ఇస్రో రికార్డ్: దిగొచ్చిన చైనా, భారత్ నుంచి మేం పాఠాలు నేర్చుకోవాలని...
ఇస్రో ఇటీవల 104 ఉపగ్రాహలను ఒకేసారి పంపించి రికార్డ్ సృష్టించింది. దీనిపై చైనా మీడియా ప్రశంసించినప్పటికీ.. మా అంత కాదని వ్యాఖ్యానించింది.
బీజింగ్: ఇస్రో ఇటీవల 104 ఉపగ్రాహలను ఒకేసారి పంపించి రికార్డ్ సృష్టించింది. దీనిపై చైనా మీడియా ప్రశంసించినప్పటికీ.. మా అంత కాదని వ్యాఖ్యానించింది. అయితే, ఎట్టకేలకు భారత్ నుంచి బీజింగ్ పాఠాలు నేర్చుకోవాలి తాజాగా చైనా మీడియా పేర్కొంది.
మొత్తానికి ఆ దేశం దిగి వచ్చింది. ఇస్రో రికార్డుపై ప్రపంచమంతా కీర్తించింది. చైనా మాత్రం ఆ పని చేయలేకపోయింది. ఇప్పుడు భారత్పై ప్రశంసలు కురిపిస్తోంది.
పీఎస్ఎల్వీ సీ-37 ద్వారా ఒకేసారి 104 ఉపగ్రహాలను ఇస్రో నింగిలోకి పంపి చరిత్ర సృష్టించింది. ఇది భారత్ సాధించిన ఘన విజయమని ప్రపంచమంతా భారత్ను కీర్తించింది. అయితే చైనా మాత్రం అదేమంత పెద్ద విషయం కాదని తేల్చేసింది.
మొదట్లో తక్కువగా కనిపించిన ఈ విషయం ఇప్పుడు చైనాకు చాలా పెద్దగా అనిపించడంతో ప్రశంసించడం మొదలుపెట్టింది. అంతేకాదు తమ దేశం కంటే కూడా భారత్ చాలా గొప్ప పని చేసిందంటూ అక్కడి పత్రికలు ఆకాశానికెత్తేస్తున్నాయి.
అతి తక్కువ ధరకే వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడంతో భారత్ తమ దేశం కంటే ఎంతో ముందుందని అక్కడి పత్రికలు కథనాలు రాస్తున్నాయి. అంతేకాదు భారత్ను చూసి అంతకంటే మనం ముందుండాలంటూ శాస్త్రవేత్తలకు చైనా ప్రభుత్వం సూచించిందని పేర్కొన్నాయి.
వాణిజ్య ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపడం ద్వారా తమ దేశ ఆర్థిక వ్యవస్థను మరింత బలోపేతం చేసుకోవాలని చైనా యోచిస్తోంది. అంతరిక్ష వ్యాపారంలో తాము అందరికంటే ముందున్నామని భారత్ తన తాజా ప్రయోగం ద్వారా నిరూపించిందని చైనా ఉన్నతాధికారి ఒకరు పేర్కొన్నారు.