ఉక్రెయిన్ విమానం క్షిపణి ఢీకొనడంతోనే జరిగింది..అది మానవ తప్పిదం: ఇరాన్
తమ తప్పిదంతోనే ఉక్రెయిన్ విమానం కూలిందని అయితే అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని ప్రకటించింది ఇరాన్. ఇరాక్లో తిష్టవేసి ఉన్న అమెరికా సైన్యం లక్ష్యంగా చేసుకుని తాము చేసిన క్షిపణి దాడుల్లో ఒక క్షిపణి ఉక్రెయిన్ విమానంను ఢీకొట్టిందని ఇరాన్ తెలిపింది. అత్యంత సున్నిత ప్రాంతమైన మిలటరీ ప్రాంతంకు సమీపంలో ఉక్రెయిన్ విమానం ఆ సమయంలో ఎగురిందని ఇరాన్ పేర్కొంది. అయితే ఈ ఘటనకు సంబంధించి మిలటరీ అధీనంలో నడిచే జ్యూడిషియల్ విచారణకు ఆదేశించినట్లు ఇరాన్ స్పష్టం చేసింది. దీనికి కారణమైన బాధ్యులపై చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.
మానవ తప్పిదంతోనే విమాన ప్రమాదం
అమెరికా ఇరాన్ల మధ్య యుద్ధ వాతావరణం నెలకొన్న నేపథ్యంలో మానవ తప్పిదంతోనే ఈ పెను ప్రమాదం జరిగిందంటూ ఇరాన్ విదేశాంగ శాఖ మంత్రి జవాద్ జారిఫ్ ట్విటర్లో పేర్కొన్నారు. ఇక తమ తప్పిదంతో ఎన్నో కుటుంబాలకు అన్యాయం జరిగిందని పేర్కొన్న ఇరాన్ మిలటరీ.. విమాన ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపింది. ఇది ఉద్దేశ పూర్వకంగా చేసినది కాదని స్పష్టం చేసింది. ఇదిలా ఉంటే విమాన ప్రమాదం సాంకేతికలోపంతో జరిగినది కాదని ఇరాన్ క్షిపణి ఢీకొట్టడంతోనే కూలిందని అమెరికా, కెనడాలు ముందుగా ఆరోపించాయి. అయితే ఈ ఆరోపణలను ఇరాన్ తొలుత కొట్టివేసింది.

ప్రతీకార చర్యల్లో భాగంగా అమెరికాపై దాడులు
ఉక్రెయిన్కు చెందిన బోయింగ్ 737-800 విమాన ప్రమాదంలో మొత్తం 176 మంది ప్రయాణికులు మృతి చెందారు. టెహ్రాన్లోని ఖోమేనీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి టేకాఫ్ తీసుకున్న ఐదు నిమిషాలకే విమానం కూలిపోయింది. ఇరాక్ బేస్లో ఉన్న అమెరికా బలగాలే లక్ష్యంగా డజనుకు పైగా క్షిపణులను ఇరాన్ ప్రయోగిస్తున్న సమయంలోనే విమాన ప్రమాదం జరిగింది. అమెరికా వైమానికదాడుల ద్వారా ఇరాన్ ఆర్మీ చీఫ్ ఖాసిం సులేమనీని హతమార్చడంతో ప్రతీకార చర్యల్లో భాగంగా ఇరాన్ క్షిపణి దాడులకు దిగింది.
ఇరాన్ క్షమించరాని తప్పు చేసింది: హస్సన్ రౌహానీ
ఇదిలా ఉంటే విమాన ప్రమాదంపై ఇరాన్ అధ్యక్షుడు స్పందించారు. విమాన ప్రమాదం విషాదం నింపిందని చెప్పిన అధ్యక్షుడు హసన్ రౌహానీ... ఇరాన్ క్షమించరాని తప్పు చేసిందని అంగీకరించారు. ఇక ఇరాన్ మిలటరీ చేపట్టిన అంతర్గత విచారణలో ఉక్రెయిన్ విమాన ప్రమాదం క్షిపణి దాడి వల్లే జరిగిందని తేల్చి చెప్పింది. అత్యంత విషాదకర ఘటనపై విచారణ కొనసాగుతుందని హసన్ రౌహనీ చెప్పారు. ఇదిలా ఉంటే అమెరికా ప్రతిదాడులు చేస్తుందని ఆదేశాధ్యక్షుడు ట్రంప్ హెచ్చరించడం, ఇరాన్లోని పలు ప్రాధాన్యత కలిగిన ప్రాంతాలను అమెరికా లక్ష్యంగా చేసుకుందన్న సమాచారం, తమ గగనతలంలో అమెరికా యుద్ధ విమానాలు తిరుగుతుండటంతో ఇరాన్ హైఅలర్ట్తో ఉందని ఓ ప్రకటన విడుదల చేసింది.
Recommended Video
అమెరికా విమానం అని భావించి...
ఇరాన్ క్షిపణులను ప్రయోగించిన తర్వాత ఇరాన్ గగనతలంలో అమెరికా యుద్ధ విమానాల సంఖ్య పెరిగిందని అది రాడార్ ద్వారా తెలుస్తోందని ఇరాన్ ప్రకటన విడుదల చేసింది. ఈ క్రమంలోనే ఉక్రెయిన్ విమానం ఇరాన్ మిలటరీ ప్రాంతం వైపు దూసుకొస్తుండగా క్షిపణ ఢీకొట్టిందని ప్రకటనలో తెలిపింది. ఈ ఘటనకు పాల్పడిన వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చింది ఇరాన్ ప్రభుత్వం. భవిష్యత్తులో ఇలాంటి మానవ తప్పిదాలు కాకుండా జాగ్రత్తలు తీసుకుంటామని ఇరాన్ ప్రభుత్వం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది.












Click it and Unblock the Notifications