కరెంట్ ఛార్జీలు పెంపు! బంగ్లాదేశ్కు భారత్ బిగ్ షాక్.. ఉచితాలు చెల్లవ్
పొరుగు దేశం బంగ్లాదేశ్కు సరఫరా చేసే విద్యుత్పై భారత ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. భారత్ నుంచి ఎగుమతి అయ్యే ప్రతి యూనిట్ విద్యుత్పై సెటిల్మెంట్ నోడల్ ఏజెన్సీ పేరిట అదనంగా రూ. 0.005 (అర పైసా) రుసుమును ప్రతిపాదించింది. సరిహద్దుల గుండా జరిగే విద్యుత్ రవాణా, గ్రిడ్ నిర్వహణ, మీటరింగ్, విద్యుత్ లెక్కల సజావు ప్రక్రియల నిర్వహణ ఖర్చుల కోసమే ఈ అదనపు ఛార్జీలను విధిస్తున్నట్లు భారత ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ కొత్త నిబంధన వల్ల భారత్ నుంచి బంగ్లాదేశ్కు వెళ్లే 1,160 మెగావాట్ల కరెంట్ సరఫరాపై ప్రత్యక్ష ప్రభావం పడనుంది.
సరిహద్దు దేశాల విద్యుత్ వాణిజ్యాన్ని పర్యవేక్షించే సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ (CERC) తొలుత ప్రతి యూనిట్కు ఒక పైసా ఛార్జీని విధించాలని భావించింది. అయితే, ఈ నిర్ణయంపై బంగ్లాదేశ్ పవర్ డెవలప్మెంట్ బోర్డ్ అభ్యంతరం వ్యక్తంచేసి, చర్చలు జరపడంతో సగానికి సగం తగ్గించి రూ. 0.005గా నిర్ణయించారు. ఈ ఛార్జీలు సాధారణ విద్యుత్ టారిఫ్కు అదనం అయినప్పటికీ, ఆర్థికంగా బంగ్లాదేశ్కు ఇది పెద్దగా భారం కాదని అధికారులు చెబుతున్నారు. ప్రతిపాదిత ఒప్పందం ప్రకారం బంగ్లాదేశ్ పూర్తి స్థాయిలో 1,160 మెగావాట్ల కరెంట్ను నిరంతరాయంగా వినియోగిస్తే గంటకు సుమారు రూ. 5,800 అదనపు సర్ఛార్జ్ పడుతుంది.

ఎన్టీపీసీ అనుబంధ సంస్థతో ఒప్పందం: సిద్ధమవుతున్న బంగ్లాదేశ్
ఈ కొత్త పన్నుల విధానం, చెల్లింపుల ప్రక్రియను క్రమబద్ధీకరించడానికి బంగ్లాదేశ్ విద్యుత్ శాఖ వేగంగా పావులు కదుపుతోంది. భారత్కు చెందిన ప్రభుత్వ రంగానికి చెందిన ఎన్టీపీసీ విద్యుత్ వ్యాపార్ నిగమ్ లిమిటెడ్ తో ఒప్పందం కుదుర్చుకోవడానికి సిద్ధమైంది. దీనికి సంబంధించి బంగ్లాదేశ్ ఆర్థిక శాఖ ఆమోదం కోరుతూ నివేదికలు కూడా పంపింది. ఈ ఎస్ఎన్ఏ ఒప్పందం కుదరడం వల్ల వివిధ విద్యుత్ ఉత్పత్తి సంస్థలకు విడివిడిగా కాకుండా నోడల్ ఏజెన్సీ ద్వారా చెల్లింపులు సులభతరం అవుతాయని, ఈ ఒప్పందంలో జాప్యం జరిగితే విద్యుత్ సరఫరాలో సాంకేతిక సమస్యలు వచ్చే ప్రమాదముందని అధికారులు అభిప్రాయపడుతున్నారు.
భారత్ నుంచి భారీగా విద్యుత్ కొనుగోళ్లు: ఇతర దేశాల సరసన బంగ్లా!
ప్రస్తుతం బంగ్లాదేశ్ మన దేశం నుంచి వివిధ ఒప్పందాల ద్వారా మొత్తం 2,656 మెగావాట్ల విద్యుత్ను దిగుమతి చేసుకుంటోంది. ఇందులో ఎన్టీపీసీ, దమోదర్ వ్యాలీ కార్పొరేషన్, త్రిపుర స్టేట్ ఎలక్ట్రిసిటీ, సెమ్కార్ప్ సంస్థల ద్వారా విద్యుత్ అందుతోంది. ఇవి కాకుండా జార్ఖండ్లోని అదానీ పవర్ ప్లాంట్ నుంచి ఏకంగా 1,496 మెగావాట్ల కరెంట్ను కొనుగోలు చేస్తోంది. అయితే అదానీ సంస్థతో ఉన్న పాత ఒప్పందంలోనే ఈ రకమైన ఛార్జీల నిబంధనలు ఉన్నందున దానికి ప్రత్యేక ఒప్పందం అవసరం లేదని బంగ్లా అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం భారత్ నుంచి విద్యుత్ కొనుగోలు చేస్తున్న నేపాల్, భూటాన్ దేశాలు కూడా ఇదే తరహాలో ప్రతి యూనిట్కు రూ. 0.005 ఎస్ఎన్ఏ ఛార్జీలను చెల్లిస్తుండటం గమనార్హం.














Click it and Unblock the Notifications