అమెరికాలో భారతీయ వ్యాపారవేత్తపై కాల్పులు: మృతి
న్యూయార్క్: అమెరికాలో ఓ భారతీయ వ్యాపారవేత్త దారుణ హత్యకు గురయ్యాడు. మద్యం షాపు నిర్వహిస్తున్న అతడిపై గుర్తు తెలియని వ్యక్తి కాల్పులు జరపడంతో తీవ్ర గాయాలపాలై మృతి చెందాడని పోలీసులు తెలిపారు.
ఎడిసన్కు చెందిన అమిత్ పటేల్(28) న్యూజెర్సీలోని ఇర్వింగ్టలోని రోజ్వే లిక్కర్స్లో సోమవారం హత్యకు గురైనట్లు పోలీసులు చెప్పారు. తన తండ్రికి చెందిన మద్యం షాపులో ఒంటరిగా ఉన్న సమయంలో పటేల్పై ఓ దుండగుడు ఒక్కసారిగా దగ్గర్నుంచి కాల్పులు జరపడంతో అక్కడికక్కడే పటేల్ కుప్పకూలిపోయాడు.
ఆ దుండగుడు అతడిపై కాల్పులు జరిపి అక్కడ్నుంచి పారిపోయాడు. ఆ షాపులో డబ్బులు గానీ, ఇతర వస్తువులను గానీ అతడు అపహరించుకుపోలేదు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోగా, రక్తపు మడుగులో పటేల్ పడిపవున్నాడు. ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఘటన జరిగిన సమయంలో అమిత్ పటేల్ తండ్రి షాపు వెనకాల ఉన్న కార్యాలయంలో ఉన్నాడు. షాపులో ఉన్న అమిత్ పటేల్ను కొందరు వచ్చి కాల్చి వెళ్లిపోయారని అమిత్ పటేల్ ఫ్యామిలీ ఫ్రెండ్ రాకేష్ పటేల్ తెలిపారు. అమిత్ పటేల్ చాలా మంచి యువకుడని, ఈ దారుణానికి ఎవరు పాల్పడ్డారో తెలియడం లేదని మరో ఫ్యామిలీ ఫ్రెండ్ భీమల్ పటేల్ చెప్పారు.
ఈ ఘటనతో అమిత్ కుటుంబసభ్యులు తీవ్ర ఆవేదనలో కూరుకుపోయారని తెలిపారు. మృతునికి ఏడాది క్రితమే వివాహమైందని చెప్పారు. కాల్పుల ఘటనపై కేసు నమోదు చేసుకున్నామని పోలీసులు తెలిపారు. సిసి కెమెరా ఫుటేజీని పరిశీలించి, నిందితులను తొందరలోనే అరెస్ట్ చేస్తామని చెప్పారు.