హాట్ లైన్ లో భారత్-పాక్ సైనిక చర్చలు-సీరియస్ వార్నింగ్..!
జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్లో జరిగిన ఉగ్రవాద దాడి తర్వాత భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్ధితులు నెలకొంటున్నాయి. ముఖ్యంగా పాకిస్తాన్ తో సింధు జలాల ఒప్పందాన్ని భారత్ నిలిపేయడం, వారి పౌరుల్ని దేశం నుంచి బహిష్కరించడం వంటి నిర్ణయాలను కేంద్రం తీసుకుంది. దీంతో పాకిస్తాన్ భారత విమానాలకు తమ గగనతలం మూసేయడంతో పాటు సిమ్లా ఒప్పందం నిలిపేసింది. ఈ నేపథ్యంలో సరిహద్దుల్లో నియంత్రణ రేఖ వద్ద పాకిస్తాన్ నిత్యం కాల్పులకు దిగుతూ రెచ్చగొడుతోంది. ఈ నేపథ్యంలో భారత బలగాలు కూడా ఎప్పటికప్పుడు దీటుగా బదులిస్తున్నాయి.
అయితే రోజురోజుకూ కాల్పుల నియంత్రణను ఉల్లంఘిస్తూ కవ్వింపులకు దిగుతున్న పాకిస్తాన్ పై భారత్ ఆగ్రహంగా ఉంది. ఈ నేపథ్యంలో ఇరుదేశాల సైనికాధికారులు హాట్ లైన్ ద్వారా తాజాగా చర్చలు జరిపారు. పాకిస్తాన్ కాల్పుల నియంత్రణ ఒప్పందాన్ని ఉల్లంఘించి ఏకపక్షంగా కాల్పులకు, కవ్వింపులకు దిగడంపై భారత్ తీవ్ర అభ్యంతరం తెలిపింది. ఇలాంటి చర్యలు కొనసాగిస్తే దీటుగా బదులిస్తామని మన ఆర్మీ హెచ్చరికలు జారీ చేసినట్లు తెలుస్తోంది.

నియంత్రణ రేఖ వెంబడి "ఎటువంటి కవ్వింపు లేకుండా" ఉల్లంఘనలకు పాల్పడవద్దని భారత సైన్యం.. పాకిస్తాన్ సైనికాధికారుల్ని హెచ్చరించినట్లు సమాచారం. భారత, పాకిస్తాన్ దేశాల సైనిక కార్యకలాపాల డైరెక్టర్ జనరల్స్ ఈ హాట్ లైన్ చర్చల్లో పాల్గొన్నారు. ఇందులో భారత సైనికాధికారులు.. పాకిస్తాన్ ఏయే రోజు ఎక్కడెక్కడ ఇలా కాల్పుల ఉల్లంఘనలకు పాల్పడిందో వివరించినట్లు తెలుస్తోంది. వీటిని ఇకపై కొనసాగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించినట్లు తెలుస్తోంది.
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇవాళ పలు కీలక సమావేశాలను నిర్వహించారు. వీటిలో జాతీయ భద్రతా విషయాలపై భారతదేశ అత్యున్నత నిర్ణయం తీసుకునే సంస్థ అయిన భద్రతా వ్యవహారాల కేబినెట్ కమిటీ భేటీ కూడా ఉంది. వీటిలో పహల్గాం దాడికి కౌంటర్ ఇచ్చేందుకు సైన్యానికి ప్రధాని మోడీ పూర్తి స్వేచ్ఛ ఇచ్చారు. అలాగే బలగాలపై పూర్తి విశ్వాసం ప్రకటించారు. మరోవైపు తమపై భారత్ సైనిక దాడి చేయొచ్చంటూ పాక్ మంత్రి చేసిన ప్రకటన చర్చనీయాంశంగా మారింది. దీనిపై భారత్ స్పందించలేదు.












Click it and Unblock the Notifications