చంద్రుడితో తీర ప్రాంతాలకు ముప్పు: అలలు వరదలు: జనజీవనం ఛిన్నాభిన్నం: నాసా వార్నింగ్
నాసా: అమెరికాతో పాటు ఇతర దేశాల్లో పెద్ద ఎత్తున వచ్చే వరదలు, అలలకు వాతావరణంలో మార్పులే కారణమని ఒక అధ్యయనం తేల్చి చెప్పింది.ఇక ఈ అసాధారణ విపత్తులు చంద్రుడితో ముడిపడి ఉన్నాయని ఆ అధ్యయనం తేల్చింది. నాసా అధ్వర్యంలో జరిగిన ఈ అధ్యయనం పలు ఆసక్తికర విషయాలను వెల్లడించింది.
సముద్రంలో అధిక స్థాయిలో అలలు
వాతావరణంలో మార్పులు చోటుచేసుకుంటున్న నేపథ్యంలో చంద్రుడి కక్ష్యలో స్థిరత్వం లేకపోవడంతో సముద్ర మట్టాలు క్రమంగా పెరుగుతున్నాయని నాసా చేసిన అధ్యయనంలో వెల్లడైంది. దీంతో వరదలు వచ్చిన సమయంలో అధిక నష్టం కలిగించే అవకాశాలున్నాయని వివరించింది. జూన్ 21న జర్నల్ నేచర్ క్లైమేట్ చేంజ్లో ఈ విషయాన్ని ప్రచురించారు.
అయితే సాధారణ స్థాయి కంటే అదనంగా వచ్చే ఈ వరదలు ఒక్కసారిగా విరుచుకుపడే అవకాశం లేదని ఏడాదిలో క్రమంగా వాటి విశ్వరూపాన్ని ప్రదర్శిస్తాయని హెచ్చరించింది.ప్రస్తుతం అమెరికాలో నెలకు ఒకటో రెండో వరదలు వస్తున్నాయి. త్వరలోనే ఈ వరదలు నెలకు డజన్ల సంఖ్యలో వచ్చే ప్రమాదం ఉందని లైవ్ సైన్స్ రిపోర్ట్ చేసింది.
నెలకు 10 నుంచి 15 సార్లు వరదలు
తీరప్రాంతంలో సుదీర్ఘకాలం పాటు వచ్చే ఈ వరదలు మనుషుల ప్రాణాలపై, జీవనంపై తీవ్ర ప్రభావం చూపుతాయని స్టడీ వెల్లడించింది. ఇప్పటి నుంచే ఆ వరదలను ఎదుర్కొనేలా తీరప్రాంత ప్రజలు, ప్రభుత్వాలు ఒక ప్రణాళిక తయారు చేసి దాని ప్రకారంగా నడుచుకోవాలని నాసా హెచ్చరికలు జారీ చేసింది. కాలక్రమంలో ఈ వరదల నుంచి తీవ్ర ముప్పు ఉంటుందని చెప్పారు ఈ అధ్యయనం చేసిన అసిస్టెంట్ ప్రొఫెసర్ ఫిల్ థామ్సన్.
నెలకు 10 నుంచి 15 సార్లు వరదలు వస్తే ఇళ్లల్లోకి ఆ నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతారని అన్నారు. వారు తమ ఆఫీసులకు వెళ్లలేక ఉద్యోగాలు పోగొట్టుకునే అవకాశాలున్నాయని చెప్పారు. ఇది ప్రజాఆరోగ్య వ్యవస్థపై ప్రభావం చూపుతుందని చెప్పారు.
చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి...
ఇక సముద్ర ప్రాంతం, లేదా తీర ప్రాంతాలు ఇప్పటికే ప్రమాదంలో ఉన్నాయని నాసా అడ్మినిస్ట్రేటర్ బిల్ నెల్సన్ చెప్పారు. ఇది క్రమంగా మరింత దారుణంగా తయారవుతుందని చెప్పారు. చంద్రుడి గురుత్వాకర్షణ శక్తి , సముద్రంలో పెరుగుతున్న నీటిమట్టం, వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పుల కలయికతో తీర ప్రాంతాల్లో అధిక వరదలు, అలలు విరుచుకుపడతాయని హెచ్చరించారు. ఇది ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తీరప్రాంతాలకు వర్తిస్తుందని స్పష్టం చేశారు. భూమిపై వచ్చే వరదలపై చంద్రుడి ప్రభావం ఏమేరకు ఉంటుందనే దానిపై ఫిల్ థామ్సన్ చర్చించారు.
2030 నాటికి తీవ్ర రూపం...
చంద్రుడి కక్ష్యలో చలనం పూర్తి అయ్యేందుకు 18.6 సంవత్సరాల సమయం పడుతుందని చెప్పిన ఆయన ఈ చలనం లేదా అస్థిరత్వం అనేది ఎప్పుడూ ఉంటుందని చెప్పారు. అయితే ప్రస్తుతం భూతాపం ఎక్కువగా ఉండటం, సముద్ర మట్టం పెరగడం ఈ రెండిటి కలయికలకు తోడు చంద్రుడి గురుత్వాకర్షణ ఉండటంతో మరింత ప్రమాదం సంభవించే అవకాశం ఉందని వెల్లడించారు.
ఇక ఈ 18.6 సంవత్సరాల్లో సగం కాలంకు పైగా వచ్చే సాధారణ అలలు అణిచివేయబడగా... పెద్ద ఎత్తున వచ్చే అలలు సాధారణం కంటే తక్కువగా... తక్కువ ఎత్తులో ఎగిసిపడే అలలు సాధారణం కంటే ఎక్కువ స్థాయిలో విరుచుకుపడతాయని వివరించారు. మరో సగం కాలం ఇది పూర్తిగా రివర్స్లో ఉంటుందని వెల్లడించారు. ఇక ఇది 2030లో ఇది తీవ్ర రూపం దాల్చి సాధారణ జనజీవనంను ఛిన్నాభిన్నం చేస్తుందని ప్రత్యేకించి తీరప్రాంతాలను వణికిస్తుందని హెచ్చరించారు.