ఆత్మ మండింది: నిర్భయ కేసు దోషిని ఇంటర్వ్యూ చేసిన లెస్లీ
న్యూఢిల్లీ,: నిర్భయ గ్యాంగ్రేప్పై తాను తీసిన డాక్యుమెంటరీ చిత్రం ‘ఇండియాస్ డాటర్'లో ఎలాంటి సంచలనాలు లేవని బ్రిటన్కు చెందిన చిత్ర దర్శకురాలు లెస్లీ ఉడ్విన్ స్పష్టం చేశారు. ఈ డాక్యుమెంటరీలో మహిళలపై మగవారి దృష్టికోణాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేశామన్నారు. చిత్రనిర్మాణంలో భాగంగా గ్యాంగ్రేప్ కేసులో జైలు శిక్ష అనుభవిస్తున్న ముఖేష్ సింగ్తో లెస్లీ చేసిన ఇంటర్వ్యూపై నిరసనలు వెల్లువెత్తుతున్నాయి.
దీనిపై స్పందించిన లెస్లీ మంగళవారం మీడియాతో మాట్లాడారు. తీహార్ జైలు డైరక్టర్ జనరల్ అనుమతితోనే తాను ముఖేష్ని ఇంటర్వ్యూ చేశానని చెప్పారు. రేపిస్టుల్లో ఒకడిని ఇంటర్వ్యూ చేసిన తర్వాత తన ఆత్మ తారులో ముంచినట్లు కాలిందని ఆమె అన్నారు. ఢిల్లీ గ్యాంగ్ రేప్ బాధితురాలు నిర్భయ కేసులో నిందితుడైన ముకేష్ సింగ్ను ఆమె ఇంటర్వ్యూ చేశారు.
అత్యాచారానికి అమ్మాయి కారణమని ముకేష్ సింగ్ అన్నాడు. అత్యాచారం చేసినందుకు అతను కించిత్తు పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేయలేదు. అత్యాచారం చేసినప్పుడు ఆమె ఎదుర్కోకకుండా సహకరించి ఉండాల్సిందని, అలా చేసి ఉంటే ఆమె జీవించి ఉండేదని అతను అన్నాడు.
అతని వ్యాఖ్యలు సోమవారం డైలీ టెలిగ్రాఫ్లో అచ్చయ్యాయి. దాంతో ప్రపంచవ్యాప్తంగా సంచలం రేగింది. ఈస్ట్ ఈజ్ ఈస్ట్ అనే ఆమె చిత్రం 1999లో బాఫ్టా అవార్డుకు నామినేట్ అయింది. తన పరిశోధనలో భాగంగా నిర్భయ రేపిస్టులను కలిసినట్లు ఆమె తెలిపారు. సింగ్ను, ఇతర నలుగురు రేపిస్టులను కలిసినప్పుడు తన గుండెను తారులో ముంచినట్లు అనిపించిందని, ఆ బాధను తొలగించే పదార్థమేదీ ప్రపంచం లేదని ఆమె అన్నారు.