ట్రంప్ ఆంక్షలు సరే: మోదీ చర్చలో ‘హెచ్ - 1బీ’ కీలకం
హెచ్ 1 బీ వీసాలో ప్రతిపాదిత మార్పులతో వేల మంది భారత ఐటి నిపుణులపై ప్రభావం, పాకిస్థాన్కు రక్షణ పరికరాల పంపిణీపై పరిమితి తదితర అంశాలు అమెరికాతో ప్రధాని నరేంద్రమోదీ ప్రధానంగా చర్చించనున్నారు
న్యూఢిల్లీ: హెచ్ - 1 బీ వీసాలో ప్రతిపాదిత మార్పులతో వేల మంది భారత ఐటి నిపుణులపై ప్రభావం, పాకిస్థాన్కు రక్షణ పరికరాల పంపిణీపై పరిమితి తదితర అంశాలు అమెరికాతో ప్రధాని నరేంద్రమోదీ ప్రధానంగా చర్చించనున్నారు. స్వదేశీయులకు ఉపాధి అవకాశాల కల్పన కోసం వలస కార్మికులకు అడ్డుకట్ట వేసేందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్ - 1 బీ వీసా చట్టం సవరణకు బిల్లులు ప్రతిపాదిస్తూ అమెరికా కాంగ్రెస్ లో ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. దీని అమలులోనూ, మార్పుల్లోనూ అమెరికా కాంగ్రెస్ కీలక పాత్ర పోషించనున్నది.
ట్రంప్ అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన వారంలోపే ఏడు ముస్లిందేశాల పౌరుల రాకపై 90 రోజుల పాటు తాత్కాలిక నిషేధం విధిస్తూ జారీచేసిన ఆదేశాలు వివాదాస్పదం అయ్యాయి. ఇదే తరహాలో హెచ్ - 1 బీ వీసాపై ట్రంప్ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్ జారీచేస్తారని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో అమెరికా ప్రజాప్రతినిధుల టీంతో ప్రభుత్వం జరిపే చర్చల్లో 'హెచ్ - 1 బీ' వీసా ప్రధానాంశం కానున్నది. భారత్ - అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాల సంఘటితం కోసం భారత్లో 27 మంది అమెరికా చట్టసభల ప్రతినిధులు పర్యటించనున్నారు.
ఢిల్లీ, హైదరాబాద్ నగరాల్లో ఆస్పెన్ ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేస్తున్న కార్యక్రమంలో పాల్గొనేందుకు 19 మంది ప్రజాప్రతినిధుల టీం పాల్గొననున్నది. వారితోపాటు అమెరికా ప్రజాప్రతినిధుల సభ జ్యుడీషియరీ కమిటీ చైర్మన్ బాబ్ గుడ్లాట్టే సారథ్యంలో మరో ఎనిమిది మంది టీం ఢిల్లీతోపాటు హైదరాబాద్, బెంగళూరు నగరాల్లో పర్యటించనున్నది. ఈ టీం కేంద్రమంత్రులు, ఎంపీలు, విద్యావేత్తలు, పారిశ్రామికవేత్తలు తదితరులతో భేటీ కానున్నది. ఇక ప్రస్తుతం ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్న ప్రధాని నరేంద్రమోదీతోనూ సమావేశం అవుతుంది. ఈ టీంలో ప్రజాప్రతినిధుల సభ, సెనెట్ లకు చెందిన డెమొక్రటిక్, రిపబ్లికన్ పార్టీల సభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
