ఇరాన్ సుప్రీం లీడర్ కు నో లైఫ్ గ్యారెంటీ- మట్టుబెట్టడం తథ్యం: నెతన్యాహు శపథం
ఇరాన్పై అమెరికా-ఇజ్రాయెల్ జాయింట్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతున్న నేపథ్యంలో ప్రధానమంత్రి బెంజమిన్ నెతన్యాహు తెరమీదికి వచ్చారు. జెరూసలేంలో విలేకరులతో మాట్లాడారు. ఈ యుద్ధం ఊహించిన దానికంటే మెరుగ్గా సాగుతోందని, మునుపెన్నడూ లేనంత బలంగా ఉందని తమ దేశ సైన్యం దాడికి దిగుతోందని అన్నారు. ఇరాన్ కొత్త సుప్రీమ్ లీడర్ మొజ్తబా ఖమేనీకి హెచ్చరికలు జారీ చేశారు. ఆయనకు ఎటువంటి జీవిత బీమా ఉండదని ప్రకటించారు.
మొజ్తబా ఖమేనీ, హిజ్బుల్లా నాయకుడు నెమ్ ఖస్సెమ్లను ఇజ్రాయెల్ లక్ష్యంగా చేసుకుంటుందా అనే ప్రశ్నకు నెతన్యాహు స్పందించారు. ఏ ఉగ్రవాద సంస్థల నాయకులకూ తాను జీవిత బీమా పాలసీ తీసుకోబోనని బదులిచ్చారు. ఉగ్రవాదులకు ఎవరికీ భద్రత లేదని తేల్చి చెప్పారు. ఇజ్రాయెల్ రోరింగ్ లయన్, అమెరికా ఎపిక్ ఫ్యూరీ ఆపరేషన్కు ఎదురులేదని వ్యాఖ్యానించారు. మొజ్తబా ఖమేనీ, ఉగ్రవాద సంస్థలను మట్టుబెట్టేంత వరకు విశ్రమించబోమని అన్నారు.

ఈ జాయింట్ ఆపరేషన్ లక్ష్యం ఇరాన్ అణ్వాయుధ ఉద్దేశాలను అడ్డుకోవడం, మిస్సైల్ ప్రోగ్రామ్ ను నిర్వీర్యం చేయడంతో పాటు ఆ దేశానికి సహకరిస్తోన్న మిత్రులను తీవ్రంగా దెబ్బ తీయడమేనని నెతన్యాహు ప్రకటించారు. ఇరాన్లో పాలన మార్పు అంశంపైనా ఆయన మాట్లాడారు. తమపై ఉన్న క్రూర నిరంకుశ పాలనను తొలగించుకోవడానికి అవసరమైన పరిస్థితులను ఇరాన్ ప్రజలకు సృష్టించేందుకు కృషి చేస్తున్నామని చెప్పారు.
ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్, బాసిజ్లను క్షేత్రస్థాయిలో దెబ్బతీస్తోన్నామని, చెక్పోస్టులను ధ్వంసం చేస్తోన్నామని నెతన్యాహు తెలిపారు. ఈ సైనిక కార్యకలాపాలు ఇక్కడితో ఆగబోవని ఇంకా కొనసాగుతాయని తేల్చి చెప్పారు. ఇరాన్ ప్రజలు స్వేచ్ఛను కోరుకుంటోన్నారని, వారికి అండగా ఉంటామని, అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందిస్తామని అన్నారు. ఈ యుద్ధం వల్ల ఇకపై అదే పాత ఇరాన్ ఉండబోదని, మధ్యప్రాచ్యం కూడా మరుతుందని వ్యాఖ్యానించారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో తన సంబంధాన్ని నెతన్యాహు ప్రత్యేకంగా ప్రస్తావించారు. అతి గొప్ప స్నేహితుడిగా అభివర్ణించారు. ట్రంప్తో కలిసి జాయింట్ ఆపరేషన్ నిర్వహించడం ద్వారా గతంలో ఎప్పుడూ లేనంత బలమైన కూటమిని సృష్టించామని పేర్కొన్నారు. ఒక అమెరికా అధ్యక్షుడు, ఇజ్రాయెల్ ప్రధానమంత్రి మధ్య గతంలో ఉన్న సంబంధాల కంటే ఇప్పుడు వంద రెట్లు బలంగా ఉందని చెప్పారు.












Click it and Unblock the Notifications