ఇక లండన్లోని అంబేద్కర్ నివసించిన ఇల్లు మనదే
లండన్: భారత రాజ్యాంగ నిర్మాత, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నివాసమున్న ఇంగ్లాండ్ రాజధాని లండన్లోని ఇల్లు భారత్ సొంతమైంది. దీన్ని మహారాష్ట్ర సర్కారు అక్కడి అధికారుల సమక్షంలో గురువారం కొనుగోలు చేసింది.
1920లో అంబేద్కర్ లండన్లో విద్యాభ్యాసం చేస్తున్నప్పుడు 10 కింగ్ హెన్రీ రోడ్డులోని ఓ ఇంట్లో నివసించేవారు.
2,050 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న మూడంతస్తుల ఈ నివాసాన్ని అమ్మేందుకు అక్కడి అధికారులు ముందుకు రాగా.. విషయం తెలుసుకున్న మహారాష్ట్ర సర్కారు దాన్నికొనుగోలు చేసేందుకు రాష్ట్ర సామాజిక న్యాయశాఖ మంత్రి రాజ్కుమార్ బడోలే ఆధ్వర్యంలో ఓ కమిటీని ఏర్పాటు చేసి లండన్కు పంపింది.
సుమారు మూడు నెలలుగా చర్చోపచర్చలు జరిపి.. చివరికి రూ. 31కోట్లకు ఆ నివాసాన్ని కొనుగోలు చేసింది.
‘అంబేద్కర్ నివసించిన ఇంటిని సెప్టెంబర్ 24న కొనుగోలు చేశాం. త్వరలోనే దానికి అంబేద్కర్ మెమోరియల్ అని నామకరణం చేస్తాం' అని ఫెడరేషన్ ఆఫ్ అంబేద్కరిస్ట్ అండ్ బుద్ధిస్ట్ ఆర్గనైజేషన్ (ఫ్యాబో) అధ్యక్షుడుచ మహారాష్ట్ర సర్కారు నియమించిన కమిటీ సభ్యడు సంతోష్ దాస్ శుక్రవారం మీడియాకు తెలిపారు.