గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చిక్కుకున్న భారత కార్గో నౌక- రంగంలోకి ఐఎన్ఎస్ తల్వార్
భారత్కు చెందిన వ్యాపార కార్గోనౌక ఎంవీ నయన్ ఈ నెల 9న ఇరాక్కు వెళ్తుండగా.. గల్ఫ్ ఆఫ్ ఒమన్ వద్ద సముద్రంలో చిక్కుకుపోయింది. సాంకేతిక కారణాలతో ఎంవీ నయన్ సముద్రంలో నిలిచిపోవడంతో సిబ్బంది భయాందోళనకు గురయ్యారు. వెంటనే భారత నౌకాదళానికి కాపాడాలని అభ్యర్ధించారు. దీంతో నేవీ భారత యుద్ధనౌక ఐఎన్ఎస్ తల్వార్ను రంగంలోకి దింపింది.
ఈ నెల 9న ఒమన్ నుంచి బయలుదేరిన ఎంవీ నయన్ ఇరాక్ వెళ్లే క్రమంలో గల్ఫ్ ఆఫ్ ఒమన్లో చిక్కుకుంది. ప్రొపెల్లర్ వైఫల్యం, విద్యుద్ ఉత్పత్తిలో సమస్యలు, నావిగేషన్ సామాగ్రి పనిచేయకపోవడంతో సముద్రంలో మునిగిపోయే పరిస్ధితి. వీటిని సరిదిద్దేందుకు తొలుత ప్రయత్నించిన నౌకలో సిబ్బంది తమ వల్ల కాకపోవడంతో భారత నౌకాదళం సాయం కోరారు. దీంతో వెంటనే స్పందించిన నౌకాదళం వారిని కాపాడేందుకు ఐఎన్ఎస్ తల్వార్ను పంపింది. ఇప్పుడు తల్వార్ అక్కడికి చేరుకుని సమస్యను సరిచేసే ప్రయత్నంలో ఉంది.
నావిగేషన్ సమస్యల కారణంగా ఎంవీ నయన్ ముందుకు కదల్లేని పరిస్ధితి. దీంతో సాధ్యమైనంతగా మరమ్మత్తులు చేసి సమీపంలోని పోర్టు వరకైనా ఈ వ్యాపార కార్గోనౌకను పంపేందుకు ఐఎన్ఎస్ తల్వార్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. రష్యా నుంచి భారత్ కొనుగోలు చేసిన తల్వార్ నౌకలు మన దేశానికి 2003 నుంచి సేవలు అందిస్తున్నాయి. ఇలాంటి ఆపరేషన్లు చేపట్టడంలో వాటికి మంచి అనుభవం ఉంది. దీంతో ఎంవీ నయన్ను రక్షించేందుకు నౌకాదళం తల్వార్ నౌకను పంపింది. గతంలో సోమాలియాలో సముద్ర దొంగలను సైతం ఎదుర్కొన్న అనుభవం వీటికి ఉంది.