నీరవ్ మోడీ సోదరుడి కోసం ఇంటర్ పోల్ వల: రెడ్ కార్నర్ నోటీసులు
న్యూఢిల్లీ: మనదేశంలో బ్యాంకులకు వేలాది కోట్ల రూపాయల మేర కుచ్చుటోపి పెట్టి విదేశాలకు పారిపోయిన వజ్రాల వ్యాపారి, ఫైర్ స్టార్ డైమండ్ ఇంటర్నేషనల్ సంస్థ మాజీ అధినేత నీరవ్ మోడీ చుట్టూ ఉచ్చు మరింత బిగుసుకుంటోంది. తాజాగా- ఆయన సోదరుడు నేహాల్ దీపక్ మోడీ కోసం ఏకంగా ఇంటర్ పోల్ రంగంలోకి దిగింది. నేహాల్ దీపక్ మోడీ కోసం అన్ని దేశాలకూ రెడ్ కార్నర్ నోటీసులను జారి చేసింది. నిహాల్ దీపక్.. ఎక్కడ? ఎలా? ఉన్నా వెంటనే అరెస్టు చేయాలని ఇంటర్ పోల్ ఆదేశించింది. నేహాల్ దీపక్ కు బెల్జియం పౌరసత్వం ఉంది. చాలాకాలం నుంచీ ఆయన అమెరికాలోని న్యూయార్క్ లో నివాసం ఉంటున్నారు. నీరవ్ మోడీకి చెందిన ఫైర్ స్టార్ డైమండ్స్ సంస్థకు డైరెక్టర్ గా పనిచేశారు. నీరవ్ మోడీ అమెరికాలో అదే పేరుతో వజ్రాల వ్యాపార సంస్థను ప్రారంభించగా.. డైరెక్టర్ హోదాలో నేహాల్ దీపక్ దాని కార్యకలాపాలను పర్యవేక్షించారు.
విక్రమ్ ల్యాండర్ అన్వేషణలో నాసా తుది ప్రయత్నం: ఆర్బిటన్ ద్వారా ఫొటోలు!
తాజాగా- అమెరికాలో కూడా సంస్థ దివాళా తీసింది. అమెరికా బ్యాంకులను మోసగించింది. కొద్దిరోజులుగా నేహాల్ దీపక్ కనిపించకుండా పోయారు. సంస్థను మూసివేసిన వెంటనే నేహాల్ దీపక్ కుటుంబం భారత్ కు తరలివచ్చింది. ఆయన మాత్రం రాలేదు. అరెస్టు చేస్తారనే భయంతో అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం ఏ దేశంలో ఉన్నారో తెలియని పరిస్థితి నెలకొంది. దీనితో ఇంటర్ పోల్ రంగంలోకి దిగింది. నేహాల్ దీపక్ ను అరెస్టు చేయాలని ఆదేశిస్తూ అన్ని దేశాలకూ రెడ్ కార్నర్ నోటీసులను జారీ చేసింది. నీరవ్ మోడీ ప్రస్తుతం లండన్ లో జైలు శిక్షను అనుభవిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నకు సుమారు 5,400 కోట్ల రూపాయల మేర రుణాలను ఎగ్గొట్టి లండన్ కు పారిపోగా.. అక్కడ ఆయనపై కేసు నమోదైంది. ప్రస్తుతం లండన్ పోలీసుల కస్టడీలో ఉన్నారు నీరవ్ మోడీ. పోలీసుల కస్టడీ ఈ నెల 19వ తేదీన ముగియబోతోంది.
నీరవ్ మోడీని ఆర్థిక నేరస్తుడిగా గుర్తించడానికి అవకాశం గల కీలక డాక్యుమెంట్లను నేహాల్ దీపక్ మోడీ ధ్వంసం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, హాంగ్ కాంగ్, బ్రిటీష్ వర్జిన్ ఐలండ్స్, అమెరికా, బార్బడోస్ సహా పలు దేశాల్లో నీరవ్ మోడీ ఏర్పాటు చేసిన సంస్థల్లో చోటు చేసుకున్న ఆర్థిక అవకతవకలకు ఆధారమైన డాక్యుమెంట్లను నేహాల్ దీపక్ తగులబెట్టినట్లు చెబుతున్నారు.
ఆయా కారణాలన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఇంటర్ పోల్ అధికారులు రెడ్ కార్నర్ నోటీసును జారీ చేశారు. నేహాల్ దీపక్ ఏ దేశంలో ఉన్నా ఆయనను గుర్తించిన వెంటనే పోలీసులు తమ అదుపులోకి తీసుకోవడం ఖాయమని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ కార్యాలయం అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం గుజరాత్ లోని సూరత్ లో ఉన్న ఆయన కుటుంబీకులను ప్రశ్నించే అవకాశాలు లేకపోలేదని తెలుస్తోంది.