ఆంక్షలపై కేంద్రం నజర్
భారత్కు సోమవారం రానున్న అమెరికా ప్రజాప్రతినిధుల టీంలో భారత్ రిపబ్లికన్ కాస్కస్ ప్రజాప్రతినిధుల సభ చైర్మన్ జార్జి హోల్డింగ్, డెమొక్రటిక్ పార్టీకి చెందిన హంక్ జాన్సన్ తదితరులు ఉన్నారు. ఈ నేపథ్యంలో హెచ్ - 1 బీ వీసా జారీలో నిబంధనల కఠినతరం చేయడం వల్ల భారత ఐటీ నిపుణుల భవితవ్యంపై పడే ప్రభావంపై కేంద్ర ప్రభుత్వం నిశితంగా అధ్యయనం చేస్తోంది. రక్షణాత్మక ధోరణితో కాలిఫోర్నియా రిపబ్లికన్ కాంగ్రెస్ సభ్యుడు ప్రవేశపెట్టిన ‘హెచ్ - 1 బీ' వీసా సవరణ చట్టాన్ని కూడా లోతుగా అధ్యయనం చేస్తోంది.‘అమెరికన్లకే తొలి ప్రాధాన్యం' నినాదంతో డొనాల్డ్ ట్రంప్ దేశాధ్యక్ష పదవీ బాధ్యతలు చేపట్టిన నెల రోజుల తర్వాత ఆ దేశ ప్రతినిధుల టీం భారత్లో పర్యటిస్తుండటం గమనార్హం. దీని కొనసాగింపుగా ఈ ఏడాది మధ్యలో ప్రధాని నరేంద్రమోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో సమావేశమయ్యే అవకాశాలు ఉన్నాయి.
అమెరికా ప్రతినిధుల దృష్టికి భారత్ ఐటీ ఆందోళన
అమెరికన్ల ఉపాధి అవకాశాల మెరుగుదల, రక్షణ చట్టం కింద అమెరికా కంపెనీలు అత్యున్నత ప్రమాణాలు గల విదేశీ నిపుణుల నియామకానికి రాయితీ కల్పించిన ప్రోగ్రాం ‘హెచ్ - 1 బీ' వీసా. అయితే దీని కింద ప్రతిపాదిత సవరణ చట్టం ప్రకారం కనీస వేతనం ఏడాది 60 వేల డాలర్ల నుంచి 1.30 లక్షలకు పెంచడంతోపాటు ఇతర నిబంధనలు అమలు చేయాల్సి ఉంటుంది. ఇదే పరిస్థితి తలెత్తితే సదరు సంస్థలన్నీ విదేశీ నిపుణుల నియామకం కోసం ముందుకు రాకపోవచ్చు. కనుక భారతదేశానికి వచ్చే అమెరికా ప్రతినిధులతో ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి భారత ఐటీ సంస్థలు, నిపుణులు అందిస్తున్న గణనీయ సేవలను గుర్తుచేయడం ద్వారా ‘హెచ్ - 1 బీ'లో ప్రతిపాదిత సవరణల్లో మార్పులను నిలిపేయాలని కేంద్రం కోరే అవకాశాలు ఉన్నాయి. ఔట్ సోర్సింగ్ ద్వారా రెండు దేశాల మధ్య సంబంధాలు బలోపేతం అయ్యాయన్న సంకేతాలను అమెరికాకు అందజేయాల్సిన అవసరం ఉన్నదని విదేశాంగశాఖ కార్యదర్శి ఎస్ జైశంకర్ ఇంతకుముందే చెప్పారు.
పారిశ్రామికవేత్తల సంగతేమిటి?
