ఉగ్రవాద సామ్రాజ్యం కోసం ఐఎస్ఐఎస్ యత్నం
లండన్: సిరియా, ఇరాక్ దేశాల్లో తమ ప్రాబల్యాన్ని పెంచుకుని సొంతంగా ఉగ్రవాద సామ్రాజ్యాన్ని స్థాపించాలని ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్ఐఎస్) ప్లాన్ వేసిందనే రహస్యం బయటపడింది. ఐఎస్ఐఎస్ రెండు దేశాలను పూర్తిగా తమ ఆధీనంలోకి తీసుకోవాలని ప్రయత్నించిందని వెలుగు చూసింది.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు ప్రణాళికలు రచించుకున్నట్లు ఆధారాలు బయటపడ్డాయని, దీనికి సంబంధించిన 24 పేజీలతో కూడిన వ్యవహార పత్రాలు లీకయ్యాయని లండన్ లోని గార్డియన్ అనే దిన పత్రిక ప్రచురించింది.
అంతే కాకుండ సిరియా, ఇరాక్ దేశాల్లోని అన్ని ప్రభుత్వ శాఖలను తమ ఆధీనంలోకి తెచ్చుకునేందుకు ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు కుట్రపన్నారని ఆ పత్రిక పేర్కోనింది. బయటపడిన ఈ ప్రతాలకు ముందుగానే ఇస్లామిక్ స్టేట్ పరిపాలన నిబంధనలు అనే పేరు పెట్టారని వెలుగు చూసింది.
ఈజిప్టుకు చెందిన అబు అబ్దుల్లా అల్ మస్రీ అనే వ్యక్తి ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదుల పరిపాలన కోసం 10 చాప్టర్లు వ్రాశాడు. 2014 జూన్-ఆక్టోబర్ మధ్య కాలంలో దీనిని రాసినట్లు ఉందని ఆ దిన పత్రిక వివరించింది.
ఇరాక్, సిరియా దేశాలలో విద్య ఎలా ఉండాలి, పరిశ్రమలు ఎలా స్థాపించాలి, సహజ వనరులు ఎలా ఉపయోగించుకోవాలి, దౌత్యం, మతపరమైన ప్రచారం ఎలా చెయ్యాలి, మిలటరిని ఎలా ఉపయోగించుకోవాలి అంటూ అందులో క్షుణ్ణంగా వ్రాశారని వెలుగు చూసింది.
ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు క్షేత్ర స్థాయిలో అన్నీ పరిశీలించిన తరువాత ఒక్కోక్కటిగా దాడి చేస్తూ రెండు దేశాలను ఆక్రమించుకుంటూ వస్తున్నదని స్పష్టంగా వెలుగు చూసిందని గార్డియన్ పత్రిక వివరించింది. ఇస్లామిక్ స్టేట్ దగ్గర పక్కా వ్యూహం ఉందని ఈ ఆదారాలు చెబుతున్నాయని తెలిపింది.