ప్రియురాలికి చిత్రహింసలు: పోలీసులకు బూతులు
సింగపూర్: ప్రియురాలిని చిత్రహింసలకు గురి చేసి అడ్డుకోవడానికి వెళ్లిన పోలీసులను అమ్మనాబూతులు తిట్టిన భారత సంతతికి చెందిన (ఎన్ఆర్ఐ) వ్యక్తి జైలుకు వెళ్లాడు. నానా హంగామా చేసి చివరికి జైలులో ఊచలు లెక్కపెడుతున్నాడు.
సింగపూర్ లో నివాసం ఉంటున్న మురుగన్ సుబ్రమణియన్ (44) అనే వ్యక్తికి న్యాయస్థానం 8 నెలలు జైలు శిక్ష, రూ. రెండు లక్షలు జరిమానా విధించిందని స్థానిక మీడియా వెల్లడించింది. వివరాలు ఈ విధంగా ఉన్నాయి.
రాధిక రాజావర్మ (31) అనే మహిళ మొదటి భర్తకు విడాకులు ఇచ్చింది. తరువాత మురుగన్ తో కలిసి సింగపూర్ లో సహజీవనం సాగిస్తున్నది. అయితే కొన్ని నెలల క్రితం రాధిక రాజావర్మ తన మాజీ భర్త ఫోటోలు ఫేస్ బుక్ లో పెట్టింది.
ఈ విషయం తెలుసుకున్న మురుగన్ ప్రియురాలికి చిత్రహింసలు మొదలు పెట్టాడు. ఆమె ముఖం మీద సిగరెట్ తో వాతలు పెట్టాడు. మార్చి 31వ తేదిన గొడవ పెద్దది అయ్యింది. రాధిక తన గదిలోకి వెళ్లి తలుపులు వేసుకుంది.
సహనం కొల్పోయిన మురుగన్ చేతికి చిక్కిన పూలకుండీలు ధ్వంసం చేశాడు. నానాయాగి చేశాడు. అడ్డు వెళ్లిన సోదరి విలాహ్, ఆమె కుమార్తె (16)ను చంపేస్తానని కత్తితో బెదిరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అక్కడికి వెళ్లారు.
అంతే పోలీసులను బూతులు తిట్టడంతో మురుగన్ ను అరెస్టు చేశారు. కేసు విచారించిన న్యాయస్థానం ప్రియురాలికి చిత్రహింసలు పెట్టిన కేసులో 8 నెలలు జైలు శిక్ష విధించింది. ఏప్రిల్ 2 నుంచి అతనికి శిక్ష అమలులోకి వస్తుందని కోర్టు ప్రకటించింది.