భారత్కు డిస్కౌంట్ ధరకు రష్యా క్రూడాయిల్: ఘాటుగా స్పందించిన అమెరికా
వాషింగ్టన్: రోజులు గడుస్తున్న కొద్దీ- రష్యా, ఉక్రెయిన్ మధ్య కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రతరమౌతోంది. యుద్ధాన్ని నిలిపివేయడానికి రెండు దేశాల ప్రతినిధులు శాంతి చర్చల్లో పాల్గొంటోన్నప్పటికీ.. అవి కొలిక్కి రావట్లేదు. డిమాండ్లను అంగీకరించే విషయంలో ప్రతిష్ఠంభన నెలకొంటోంది. యుద్ధం కొనసాగింపునకు దారి తీస్తోంది. ఉక్రెయిన్లోని దాదాపు అన్ని రీజియన్లపైనా రష్యా పట్టు బిగించింది. తమ దేశ సరిహద్దులకు సమీపంలో ఉన్న అన్ని నగరాలను స్వాధీనం చేసుకుంది రష్యా.

నాటోలో చేరబోమంటూ
నార్త్ అట్లాంటిక్ ట్రీటీ ఆర్గనైజేషన్ (నాటో)లో తాము చేరబోమంటూ ఉక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ స్పష్టం చేశారు. నిజానికి- రష్యా ప్రధాన డిమాండ్ కూడా ఇదే. ఈ ఒక్క డిమాండ్కు అంగీకరిస్తే రష్యా యుద్ధాన్ని నిలిపివేస్తుందని భావించినప్పటికీ.. వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా ఉన్నాయి. నాటోలో చేరబోమంటూ జెలెన్స్కీ నోటిమాటగా చెప్పడాన్ని అంగీకరించట్లేదు. దీనికి లీగల్ గ్యారంటీ కావాలని పట్టుబడుతోంది.

ఆ రెండు రీజియన్లపై..
డొనాట్స్క్, లుహాన్స్క్ రీజియన్లను ఇండిపెండెంట్స్ స్టేట్స్గా గుర్తించాలనీ రష్యా డిమాండ్ చేస్తోంది. ఈ రెండు రీజియన్లు కూడా 2014 నుంచి రష్యన్ వేర్పాటువాదుల ఆధీనంలో ఉంటోన్నాయి. ఈ రెండు రీజియన్లపై ఉక్రెయిన్ ప్రభుత్వం తన అధికారాన్ని వెనక్కి తీసుకోవాలని రష్యా డిమాండ్ చేస్తోంది. యుద్ధం ప్రారంభం కావడానికి రెండు రోజుల ముందే రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్- ఈ రెండు రీజియన్లను ఇండిపెండెంట్ స్టేట్స్గా గుర్తిస్తున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.

భారత్ వైఖరి పట్ల..
రష్యా- ఉక్రెయిన్ యుద్ధంలో భారత్ వైఖరి పట్ల అమెరికా తొలిసారిగా స్పందించింది. ఘాటు వ్యాఖ్యలు చేసింది. రష్యాపై అమెరికా, ఆస్ట్రేలియా, కెనడా, బ్రిటన్, ఫ్రాన్స్ సహా యూరోపియన్ యూనియన్ దేశాలు విధించిన ఆంక్షల నేనథ్యంలో ఈ కామెంట్స్ వెలువడటం ప్రాధాన్యతను సంతరించుకుంది. ఆయా దేశాలు విధించిన ఆంక్షల నేపథ్యంలో రష్యా- భారత్కు బంపర్ ఆఫర్ ఇచ్చింది. డిస్కౌంట్ ధరకు క్రూడాయిల్ను సరఫరా చేస్తామని ప్రకటించింది. దీన్ని భారత్ అంగీకరించింది.

ఆఫర్ను అంగీకరించడం పట్ల..
రష్యా ఇచ్చిన ఆఫర్ను భారత్ అంగీకరించడాన్ని తాము తప్పు పట్టలేమని వైట్హౌస్ ప్రెస్ సెక్రెటరీ జెన్ పిసాకీ వ్యాఖ్యానించారు. రష్యాపై తాము విధించిన ఆంక్షలను ఉల్లంఘించినట్టు కూడా పరిగణించలేమని స్పష్టం చేశారు. యుద్ధానికి దిగిన రష్యా వైపు మొగ్గు చూపడాన్ని మాత్రం తాము ఎంతమాత్రం సమర్థించట్లేదని పేర్కొన్నారు. యుద్ధం వైపు మొగ్గు చూపామా? లేక శాంతికాముక దేశంగా ఉన్నామా?.. అనేది చరిత్ర పుస్తకాల్లో శాశ్వతంగా నిలిచిపోతుందని జెన్ పిసాకీ చెప్పారు.

యుద్ధాన్ని సమర్థించినట్టే..
రష్యా నాయకత్వానికి మద్దతు పలకడం, యుద్ధాన్ని సమర్థించడం అనేది విధ్వంసకర నిర్ణయమని, దాని దుష్ప్రభావం కూడా అదే స్థాయిలో ఉంటుందని ఆమె వ్యాఖ్యానించారు. నిజానికి- రష్యా ఉక్రెయిన్ యుద్ధం విషయంలో భారత్ తటస్థ వైఖరిని అనుసరిస్తోన్న విషయం తెలిసిందే. ఐక్యరాజ్య సమితి వంటి అంతర్జాతీయ వేదికలపైనా తన నిర్ణయాన్ని స్పష్టం చేసింది. అటు రష్యా వైపు గానీ, ఇటు ఉక్రెయిన్ను గానీ భారత్ సమర్థించట్లేదు.
Recommended Video

రక్షణ పరికరాల్లో రష్యా వాటా..
అదే సమయంలో యుద్ధాన్ని తక్షణమే నిలిపివేయాలనే వాదనను బలంగా వినిపిస్తోంది. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని సూచిస్తోంది. రష్యాతో భారత్ ఏమాత్రం ఘర్షణ వైఖరికి వెళ్లట్లేదు. దేశ రక్షణ వ్యవస్థకు అవసరమైన ఆయుధాలను రష్యా సరఫరా చేస్తోంది. 80 శాతం రక్షణ పరికరాలు ఆ దేశం నుంచే అందుతోన్నాయి. దశాబ్దాలుగా రష్యా.. భారత్కు నమ్మకమైన మిత్రదేశంగా ఉంటూ వస్తోంది. ఆయా కారణాలతో తటస్థ వైఖరిని అనుసరిస్తోంది.












Click it and Unblock the Notifications