అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి రోజే కరోనాపై యాక్షన్ ప్లాన్: ట్రంప్పై జో బైడెన్ విమర్శలు
వాషింగ్టన్: అమెరికా అధ్యక్ష ఎన్నికల దగ్గరపడుతున్న నేపథ్యంలో డెమొక్రాటిక్ అధ్యక్ష అభ్యర్థి జో బైడెన్, ప్రస్తుత అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ మధ్య మాటల యుద్ధం నడుస్తోంది. ఒకరిపై ఒకరు తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. జో బైడెన్ స్వల్ప ఆధిక్యంలోనే కొనసాగుతుండగా.. ట్రంప్ వెనుకంజలో ఉన్నారు. అయితే, నవంబర్ 3 తర్వాత పూర్తిస్థాయి ఫలితాలు వెలువడనున్నాయి.
US elections 2020: అమెరికా అధ్యక్ష పోరులో నువ్వా నేనా .. తేల్చుకోనున్న ట్రంప్ , జో బైడెన్
తాను అధ్యక్షుడిగా ఎన్నికైన తొలి రోజే కరోనావైరస్ కట్టడికి యాక్షన్ ప్లాన్ ప్రకటిస్తానని జో బైడెన్ తెలిపారు. ప్రజలు మంచి చేసే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని పిలుపునిచ్చారు. అమెరికాలో కరోనా మహమ్మారి వ్యాప్తిని అడ్డుకోవడంలో డొనాల్డ్ ట్రంప్ ఘోరంగా విఫలమయ్యారని జో బైడెన్ ఆరోపించారు.
కరోనాను కట్టడి చేయడంలో డొనాల్డ్ ట్రంప్ పూర్తిగా విఫలమయ్యారని, ఈ కారణంగానే 2,30,000 మంది అమెరికన్లు ప్రాణాలు కోల్పోవాల్సి వచ్చిందని జో బైడెన్ ఆరోపించారు. అమెరికాలో ఇప్పటి వరకు 9.2 మిలియన్ల మంది కరోనా బారినపడ్డారు. కరోనా నియంత్రించే మాస్కులు ధరించవద్దని చెప్పి డొనాల్డ్ ట్రంప్ నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ట్రంప్ సరైన సమయంలో సరైన చర్యలు చేపడితే అమెరికాలో 9 మిలియన్ల మంది కరోనా బారినపడేవారా? అని ప్రశ్నించారు.
డొనాల్డ్ ట్రంప్ను ప్రజలు ఇంటికి పంపిస్తేనే అమెరికాకు మంచి రోజులు వస్తాయని జో బైడెన్ అన్నారు. ట్రంప్ ఓ విఫల అధ్యక్షుడని, విద్వేషపూరితడని విమర్శించారు. అమెరికాను సరైన మార్గంలో నడిపేందుకు ప్రజలు సరైన అభ్యర్థికే ఓటేయాలని పిలుపునిచ్చారు. తాము అధికారంలోకి వచ్చిన మొదటి రోజే కరోనా మహమ్మారి కట్టడికి చర్యలు తీసుకుంటామని, ప్రణాళికలు అమలు చేస్తామన్నారు.
Recommended Video
మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం, పరీక్షలు నిర్వహించడం, కరోనా బాధితులను గుర్తించడం లాంటి చర్యలు మెరుగుపరుస్తామన్నారు. తాము అధికారంలోకి వస్తే అమెరికన్లందరికీ ఉచిత కరోనా వ్యాక్సిన్ అందిస్తామని జో బైడెన్ స్పష్టం చేశారు. కాగా, అమెరికాలో గత కొద్ది వారాలుగా కరోనా పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతున్నాయి. నవంబర్ 3న అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.