ఫలితాల ముగింపువేళ.. జో బిడెన్ తొలి స్పీచ్: షాకింగ్ కామెంట్స్: అమెరికన్లను ఉద్దేశించి
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికలకు సంబంధించిన తుది ఫలితాలు ఒక్కటొక్కటికగా వెలువడుతున్నాయి. ఓట్ల లెక్కింపు తుదిదశలో కీలకంగా మారిన ఆరు రాష్ట్రాల్లో క్రమంగా డెమొక్రాట్లు పుంజుకున్నారు. మొదట వెనుకంజలో ఉన్న అరిజోనా, విస్కాన్సిన్లో విజయం సాధించారు. మిచిగాన్, మిన్నెసోటాలో మెజారిటీని సాధించే దశకు చేరుకున్నారు. దీనితో చివరి రౌండ్లో ఫలితాలు ఒక్కసారిగా డొమొక్రటిక్ పార్టీ అభ్యర్థి జో బిడెన్కు అనుకూలంగా మారాయి. జార్జియా, నార్త్ కరొలినా, పెన్సిల్వేనియాల్లో రిపబ్లికన్లు ఆధిక్యతలో కొనసాగుతున్నారు.
మరింత చేరువగా బిడెన్..
ప్రభుత్వాన్ని ఏర్పాటు చయడానికి అవసరమైన మ్యాజిక్ ఫిగర్కు జో బిడెన్ మరింత చేరువ అయ్యారు. 270 ఎలక్టోరల్ ఓట్లు అవసరం కాగా.. ప్రస్తుతం బిడెన్ ఖాతాలో 264 ఉన్నాయి. దీనితో బిడెన్ విజయం దాదాపు ఖాయమైనట్టే. ఈ పరిణామాల మధ్య జో బిడెన్ తొలిసారిగా ప్రసంగించారు. డెల్వర్లోని విల్మింగ్టన్ నుంచి ఆయన అమెరికన్లు ఉద్దేశించి మాట్లాడారు. అమెరికన్లు, ప్రత్యర్థి పార్టీ రిపబ్లికన్లను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ఇది అమెరికన్ల విజయం..
అధ్యక్షఎన్నికల్లో తాము ఘన విజయాన్ని సాధించామని జో బిడెన్ చెప్పారు. ఓట్ల లెక్కింపు పూర్తయే సమయానికి తాము ఛాంపియన్లుగా ఆవిర్భవిస్తామని ధీమా వ్యక్తం చేశారు. మిచిగాన్లో తాము విజయం సాధించామని అన్నారు. అమెరికాలో కొత్త ప్రభుత్వం ఏర్పడబోతోందని, ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తుందని హామీ ఇచ్చారు. ఈ విజయం తన ఒక్కడిది మాత్రమే కాదని, ప్రతి ఒక్క అమెరికన్కూ ఈ ఘనత దక్కుతుందని వ్యాఖ్యానించారు. అమెరికన్లు ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టారని అన్నారు. తాను సాధించిన ఈ విజయంలో రాజకీయ సలహాదారులు, వ్యూహకర్తలకూ భాగం ఉందని ప్రశంసించారు.

ప్రజానుకూల ప్రభుత్వం..
ఫలితాలు ముగిసిన తరువాత అమెరికాలో ప్రజానుకూల ప్రభుత్వం ఏర్పడబోతోందని అన్నారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని, ప్రజలు ఎన్నుకొన్నవారే అధికారంలో కూర్చోవాల్సి ఉంటుందే తప్ప.. మరొకరు (సుప్రీంకోర్టు) నిర్ణయించబోరని చెప్పారు. తమను ఎవరు పరిపాలించాలనేది ప్రజలే నిర్ణయించుకుంటారనే విషయం తాజాగా ఈ తీర్పుతో మరోసారి రుజువైందని వ్యాఖ్యానించారు. గెలిచామని చెప్పడానికి ప్రజల ముందుకు రాలేదని, ఈ ఎన్నికల్లో ప్రతి అమెరికన్ విజయం సాధించారనే విషయాన్ని తెలియజేయడం తన బాధ్యతగా భావిస్తున్నానని జో బిడెన్ చెప్పారు.

పోస్టల్ బ్యాలెట్లతో
విన్సిస్కాన్, అరిజోనాలో జో బిడెన్ విజయాన్ని సాధించడంతో మ్యాజిక్ ఫిగర్కు ఆయన మరింత చేరువ అయ్యారు. మిచిగాన్లో ముందంజలో ఉన్నారు. ఈ మూడు చోట్ల మొదట బిడెన్ వెనుకంజలో ఉన్నారు. పోస్టల్ బ్యాలెట్ల వల్లే ఆయనకు ఆధిక్యత లభించిందనే అభిప్రాయాలు వ్యక్తమౌతున్నాయి. ఎలక్టొరల్ కాలేజీ కలిపి బిడెన్ ఎక్కువ ఓట్లు సాధించే అవకాశం ఉంది. ప్రస్తుతం 264 ఎలక్టోరల్ కాలేజీ ఓట్లను బిడెన్ సాధించారు. 270కి ఆరు ఓట్ల దూరంలో ఉన్నారు.

రేసులో వెనుకంజలో ట్రంప్..
ఈ రేసులో డొనాల్డ్ ట్రంప్ వెనుకపడ్డారు. 214 వద్దే ఉన్నారు. జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినా ఫలితాలు ఇంకా వెల్లడి కావాల్సి ఉంది. ఈ మూడు రాష్ట్రాల్లో కలిపి 51 ఎలక్టోరల్ ఓట్లు ఉన్నాయి. అవన్నీ డొనాల్డ్ ట్రంప్ ఖాతాలో పడినప్పటికీ.. 270 ఫిగర్ను అందుకోలేరు. నెవడాలో జో బిడెన్ స్వల్ప ఆధిక్యతలో కొనసాగుతున్నారు. అదే ఫలితాన్ని నిర్దేశించే అవకాశం ఉంది. నెవడాలో డొనాల్డ్ ట్రంప్ ఆధిక్యతలోకి రావడంతో పాటు జార్జియా, పెన్సిల్వేనియా, నార్త్ కరోలినాల్లో విజయాన్ని సాధించగలిగితే.. ఫలితాలు తారుమారయ్యే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications