ఇంటెల్ షాకింగ్: 12వేల ఉద్యోగుల తొలగింపు
న్యూయార్క్: అమెరికాకు చెందిన చిప్ల తయారీ దిగ్గజం ఇంటెల్ ఆశ్చర్యకర నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా 12వేల ఉద్యోగాల కోత విధించనున్నట్టు ఇంటెల్ మంగళవారం ప్రకటించింది. పర్సనల్ కంప్యూటర్ల మార్కెట్ పడిపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఇంటెల్ తెలిపింది.
కొత్తగా టెక్నాలజీ వాడే వినియోగదారులందరూ మొబైల్ ఫోన్లు, ట్యాబ్లెట్ పీసీల వైపు ఎక్కువగా మొగ్గుచూపుతుండడంతో, డెస్క్ టాప్ వ్యాపారాలపై తక్కువగా దృష్టిసారించనున్నట్టు ఇంటెల్ తెలిపింది.
మైక్రోసాప్ట్, హ్యూలెట్ ప్యాకర్డ్ లాంటి కంపెనీలు సైతం పర్సనల్ కంప్యూటర్ పరిశ్రమ నుంచి తీవ్ర ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి. మరోవైపు ప్రపంచవ్యాప్తంగా పీసీల సరుకు రవాణా మొదటి త్రైమాసికంలో 11.5 శాతం పడిపోయిందని టెక్ రీసెర్చ్ కంపెనీ ఐడీసీ తెలిపింది.
ప్రపంచంలోనే అతిపెద్ద చిప్ తయారీ సంస్థగా పేరున్న ఇంటెల్, ఈ ఏడాది ఆర్జించే ఆదాయాలు తక్కువగా ఉంటాయని అంచనా వేస్తోంది. ఇంటెల్ షేర్లు సైతం 2.2 శాతం తక్కువగా ట్రేడ్ అవుతున్నాయి. ఇంటెల్ ఫ్యాక్టరీలు ఎక్కువగా అమెరికాలో ఉండటంతో, ఎక్కడ ఉద్యోగుల కోత విధించనున్నారో తెలియాల్సి ఉంది.
ఇలా ఉద్యోగాల కోత 2017 మధ్య వరకూ కొనసాగిస్తామని ఇంటెల్ పేర్కొనడంతో ఆ కంపెనీ ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. కంపెనీకి కొత్త సీఈవోను నియమించే ప్రక్రియ కొనసాగుతుందని ఇంటెల్ పేర్కొంది.