చుట్టుముట్టిన రష్యన్ బలగాలు: కీవ్ను ఇప్పటికిప్పుడు ఖాళీ చేయాలి: భారత ఎంబసీ అడ్వైజరీ
వాషింగ్టన్: రష్యా-ఉక్రెయిన్ మధ్య కొనసాగుతోన్న యుద్ధం ఆరో రోజుకు చేరుకుంది. మరింత భీకర రూపాన్ని దాల్చింది. రష్యా సైనిక బలగాలు- ఉక్రెయిన్ రాజధాని కీవ్ను సమీపిస్తోన్నాయి. ఉక్రెయిన్ సైనికుల నుంచి తీవ్ర ప్రతిఘటన ఎదురవుతున్నప్పటికీ.. రష్యా వాటన్నింటినీ అధిగమించాయి. కీవ్కు 40 కిలోమీటర్ల దూరానికి చేరుకున్నాయి. దీనికి సంబంధించిన శాటిలైట్ ఫొటోలు విడుదల అయ్యాయి. రష్యా సైనికుల దూకుడుకు అద్దం పడుతున్నాయి.
Recommended Video
ఈ పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని కీవ్లోని భారత రాయబార కార్యలయం అధికారులు కీలక ప్రకటనను జారీ చేశారు. భారత విద్యార్థులు, పౌరులు తక్షణమే కీవ్ను వీడాలని సూచించారు. ఈ మేరకు తాజాగా అడ్వైజరీని జారీ చేశారు. ఇప్పటికిప్పుడు కీవ్ను వదిలి వెళ్లాలని ఆదేశించింది. ఏ మాత్రం జాప్యం చేయొద్దని పేర్కొంది. ఇంకొన్ని గంటల్లో రష్యా సైనిక బలగాలు కీవ్లోకి చొచ్చుకుని వచ్చే అవకాశం ఉందని భారత రాయబార కార్యాలయం అధికారులు అంచనా వేస్తోన్నారు.
రష్యన్ సైన్యం కీవ్లోకి ప్రవేశించిన తరువాత ఇక్కడి పరిణామాలు మరింత అధ్వాన్నంగా మారొచ్చని అభిప్రాయపడుతున్నారు. ఖార్కీవ్ తరహాలో స్ట్రీట్ఫైట్స్ చోటు చేసుకోవచ్చని, అదే జరిగితే- బయట అడుగు పెట్టలేని పరిస్థితులు ఉంటాయని భావిస్తున్నారు. పరిస్థితులు ఏ క్షణంలోనైనా చేయి దాటిపోతాయనే ఆందోళన భారత రాయబార కార్యాలయం అధికారుల్లో నెలకొంది. దీన్ని దృష్టిలో ఉంచుకుని- ఈ తాజా అడ్వైజరీని జారీ చేశారు.
Advisory to Indians in Kyiv
— India in Ukraine (@IndiainUkraine) March 1, 2022
All Indian nationals including students are advised to leave Kyiv urgently today. Preferably by available trains or through any other means available.
రష్యన్ సైనికులు కీవ్లోకి చొచ్చుకుని వచ్చిన తరువాత- వారిని అడ్డుకునే క్రమంలో యుద్ధం పతాక స్థాయికి చేరుకుంటుందని, అలాంటి పరిస్థితుల్లో రాజధానిని వీడటం ఏ మాత్రం సాధ్యపడకపోవచ్చని అంటున్నారు. యుద్ధం ఆరంభమైనప్పటి నుంచి పలువురు భారత విద్యార్థులు ఉక్రెయిన్ను వీడుతున్న విషయం తెలిసిందే. రోడ్డు మార్గంలో రొమేనియా, పోలెండ్, స్లొవేకియా, హంగేరీ సరిహద్దులకు చేరుకుంటున్నారు. సరిహద్దులను దాటుకున్న తరువాత- స్వదేశానికి బయలుదేరి వస్తున్నారు.
అలా రాలేని విద్యార్థులు వేల సంఖ్యలో ఇంకా కీవ్ సహా వేర్వేరు నగరాల్లో ఉంటోన్నారు. బంకర్లు, అండర్ గ్రౌండ్ మెట్రో స్టేషన్లలో తలదాచుకుంటోన్నారు. ఖార్కీవ్, కీవ్ సహా కొన్ని ప్రధాన నగరాల్లో దుర్భర పరిస్థితులను గడుపుతున్నారు. ఇప్పుడు తాజాగా కీవ్ను రష్యన్ సైనిక బలగాలు చుట్టుముట్టబోతోన్న పరిస్థితుల్లో బయటికి అడుగు పెట్టలేకపోవచ్చు. అందుకే- తక్షణమే వారంతా కీవ్ను వీడాల్సిందేనంటూ భారత రాయబార కార్యాలయం అధికారులు సూచించారు.