ఇది ‘కర్టెన్ రైజర్’ మాత్రమే: కిమ్ సంచలన వ్యాఖ్య, సీరియస్ అయిన ఐక్యరాజ్య సమితి
ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జపాన్ మీదుగా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి ప్రయోగం జస్ట్ కర్టెన్ రైజర్ మాత్రమే అని ఆయన వ్యాఖ్యనించడంతో ఐక్యరాజ్య సమితి సీరియస
సియోల్: ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం జపాన్ మీదుగా ప్రయోగించిన ఖండాంతర క్షిపణి ప్రయోగం జస్ట్ కర్టెన్ రైజర్ మాత్రమే అని ఆయన వ్యాఖ్యనించడంతో ఐక్యరాజ్య సమితి సీరియస్ అయింది.
ఉత్తర కొరియా తన తీరు మార్చుకోవాలని, తక్షణమే క్షిపణి పరీక్షలను ఆపకపోతే చర్యలు తీవ్రంగా ఉంటాయని ఐక్యరాజ్య సమితిలోని భద్రతామండలి హెచ్చరించింది. అంతేకాదు, ఉత్తర కొరియా తన దగ్గరున్న అణ్వాయుధాలను కూడా నిర్వీర్యం చేయాలని ఆదేశించింది.

ఇది ‘కర్టెన్ రైజర్’ మాత్రమే.. మున్ముందు..
జపాన్ మీదుగా మంగళవారం మిస్సైల్ ఫైర్ చేయడం ఉత్తర కొరియా నియంత కిమ్ జాంగ్ ఉన్ కు అమిత ఆనందాన్ని ఇచ్చినట్లు తెలుస్తోంది. ఎందుకంటే ఈ క్షిపణి ప్రయోగానికి సంబంధించి ఆ దేశ అధికార వార్తాపత్రికలో ప్రచురితమైన ఫొటోలలో కిమ్ దరహాసాలు చిందిస్తూ కనిపించారు. ఉత్తర కొరియా చర్యను జపాన్ తోపాటు అమెరికా, దక్షిణ కొరియా తీవ్రంగా ఖండించాయి. అయితే కిమ్ మాత్రం తన చర్యను సమర్థించుకోవడమేగాక.. మరింత రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారు. తాజా క్షిపణి ప్రయోగం ఒక ‘కర్టెన్రైజర్' మాత్రమేనని, భవిష్యత్తులో.. జపాన్ మీదుగా మరిన్ని క్షిపణులను పంపిస్తామని ఆయన వ్యాఖ్యానించడం సంచలనంగా మారింది.

అవి ఉపగ్రహ వాహకాలు.. ఇది మాత్రం క్షిపణే...
ఉత్తరకొరియా ఇలా జపాన్ మీదుగా రాకెట్లను ప్రయోగించడం చాలా అరుదు. 1998, 2009 సంవత్సరాల్లో జపాన్ మీదుగా ఉత్తరకొరియా రాకెట్లు దూసుకెళ్లాయి. అయితే ఆ సమయంలో అవి క్షిపణులు కాదని, ఉపగ్రహ వాహకాలని ఉత్తర కొరియా తెలిపింది. అయితే తాజా రాకెట్ మాత్రం అలాంటిది కాదని, ఇది సాక్షాత్తు క్షిపణి ప్రయోగమేనని కూడా స్పష్టం చేసింది. ఉత్తరకొరియా అధికారిక మీడియా సైతం ఈ క్షిపణి ప్రయోగాన్ని ధ్రువీకరించింది. పసిఫిక్ను లక్ష్యంగా చేసుకుని భవిష్యత్తులో మరిన్ని ప్రయోగాలు చేపడతామని కిమ్ చెప్పినట్లు కూడా ఆ మీడియా పేర్కొంది.

తక్షణమే ఆపేయండి.. లేకుంటే..
మరోవైపు ప్రపంచ దేశాల సూచనలు పెడచెవినబెడుతూ అణ్వాయుధ పరీక్షలు నిర్వహిస్తూ ముందుకు సాగుతోన్న ఉత్తర కొరియా దుందుడుకు వైఖరిని ఐక్యరాజ్య సమితి ఖండించింది. ఇలాంటి చర్యల వల్ల దేశాల నడుమ తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడతాయని, ప్రపంచ ప్రజలు అభద్రతా భావానికి గురవుతారని పేర్కొంది. ఏదైనా సమస్యలుంటే శాంతియుత, దౌత్య, రాజకీయ పరిష్కార మార్గాల ద్వారా ముందుకు వెళ్లాలని సూచించింది. ఉత్తర కొరియా తన తీరు మార్చుకోవాలని, తక్షణమే క్షిపణి పరీక్షలను ఆపేయాలని, లేకుంటే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించింది.

అణ్వాయుధాలను నిర్వీర్యం చేయండి...
ఐక్యరాజ్యసమితిలోని భద్రతామండలి బుధవారం ఉత్తర కొరియా నిర్వాకంపై సీరియస్ అయింది. ఉత్తరకొరియా నిర్వహిస్తోన్న అణు పరీక్షలు నిలిపివేయాలని, తన దగ్గరున్న అణ్వాయుధాలను సైతం నిర్వీర్యం చేయాలని భద్రతామండలి డిమాండ్ చేసింది. మంగళవారం ఉదయం జపాన్ మీదుగా ఉత్తర కొరియా మరో క్షిపణి పరీక్షను నిర్వహించి మరోసారి ప్రత్యర్థి దేశాలను రెచ్చగొట్టింది. ఈ నేపథ్యంలో జపాన్, దక్షిణ కొరియాలు ఐక్యరాజ్య సమితిని సంప్రదించి, భద్రతా మండలిని సమావేశ పరచి ఉత్తరకొరియాపై చర్యలు తీసుకోవాలని కోరాయి. దక్షిణ కొరియా మరో అడుగు ముందుకేసి ఉత్తర కొరియా సరిహద్దుల్లో యుద్ధ విమానాలతో బాంబులను కూడా జారవిడిచింది.

కిమ్ ఆదేశించారు.. మేం ప్రయోగించాం..
తాము పరీక్షించిన క్షిపణి మధ్య శ్రేణి క్షిపణి అని, దాని పేరు హస్వాంగ్-12 అని ఉత్తర కొరియా ప్రకటించింది. కిమ్ ఆదేశించినట్టే ప్యాంగ్ యాంగ్ నుంచి జపాన్ ఉత్తర భూభాగం మీదుగా ఉత్తర పసిఫిక్ మహా సముద్రంలోకి ఈ క్షిపణిని ప్రయోగించామని స్పష్టం చేసింది. ఈ దిశగా ఇదే తొలి క్షిపణి అని, ఇలాగే మరిన్ని క్షిపణి పరీక్షలు నిర్వహిస్తామని కూడా ఉత్తరకొరియా తెలిపింది. 1.60 లక్షల జనాభా గల గువామ్ ద్వీపాన్ని సర్వనాశనం చేసేందుకు హస్వాంగ్-12 రకానికి చెందిన నాలుగు క్షిపణులను ప్రయోగిస్తామని కూడా ఈ ప్రకటనలో పేర్కొంది. మరోవైపు ఉత్తర కొరియా చర్యలను దాని మిత్ర దేశం చైనా కూడా వ్యతిరేకించింది. అణ్వస్త్రాల పరీక్షలకు ఇకనైనా స్వస్తి చెప్పాలంటూ హితవు పలికింది.












Click it and Unblock the Notifications