ట్రంప్, బిడెన్ ఇద్దరికి గురీ భారతీయులపైనే- అమెరికా ఎన్నికల్లో మరోసారి మనోళ్లే కీలకం...
ప్రతిసారీ హోరాహోరీగా సాగే అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయులు కూడా తమ వంతు పాత్ర పోషిస్తున్నారు. అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో భారీగా ఉన్న ఇండో అమెరికన్లు ప్రతిసారీ అధ్యక్ష ఎన్నికల్లో కీలకమవుతుంటారు. అందుకే వీరిని ఆకట్టుకునేందుకు ప్రభుత్వాలు భారత్ పట్ల సానుకూల వైఖరి ప్రదర్శించడం, వారి ఓట్లను తమకు అనుకూలంగా మలుచుకునేందుకు ప్రయత్నించడం సర్వసాధారణమే. ఈసారి కూడా అధ్యక్ష ఎన్నికల బరిలో ఉన్న ఇద్దరు అభ్యర్ధులు డొనాల్డ్ ట్రంప్, జో బిడెన్ కూడా ఈ సారి భారతీయుల ఓట్లపై సీరియస్ గా దృష్టిపెడుతున్నారు. ఎన్నికలకు వంద రోజులు మాత్రమే మిగిలున్న తరుణంలో వీరి మొగ్గు ఎటు ఉండబోతుందన్నది ఉత్కంఠ రేపుతోంది.
Recommended Video

అమెరికా ఎన్నికల్లో భారతీయుల పాత్ర..
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో మరోసారి కీలక పాత్ర పోషించేందుకు ఇండో అమెరికన్లు సిద్ధమవుతున్నారు. జార్జియా, నార్త్ కరోలినా, పెన్సిల్వేనియా, టెక్సాస్, అరిజోనా, ఫ్లోరిడా, మిచిగాన్, విస్కాన్సిన్ వంటి రాష్ట్రాల్లో భారతీయుల సంఖ్య దాదాపు 10 లక్షల పైమాటే. దీంతో రెండు ప్రధాన పార్టీలైన రిపబ్లికన్లు, డెమోక్రాట్లు కూడా భారతీయల ఓట్ల కోసం ఈ రాష్ట్రాలపై దృష్టిపెట్టాయి. ఇప్పటికే ఓ మారు ఈ రెండు రాష్ట్రాల్లో ప్రచారం పూర్తి చేసుకున్న ఇరు పార్టీల అభ్యర్ధులు ట్రంప్, బిడెన్ మరోసారి రంగంలోకి దిగేందుకు సిద్దమవుతున్నారు. గతంలో జరిగిన పలు ఎన్నికల్లో ఇక్కడ భారతీయుల ఓట్లే నిర్ణయాత్మకం కావడంతో ఈసారి కూడా వీరి ప్రభావంపై భారీ అంచనాలున్నాయి.

మరోసారి రిపబ్లికన్స్ వైపే మొగ్గు...
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో సాధారణంగా రిపబ్లికన్ల కంటే డెమోక్రాట్ల వైపే భారతీయులు మొగ్గుచూపుతుంటారు. రిపబ్లికన్ల అతివాద వైఖరి కూడా ఇందుకు ఓ కారణం. అయితే ఈసారి ఇండో అమెరికన్లు రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపవచ్చన్న అంచనాలతో ఇరు పార్టీల మధ్య హోరాహోరా పెరిగింది. దీంతో కీలకమైన వీరి ఓట్లను తమ వైపు మళ్లించుకునేందుకు ఇరు పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. ట్రంప్ హయాంలో భారత్ తో పెరిగిన సత్సంబంధాల దృష్ట్యా వీరు రిపబ్లికన్ల వైపు మొగ్గు చూపుతారనే అంచనాలు ఉన్నాయి. అదే సమయంలో ఓ వర్గంలో ట్రంప్ విధానాలపై అసంతృప్తి వ్యక్తమవుతోంది.

డెమోక్రాట్లను వెంటాడుతున్న గతం...
గతసారి జరిగిన అధ్యక్ష ఎన్నికల్లో డెమెక్రాట్ల తరఫున బరిలోకి దిగిన హిల్లరీ క్లింటన్ ఇండో అమెరికన్ ఓట్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లోనే ప్రభావం చూపలేకపోయారు. ఆయా చోట్ల అతి తక్కువ ఓట్ల మెజారిటీ సాధించడం, కొన్ని చోట్ల వాటిని కూడా కోల్పోవడం హిల్లరీ కొంప ముంచింది. ఉదాహరణకు పెన్సిల్వేనియా వంటి రాష్ట్రంలో లక్షా 56 వేల మంది భారతీయ ఓటర్లుండగా.. అక్కడ కేవలం 42 వేల ఓట్ల తేడాతో హిల్లరీ దెబ్బతిన్నారు. దీంతో చేదు అనుభవాలను మర్చిపోయి ఈసారి ఎలాగైనా డెమెక్రాట్లకు అనుకూలంగా ఉన్న రాష్ట్రాల్లో ప్రభావం చూపాయని బిడెన్ భావిస్తున్నారు.

రిపబ్లికన్లకు సానుకూల పరిస్ధితి..
డెమోక్రాట్లకు భారతీయులను దూరం చేసేందుకు గత కొన్నేళ్లుగా పావులు కదుపుతున్న ట్రంప్... ఇప్పటికే నమస్తే ట్రంప్, హౌడీ మోడీ వంటి భారీ కార్యక్రమాలను నిర్వహించారు. వీటితో భారతీయులకు తాము అనుకూలమన్న సంకేతాలు పంపారు. అంతర్జాతీయంగా కూడా భారత్ కు అనుకూలంగా ట్రంప్ సర్కార్ పలు నిర్ణయాలు తీసుకుంది. దీంతో ఈసారి రిపబ్లికన్ల వైపు ఇండో అమెరికన్లు మొగ్గవచ్చన్న సంకేతాలు ఉన్నాయి. అయినా ఏమాత్రం ఏమరుపాటుగా ఉండరాదని భావిస్తున్న ట్రంప్.. మాసన్ నేతృత్వంలో 100 మందితో ఓ వ్యూహబృందాన్ని ఏర్పాటు చేసి ముందుకు సాగుతున్నారు. గత ఎన్నికల్లో ట్రంప్ ఇండో అమెరికన్ల మద్దతు లేకుండానే గెలిచారు. అయినా తాజా పరిస్ధితుల నేపథ్యంలో వారి ఓట్లను కూడా సాధించేందుకు ట్రంప్ ప్రయత్నిస్తున్నారు.












Click it and Unblock the Notifications