అమెరికాలోని స్టాన్ ఫర్డ్, హార్వర్డ్ విశ్వవిద్యాలయాల్లో ఉన్నత విద్యాభ్యాసం పూర్తిచేసి, అమెరికా కంపెనీల్లో పనిచేసిన కొంత కాలం తర్వాత సొంత కంపెనీల స్థాపనతో ఉద్యోగాలు కల్పించిన వారి భవితవ్యం గురించి ఇంకా స్పష్టత రాలేదు. స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్లో డాక్టరేట్ పుచ్చుకుని సన్నీవేల్లోని ‘యాహూ' కంపెనీ ‘ఇంజినీరింగ్ విభాగం' ఉపాధ్యక్షుడిగా పనిచేసిన ఈజిప్ట్ వాసి అమ్ర్ అవధాల్లా అనే ప్రొఫెషనల్ తర్వాత 4. 1 బిలియన్ డాలర్లతో క్లౌడెరా అనే సాఫ్ట్ వేర్ సంస్థను స్థాపించి 1100 మందికి ఉపాధి కల్పిస్తున్నారు. అవధల్లాతోపాటు ఇదే వర్సిటీలో డాక్టరేట్ తీసుకున్న ఫ్రాన్స్ వాసి ఎరిక్ సెట్టాన్ ఫ్రీ ‘మొబైల్ మెసెజ్ యాప్' తయారుచేసే తాంగో స్థాపనకు ముందు హెచ్ పి లాబోరేటరీలో పనిచేశారు.
ట్రంప్ సర్కార్ చర్యలపై సిలికాన్ వ్యాలీ దృష్టి
దేశీయ మార్కెట్లోకి విదేశీ నిపుణుల రాకను నియంత్రించే లక్ష్యంతో డొనాల్డ్ ట్రంప్ సర్కార్ ఆంక్షలను సిలికాన్ వ్యాలీ చాలా జాగ్రత్తగా గమనిస్తున్నదని అమెరికా డిపార్ట్ మెంట్ ఆఫ్ హోంలాండ్ సెక్యూరిటీ సిటిజన్ షిప్ అండ్ ఇమ్మిగ్రేషన్ సర్వీసెస్ మాజీ డైరెక్టర్ లియాన్ రోడ్రిగిజ్ తెలిపారు. ప్రభుత్వ విధాన నిర్ణయం అమలు తీరులో గణనీయమైన పొరపాట్లు కనిపిస్తున్నాయని చెప్పారు. ప్రస్తుత పరిస్థితుల్లో ‘హెచ్ - 1 బీ' వీసాల్లో తొలగింపులే ఉండవని, కానీ దానిపై ద్రుష్టి సారిస్తామని తెలిపారు. హెచ్ - 1 బీ వీసా కింద అనుమతినిస్తున్న విదేశీ నిపుణుల సంఖ్య కేవలం 85 వేలు మాత్రమే. కానీ అమెరికాలోని 16 కోట్ల మంది నిరుద్యోగులతో పోలిస్తే అది 0.05 శాతమే. ప్రస్తుతానికి దీనిపై ఎటువంటి విధానం నిర్ణయం తీసుకోలేదని, మొత్తం వీసా విధానాన్ని పరిశీలిస్తున్నారని ట్రంప్ అధికార ప్రతినిధి సీన్ స్పైసర్ తెలిపారు.
వాటిలో ఈ సంస్థ ఉంది..
తమకు అత్యున్నత నిపుణులు కావాలని ట్రంప్ చెప్పారే గానీ నేరుగా హెచ్ 1 బీ వీసా గురించి ప్రస్తావించలేదని సీన్ స్పైసర్ గుర్తు చేశారు. కానీ ఐటీ కంపెనీలు మాత్రం తమపై పోలీసుల దాడులు, కీలక పత్రాల తనిఖీలు తప్పవని ఆందోళన చెందుతున్నాయి. హెచ్ - 1 బీ వీసా అమలు పేరిట అమెరికా ఉద్యోగులను తొలగిస్తున్నారని ట్రంప్ ఆరోపణల్లో ప్రధానమైంది. సుమారు 41 కంపెనీలు ఉద్దేశ పూర్వకంగా హెచ్ - 1 బీ వీసా నిబంధనలను ఉల్లంఘిస్తున్నాయని అమెరికా కార్మికశాఖ నివేదికలో తేలింది. వాటిలో రెడ్ వుడ్ సిటీలోని ఎంటర్ సాఫ్ట్ సొల్యూషన్స్ వంటి సంస్థ ఉంది.