డీల్ ఓకే: సెక్స్ బానిసలకు జపాన్ క్షమాపణ, పరిహారం
న్యూఢిల్లీ: జపాన్, దక్షిణ కొరియా దేశాల మధ్య చారిత్రాత్మక ఒప్పందం కుదిరింది. దక్షిణ కొరియాకు చెందిన సెక్స్ బానిసలకు జపాన్ ప్రభుత్వం క్షమాపణలు చెప్పింది. దక్షిణ కొరియా రాజధాని సియోల్లో రెండు దేశాలకు చెందిన విదేశాంగ మంత్రులు ఈ ఒప్పందంపై సోమవారం సంతకాలు చేశారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ వేశ్యా గృహాల్లో సెక్స్ బానిసలు(కంఫర్ట్ ఉమెన్)గా పనిచేసిన దక్షిణ కొరియా మహిళలకు నష్టపరిహారం చెల్లించేందుకు జపాన్ అంగీకరించింది. జపాన్ సైనికుల సెక్స్ అవసరాలను తీర్చిన బాధిత మహిళల కోసం జపాన్ 1 బిలియన్ యెన్లు (90 లక్షల డాలర్ల) నిధిని కేటాయించింది.
ఈ నష్టపరిహారాన్ని చెల్లించేందుకు గొత కొంతకాలంగా జపాన్, దక్షిణ కొరియా దేశాలు ఈ అంశంపై తర్జన భర్జన పడుతున్నాయి. సోమవారం సియోల్లో ఇరు దేశాల విదేశాంగ మంత్రులు నిర్వహించిన చర్చల్లో ఓ అంగీకారానికి వచ్చారు.
1965 నుంచి ఇరు దేశాల మధ్య ఈ కంఫర్ట్ ఉమెన్ అంశంపై ఈ మధ్య కాలంలో చర్చలు జరుగుతున్నాయి. ఈ అంశంపై జపాన్ ప్రధాని షింజో అబే హృదయపూర్వకంగా క్షమాపణలు చెబుతున్నట్లు జపాన్ విదేశాంగ శాఖమంత్రి యున్ బైయంగ్ సీ పేర్కొన్నారు.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో సుమారు రెండు లక్షల మంది మహిళలు జపాన్ సైనికుల సెక్సు కోర్కెలను తీర్చారు. ఈ బానిస మహిళల్లో అత్యధికంగా దక్షిణ కొరియాకు చెందిన వారే ఉన్నారు. దీంతో యుద్ధ సమయంలో జపాన్ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలమైందని కొరియా ప్రశ్నిస్తోన్న సంగతి తెలిసిందే.
రెండో ప్రపంచ యుద్ధ సమయంలో జపాన్ సైనికుల సెక్సు కోర్కెలను తీర్చిన 46 మంది ఇంకా ప్రాణాలతో ఉన్నారు. చైనా, పిలిప్పీన్స్, ఇండోనేషియా, తైవాన్ దేశాల మహిళలు కూడా సెక్సు బానిసలుగా పని చేశారు.