ఇరాన్ చేతికి బాబ్ ఎల్-మాండెబ్? ట్రంప్ తో పాటు భారత్ కూ ఇక కష్టాలే..!
పశ్చిమాసియాలో మరోసారి వేగంగా భారీ యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. అమెరికా, ఇరాన్ల (Iran) మధ్య ఇన్నాళ్లూ కొనసాగిన తాత్కాలిక యుద్ధ విరామం ముగియడంతో శత్రుత్వం మళ్లీ తారాస్థాయికి చేరింది. ఫలితంగా ఉభయ దేశాల మధ్య మూడో విడత తీవ్రమైన ఘర్షణలు ప్రారంభమయ్యే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా అరేబియా ద్వీపకల్పంలో చోటుచేసుకుంటున్న తాజా సైనిక చర్యలు ప్రపంచ దేశాల ఇంధన భద్రతకు తీవ్ర సవాలుగా పరిణమిస్తున్నాయి. ఇవి అంతిమంగా అమెరికాలో మధ్యంతర ఎన్నికలపైనా, భారత్ లో ఇంధన భద్రతపైనా ప్రభావం చూపబోతున్నాయి.
ఇరాన్ దన్నుతో విజృంభిస్తోన్న హూతీలు (Houthis) బాబ్ ఎల్-మాండెబ్ (Bab El-Mandeb) జలసంధి సమీపంలోని మోఖా నౌకాశ్రయంతో పాటు మయూన్, పెరిమ్ వంటి కీలక దీవులను స్వాధీనం చేసుకున్నారు. దీనివల్ల 26 కిలోమీటర్ల పరిధి ఉన్న ఈ ప్రధాన సముద్ర మార్గం గుండా వెళ్లే అంతర్జాతీయ వాణిజ్య నౌకలను వారు నేరుగా లక్ష్యంగా చేసుకునే అవకాశం ఏర్పడింది. మరోవైపు హార్ముజ్ జలసంధిలో అమెరికా, ఇరాన్ దళాల మధ్య పరస్పర దాడులు కూడా తీవ్రమవుతున్నాయి. అమెరికా ఆర్థిక దిగ్బంధనం చేస్తుంటే, ఇరాన్ సరిహద్దుల్లోని తన స్థావరాల నుంచి క్షిపణులతో దాడులకు దిగుతోంది. దీంతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు ఒక్కసారిగా రికార్డు స్థాయికి దూసుకుపోయి బ్యారెల్కు 108 డాలర్లకు చేరాయి. ఇది భారత ఆర్థిక వ్యవస్థపై అనూహ్య భారాన్ని మోపనుంది. చమురు ధరల్లో ప్రతి ఒక్క డాలర్ పెరిగినా భారత్కు సుమారు 2 బిలియన్ డాలర్ల (దాదాపు 19 వేల కోట్లు) అదనపు విదేశీ మారకద్రవ్య అత్యవసర వ్యయం తప్పదు.

ప్రస్తుతం భారత్ తన మొత్తం చమురు అవసరాల కోసం సౌదీ అరేబియా లాంటి అరబ్ దేశాలపైనే ఎక్కువగా ఆధారపడుతోంది. భారత్కు అవసరమైన ముడి చమురులో దాదాపు 8 శాతాన్ని సౌదీ అరేబియా తన ఎర్ర సముద్ర తీరంలోని యాన్బు పోర్టు ద్వారా రవాణా చేస్తుంది. అయితే హౌతీల దాడుల ముప్పు కారణంగా ఈ కీలక సరఫరా వ్యవస్థ ప్రమాదంలో పడింది. దీనికి తోడు, ఇరాక్ వైపు నుంచి వచ్చిన డ్రోన్ దాడుల కారణంగా సౌదీ అరేబియా తన 1201 కిలోమీటర్ల పొడవైన ప్రతిష్టాత్మక తూర్పు-పడమర పైప్లైన్ను తాత్కాలికంగా నిలిపివేయాల్సి వచ్చింది. దీనివల్ల సౌదీ ముడి చమురు ఉత్పత్తి సామర్థ్యం గణనీయంగా పడిపోయింది. అటు అమెరికాలో రానున్న ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రచారానికి ఆటంకం కలిగించడమే ఇరాన్ తాజా వ్యూహమని విశ్లేషకులు భావిస్తున్నారు. చమురు ధరలు పెరిగితే ట్రంప్ పార్టీకి ఎన్నికల్లో నష్టం తప్పేలా లేదు.














Click it and Unblock the Notifications
