హర్భజన్ కౌర్: యూకేలో మేయర్గా ఎన్నికైన తొలి ఆసియా మహిళ
న్యూఢిల్లీ: భారత సంతతికి చెందిన 62 ఏళ్ల హర్భజన్ కౌర్ ధీర్ అనే మహిళా కౌన్సిలర్ యూకేలో మేయర్గా ఎన్నికయ్యారు. ఆసియా దేశాల నుంచి లండన్లో మేయర్గా ఎన్నికైన తొలి మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు.
విక్టోరియా హాల్లో నిర్వహించిన కార్యక్రమంలో హర్భజన్ కౌర్ ధీర్ మేయర్గా మంగళవారం ప్రమాణ స్వీకారం చేశారు. ఆమె కంటే ముందు తేజ్ రామ్ భాగా ఆ పదవిలో ఉన్నారు. లేబర్ పార్టీకి చెందిన ఆమె ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందారు.
దీంతో హర్బజన్ కౌర్ లండన్లోని ఎయిలింగ్ కౌన్సిల్ మేయర్గా ఎన్నికయ్యారు. మేయర్గా ఎన్నికైన అనంతరం ఆమె మాట్లాడుతూ ఇది చాలా గొప్ప గౌరవం, లండన్లో ఎయిలింగ్ కౌన్సిల్ మేయర్గా ఎన్నికవడం సంతోషంగా ఉందన్నారు.
రంజిత్ ధీర్ సహకారం ఉంటే ఎవరెస్టైన అవలీలగా ఎక్కేస్తానని అన్నారు. హర్బజన్ భర్త రంజిత్ ధీర్ గతంలో ఎయిలింగ్ కౌన్సిల్కు మేయర్గా పని చేశారు. 1953లో భారత్లోని పంజాబ్లో జన్మించిన హర్బజన్ కౌర్ ధీర్ 1975లో లండన్కు వచ్చారు.
హర్భజన్ ఇద్దరు పిల్లలకు తల్లిగా తన బాధ్యతలు కూడా నిర్వహిస్తున్నారు. 1995వ సంవత్సరంలో కింగ్స్టన్ యూనివర్సిటీ నుంచి సోషల్ సైన్సులో ఆమె ఉత్తీర్ణులయ్యారు. 2003 వరకు సుర్రీ కంట్రీ కౌన్సిల్లో మెంటల్ హెల్త్ ప్రొపెషనల్గా పని చేశారు.
80 దశకంలో లేబర్ పార్టీలో చేరారు. అటు పార్టీలోనూ ఇటు ప్రజల్లోనూ మమేకమయ్యారు. 90ల్లో ఇంగ్లీషు నేర్చుకునే మహిళలకు సహకారం అందించేందుకు గాను వాలంటీర్గా పనిచేశారు. పిల్లల హక్కుల కోసం పోరాడటంలో, మానసిక ఆరోగ్య సమస్యలు ఉన్నవారికి గొప్ప న్యాయవాదిగా ఉన్నారు.