పాక్ బుద్ధి: రహస్యంగా శవాల ఖననం, నోరు విప్పొద్దని మసూద్కు వార్నింగ్
న్యూఢిల్లీ: పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాదులపై భారత సైన్యం చేసిన సర్జికల్ దాడి ఉట్టిదేనని అంటున్న పాకిస్తాన్ దానికి సంబంధించిన ఆధారాలు నాశనం చేసేందుకు ప్రయత్నిస్తోంది. భారత్ సర్జికల్ స్ట్రైక్స్లో మృతి చెందినవారి శవాలను చడీచప్పుడు లేకుండా ఖననం చేస్తోంది.
భారత ఆర్మీ చేసిన దాడిలో తక్కువలో తక్కువగా 30 మంది, ఎక్కువలో ఎక్కువ 70 మంది ఉగ్రవాదులు మరణించినట్లు భావిస్తున్నారు. వారి మృత దేహాలను శుక్రవారం పాక్ ఆర్మీ రహస్యంగా ఖననం చేసింది. మృతి చెందిన ఉగ్రవాదులు జైషే-ఇ-మహ్మద్, లష్కర్-ఎ-తోయిబా, హిజ్బుల్ ముజాహిదీన్కు చెందిన వారని సమాచారం.
ఉగ్రవాదుల మృత దేహాలకు అంత్యక్రియలు కూడా సరిగా నిర్వహించకుండానే దాడి జరిగిన ప్రాంతాల సమీపంలో పాక్ ఆర్మీ హడావిడిగా ఖననం చేసినట్లు భారత నిఘా వర్గాలు చెబుతున్నాయి. సంప్రదాయాలు కూడా పాటించకుండా శవాలను ఖననం చేసి, దాడి ఉత్తదేనని బుకాయించడానికి పాకిస్తాన్ ప్రయత్నిస్తున్నట్లు భావిస్తున్నారు. అంతేకాకుండా, మృతుల కుటుంబాలకు వారి జాడ కూడా తెలియకుండా పోతుంది.

మసూద్కు హెచ్చరిక
మృతులు ఎక్కువ మంది తన సంస్థకు చెందినవారే కావడంతో జైషే మొహమ్మద్ చీఫ్ మౌలానా మసూద్ అజర్కు మింగుడుపడని విషయమే అవుతుంది. భారత్ సర్జికల్ దాడి ఆయనకు ఊహించని ఎదురు దెబ్బ. భారత్ దాడులను వ్యతిరేకిస్తూ పాక్లో భారీ ర్యాలీలు నిర్వహించి పాక్ ప్రజలు ప్రభుత్వంపై ఒత్తిడి చేసే వ్యూహంలో అతను ఉన్నట్లు తెలుస్తోంది.
అయితే భారత మెరుపుదాడి బూటకమని వాదిస్తున్న పాకిస్థాన్, మసూద్ అజహర్ నోరు విప్పితే తమ నాటకం బయటపడుతుందని భావిస్తోంది. సరిహద్దును దాటి భారత ఆర్మీ చేపట్టిన సర్జికల్ స్ట్రైక్స్ను అప్పుడు అంగీకరించాల్సిన పరిస్థితిలో పడుతుంది. దీంతో భారత్పై యుద్ధానికి పాక్ ప్రజలు, ఆర్మీ నుంచి ప్రభుత్వంపై మరింత ఒత్తిడి పెరుగుతుంది.
దాంతో పాకిస్తాన్ మౌలానా మసూద్ అజహర్ను పెదవి విప్పవద్దని ఆదేశించింది. ఉగ్రవాదానికి సంబంధించి పలు కోర్టు కేసులున్న అతడ్ని కొంత కాలం సహనంతో ఉండాలని గట్టిగా హెచ్చరించింది.












Click it and Unblock the Notifications