1962ను గుర్తు చేశారుగా, కానీ: చైనాకు జైట్లీ దిమ్మతిరిగే జవాబు
భారత1962 యుద్ధం గుర్తుంచుకోవాలన్న చైనాకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీటైన జవాబిచ్చారు. నాటి భారత్ వేరు, ఇప్పటి భారత్ వేరు అని, అది తెలుసుకోవాలని డ్రాగన్ కంట్రీకి హితవు పలికారు.
న్యూఢిల్లీ: భారత1962 యుద్ధం గుర్తుంచుకోవాలన్న చైనాకు కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ ధీటైన జవాబిచ్చారు. నాటి భారత్ వేరు, ఇప్పటి భారత్ వేరు అని, అది తెలుసుకోవాలని డ్రాగన్ కంట్రీకి హితవు పలికారు.
1962 యుద్ధం గుర్తుందిగా: చైనా వివాదాస్పద వ్యాఖ్యలు.. తీవ్రంగా హెచ్చరించిన భారత్
చరిత్ర చూసుకుని ముందడుగు వేయాలని గురువారం చైనా పలికిన మాటలకు జైట్లీ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. చరిత్రలో ఉన్న భారత్, ఇప్పటి భారత్ వేర్వేరని వ్యాఖ్యానించారు.
1962 గుర్తు చేశారుగా.. కానీ
సిక్కింలో ప్రవేశిస్తున్న వారి దళాలను అడ్డుకున్నందుకు చైనా '1962లో జరిగిన సంఘటన దృష్టిలో పెట్టుకొని ముందడుగు వేయండి, లేదంటే మమ్మల్ని ముందుకు రానీయండి' అంటూ భారత సైన్యాన్ని హెచ్చరించింది. దీనిపై జైట్లీ ఘాటుగా స్పందించారు. '1962 సంగతి గుర్తు చేశారుగా... అప్పుడున్న భారత్ ఇప్పుడున్న భారత్ వేర్వేరు అనే విషయం మీరు కూడా గుర్తుతెచ్చుకోండి' అన్నారు.
పక్క దేశాల భాగాలను ఆక్రమించడమా?
తమ భూభాగాన్ని చైనా ఆక్రమిస్తున్నట్టు ఇప్పటికే భూటాన్ ప్రభుత్వం చేసిన ప్రకటనను అరుణ్ జైట్లీ గుర్తు చేశారు. ఇలా పక్క దేశాల భూభాగాలను ఆక్రమించడం ఎంత మాత్రం తగదని జైట్లీ చెప్పారు.
ఇది చైనా తీరు
భారత్ను ఈశాన్య రాష్ట్రాలతో కలిపే డోఖలా ప్రాంతంలోని సిలిగురి కారిడార్ తమ సైన్య సౌకర్యార్థం సిక్కిం-భూటాన్-టిబెట్లను కలుపుతూ చైనా మార్గం నిర్మించాలనుకుంటోంది. వివాదాస్పద ప్రాంతంలో మార్గం నిర్మించే ప్రయత్నాలను భారత ఆర్మీ అడ్డుకుంది. జమ్మూ కాశ్మీర్ నుంచి అరుణాచల్ ప్రదేశ్ వరకు 3,488 కి.మీ.ల మేర చైనాతో భారత్కు ఉన్న సరిహద్దులో 220 కి.మీ.లు సిక్కింలో ఉంది.
విదేశాంగ శాఖ కూడా..
తమ సరిహద్దుల్లోకి భారత సైన్యం ప్రవేశించిందని, రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకుంటుందని చైనా చేసిన ఆరోపణలను మన విదేశాంగ శాఖ కూడా అంతకుముందు ఖండించింది. సిక్కిం సెక్టార్లో చైనా ప్రవర్తిస్తున్న తీరు విచారకరమన్నారు. రోడ్డు నిర్మాణ పనులను అడ్డుకునే ఉద్దేశమే తమకు లేదని, ఇదే విషయాన్ని చైనాకు చెప్పినట్లు విదేశాంగశాఖ తెలిపింది. తాజా పరిస్థితులపై చైనా నిగ్రహం పాటించాల్సిన అవసరముందని అభిప్రాయం వ్యక్తం చేసింది. సరిహద్దు పరిష్కారానికి చైనాతో కలిసి చర్చించేందుకు భారత్ సిద్ధంగా ఉందని తెలిపింది.
ఇదీ చైనా హెచ్చరిక
సిక్కిం సెక్టార్ డాంగ్లాంగ్(డొక్లాం) ప్రాంతంలో తమ దేశ సరిహద్దుల్లోకి భారత సైన్యం ప్రవేశించిందని, వెంటనే వెనక్కి వెళ్లిపోవాలని చైనా గురువారం హెచ్చరించింది. అంతేగాక, భూటాన్కు మద్దతుగా ఉంటూ డొక్లాంలో చైనా నిర్మిస్తున్న రహదారిని అడ్డుకోవాలని చూస్తోందని భారత్పై ఆరోపణలు చేసింది.