చైనా బండారం బయటపెట్టిన భారత సంతతి జర్నలిస్ట్ మేఘా రాజగోపాలన్కు విఖ్యాత Pulitzer పురస్కారం
ప్రపంచ శక్తిగా అవతరించేందుకు తహతహలాడే చైనాలో సొంత ప్రజలపైనే దారుణమైన నిర్బంధం కొనసాగుతోన్న తీరును బయటపెట్టిన భారత సంతతి జర్నలిస్టుకు విశ్వవిఖ్యాత పురస్కారం దక్కింది. ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన పురస్కారాల్లో ఒకటైన పులిట్జర్ అవార్డులు గెలుచుకున్నవారి జాబితా తాజాగా వెలువడింది. 'ఇంటర్నేషనల్ రిపోర్టింగ్' కేటగిరీలో ఏడాది భారత సంతతి జర్నలిస్ట్ మేఘా రాజగోపాలన్ ను అవార్డు వరించింది.
సజ్జల అనూహ్య కామెంట్స్: అమిత్ షాతో జగన్ భేటీ బ్రహ్మాండమా? -రఘురామ, 3రాజధానులు, సీబీఐ కేసులపైనా
చైనాలోని షింజియాంగ్ ప్రావిన్స్ లో వీగర్ ముస్లిం సంతతిపై అక్కడి ప్రభుత్వం సాగిస్తోన్న దమనకాండను ప్రపంచానికి వెల్లడిస్తూ రాసిన కథనాలకు గానూ మేఘా రాజగోపాలన్ కు పులిట్జర్ పురస్కారం దక్కింది. తన కథనాలకు కాంట్రిబ్యూటర్లయిన అలిసన్ కిల్లింగ్, క్రిస్టో బుషెక్ లతో కలిసి మేఘా ఈ అవార్డును పంచుకుంటారు.
పశ్చిమ షింజియాంగ్లో నివసించే వీగర్ సంగతి ముస్లింలపై చైనా ప్రభుత్వం నిర్బంధాన్ని విధించడం, వాళ్ల పిల్లలను ఒక పద్ధతి ప్రకారం తల్లిదండ్రులకు వేరు చేస్తుండటం, మైనారిటీ పిల్లల తల్లిదండ్రులిద్దరినీ నిర్బంధ కేంద్రాల్లో లేదా జైళ్లలో ఉంచుతుండటం, వీగర్ పిల్లల కోసం చైనా భారీగా బోర్డింగ్ స్కూళ్లు కూడా నిర్మిస్తుండటం లాంటి అకృత్యాలను మేఘా రాజగోపాలన్ వెలుగులోకి తెచ్చారు. ముస్లిం సమాజాలకు చెందిన పిల్లలను ఒంటరి చేయడానికే చైనా ఈ ప్రయత్నం చేస్తోందన్న విమర్శలురాగా, డ్రాగన్ దేశం మాత్రం వాటిని ఖండించింది.
Bill Gates: అమెరికాలోనే పెద్ద రైతు -2.7లక్షల ఎకరాల సాగుభూమి -ఆ ఆలుగడ్డలే McDonald's ఫ్రైస్గా
లండన్ లో నివసించే మేఘా రాజగోపాలన్.. అమెరికాకు చెందిన 'బజ్ ఫీడ్ న్యూస్'అనే వెబ్ సైట్ కు రిపోర్టర్ గా వ్యవహరిస్తున్నారు. విదేశీ జర్నలిస్టులపై చైనా నిషేధం విధించగా, షింజియాంగ్ ప్రావిన్స్ ను ఆనుకుని ఉండే దేశాల్లోని సరిహద్దుల్లో సంచరిస్తూ వీగర్ ముస్లింల బతుకులపై ఆమె పరిశోధనాత్మక కథనాలు రాశారు. చైనాలో వీగర్ ముస్లింలపై ప్రభుత్వ దమనకాండ కథనాలకు పులిట్జర్ పురస్కారం దక్కుతుందని అసలు ఊహించనేలేదని మేఘా వ్యాఖ్యానించారు.