమ్మారి కారణంగా గతంలో భారత్, చైనా మధ్య డైరెక్ట్ విమాన సర్వీసులు నిలివేశారు. అంతలోనే సరిహద్దు వివాదం కూడా తెరపైకి రావడంతో వాటిని తిరిగి పునరుద్ధరించలేదు. అప్పట్లో లడఖ్లో మొదలైన ప్రతిష్టంభన గాల్వాన్లో ఘర్షణలకు దారి తీసింది. ఇందులో 20 మంది భారతీయ సైనికులు చనిపోవడం, చైనా కూడా భారీగా బలగాలు నష్టపోవడంతో చర్చలు ప్రారంభమయ్యాయి. వివిధ దశల్లో జరిగిన చర్చలు ఫలించి తాజాగా ఇరు దేశాలూ సైనికుల్ని వెనక్కి రప్పించాయి. ఇప్పుడు ఇరుదేశాల మధ్య డైరెక్ట్ విమాన సర్వీసుల పునరుద్ధరణ, మానస్ సరోవర్ యాత్ర కు అనుకూలంగా నిర్ణయాలు తీసుకున్నారు.












Click it and Unblock the Notifications