భారత్పై చైనా మైండ్గేమ్ బిగిన్: రూ.7 వేల కోట్లతో లింక్: భారతీయులు ఆ పని చేయలేరంటూ ధీమా
బీజింగ్: సరిహద్దు వివాదాలను అడ్డుగా పెట్టుకుని భారత్పై కయ్యానికి కాలుదువ్వుతోన్న చైనా.. సరికొత్త ఎత్తుగడను అమలు చేస్తోంది. భారత్పై మైండ్గేమ్ను ఆరంభించింది. లఢక్ వద్ద సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకోవడానికి చర్చల మార్గాన్ని అనుసరిస్తూనే.. మానసికంగా పైచేయి సాధించడానికి ప్రయత్నాలు చేపట్టింది. దీనికోసం ట్రేడ్ వార్ సూత్రాన్ని ప్రవేశపెట్టింది. ఏడువేల కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలతో ముడిపెట్టింది. దీనిపై చైనా మీడియా ప్రత్యేక కథనాలను ప్రచురించింది. భారతీయ జనతా పార్టీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఎన్డీఏ ప్రభుత్వాన్ని అతివాదిగా పేర్కొంది.
చైనా ప్రొడక్ట్ను బహిష్కరించలేరంటూ..
సరిహద్దుల్లో తరచూ ఉద్రిక్తతలకు కారణమౌతూ, అక్రమంగా భారత భూభాగంలోనికి చొచ్చుకుని వస్తున్నారు చైనా పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ (పీఎల్ఏ) సైనికులు. వారిని నిలువరించడానికి సరిహద్దుల్లో మనదేశ జవాన్లకు రోజూ ఓ మినీ యుద్ధమే చేయాల్సి వస్తోంది. అలాంటి చైనాకు బుద్ధి చెప్పేలా చైనా ఉత్పత్తులను బహిష్కరించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇదివరకే ఆర్మీ క్యాంటీన్లలో విదేశీ వస్తువులను బహిష్కరించింది. ఈ చర్యను తప్పు పట్టింది చైనా మీడియా. తమ దేశ ఉత్పత్తులను బహిష్కరించలేదని అంచనా వేస్తోంది.
భారతీయుల జీవితంలో ఓ భాగంగా
చైనా ఉత్పత్తులు భారతీయుల జీవితంలో ఓ భాగం అయ్యాయని, అలాంటి వాటిని బహిష్కరించడం అసాధ్యమంటూ గ్లోబల్ టైమ్స్ ఓ ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. చైనాలో అధికారంలో ఉన్న కమ్యూనిస్టు పార్టీ (సీపీసీ) మౌత్పీస్గా ఈ మీడియా సంస్థకు పేరుంది. భారతీయులు వినియోగించే చైనా వస్తువులకు ప్రత్యామ్నాయ పరికరాలు ఏవీ లేవని గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పేర్కొంది. చైనా వస్తువులను బహిష్కరించడమంటూ జరిగితే భారత్ ప్రతి రోజూ 7000 కోట్ల రూపాయల ఆర్థిక లావాదేవీలను నష్టపోవాల్సి వస్తుందని స్పష్టం చేసింది. చైనా వస్తువులను భారత్ ఎప్పటికీ బహిష్కరించలేదని అభిప్రాయపడింది.
కేంద్రాన్ని అతివాద ప్రభుత్వంగా..
భారత్లో అతివాద ప్రభుత్వం అధికారంలో ఉందని గ్లోబల్ టైమ్స్ పేర్కొంది. దేశభక్తి అనే పదాన్ని ఉపయోగించి చైనా ఉత్పత్తులను బహిష్కరించేలా భారతీయులను రెచ్చగొడుతోందని ఆరోపించింది. చైనాకు వ్యతిరేకంగా భారతీయులను ప్రేరేపిస్తోందంటూ వ్యాఖ్యానించింది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచీ చైనాకు, చైనా ఉత్పత్తులకు వ్యతిరేకంగా ముమ్మరంగా ప్రచారం కొనసాగిస్తోందని, అయినప్పటికీ.. ఈ విషయంలో విజయాన్ని సాధించలేకపోయిందని రాసుకొచ్చింది. ఈ విషయంల్ రిమూవ్ చైనా యాప్స్ ప్రచారాన్ని కూడా తన కథనంలో ప్రస్తావించింది గ్లోబల్ టైమ్స్.
Recommended Video
72 శాతం మార్కెట్ చైనాదే..
నిజానికి- భారత్లో విక్రయమౌతోన్న స్మార్ట్ఫోన్లలో చైనా వాటా సుమారు 72 శాతం ఉంటోంది. టీవీ విక్రయాల్లో 45 శాతం, రోజువారీ గృహోపకరణాలు, ఇతరత్రా నిత్యావసర వినియోగ వస్తువుల్లో 80 శాతం మేర చైనా వస్తువులు విక్రయాలు ఉంటున్నాయి. ఈ విషయాన్ని కూడా గ్లోబల్ టైమ్స్ తన కథనంలో పొందుపరిచింది. తమ జీవనంలో భాగమైన చైనా ఉత్పత్తులను బహిష్కరించడం భారతీయులకు అసాధ్యమని పేర్కొంది. బహిష్కరించిన చైనా వస్తువులకు ప్రత్యామ్నాయ పరికరాలు అందుబాటులో లేవని స్పష్టం చేసింది గ్లోబల్ టైమ్స్.