రూటు మార్చిన అమెరికా-గాజాకు బైడెన్ మద్దతు ! బిగ్ మిస్టేక్ వద్దంటూ ఇజ్రాయెల్ కు వార్నింగ్..
ఇజ్రాయెల్ పై పాలస్తీనా తీవ్రవాద సంస్ధ హమాస్ మెరుపుదాడుల తర్వాత అంతర్జాతీయంగా రాజకీయాలు వేగంగా మారుతున్నాయి. ముఖ్యంగా ఇజ్రాయెల్, పాలస్తీనాకు మద్దతుగా దేశాలు చీలిపోతున్నాయి. ఈ క్రమంలో ఇజ్రాయెల్ కు మద్దతుగా అమెరికా, బ్రిటన్, యూరోపియన్ దేశాలతో పాటు ఇతర పశ్చిమదేశాలు కూడా ప్రకటనలు చేశాయి. అలాగే పాలస్తీనాకు మద్దతుగా అరబ్, ఇస్లామిక్ దేశాలు ప్రకటనలు చేస్తున్నాయి. ఈ సమయంలో అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ షాకిచ్చారు.
ఇజ్రాయెల్ కు పూర్తిస్దాయిలో అండగా ఉంటూ వస్తున్న అగ్రరాజ్యం అమెరికా ఇప్పుడు ఐరాస ఆగ్రహంతో కాస్త వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. ఇన్నాళ్లూ పాలస్తీనాపై మండిపడుతున్న అమెరికా.. ఇప్పుడు యుద్ధం ఆపేందుకు మధ్యవర్తిత్వం వహించేందుకు సిద్ధమని ప్రకటన చేసింది. అంతటితో ఆగకుండా అమెరికా అధ్యక్షుడు జో బైడన్ ఇప్పుడు ఇజ్రాయెల్ ను మరో విషయంలో హెచ్చరించారు. గాజాకు అనుకూలంగా ఆయన చేసిన ప్రకటన ఇప్పుడు అంతర్జాతీయంగా చర్చనీయాంశమవుతోంది.

హమాస్ దాడుల నేపథ్యంలో గాజా స్ట్రిప్ ను ఆక్రమించడంతో పాటు పూర్తిగా నేలమట్టం చేసేందుకు సిద్ధమవుతున్న ఇజ్రాయెల్ దూకుడుకు కళ్లెం వేసేలా జో బైడెన్ ఓ కీలక ప్రకటన చేశారు. తాను అవసరమైతే ఇజ్రాయెల్ లో పర్యటిస్తానని ప్రకటించారు. అంతే కాదు గాజా స్ట్రిప్ ను దీర్ఘకాలం ఆక్రమించుకుందామని చూస్తే అది పెద్ద తప్పిదమే అవుతుందని ఇజ్రాయెల్ ను హెచ్చరించారు. ఇప్పటికే ఐక్యరాజ్యసమితి సైతం ఇజ్రాయెల్ ను ఇదే అంశంపై హెచ్చరించింది.
పశ్చిమాసియా ప్రాంతంలో ప్రాంతీయ సంక్షోభం పెరుగుతుందనే భయంతో అమెరికా ప్రస్తుతం ఇజ్రాయెల్, పాలస్తీనా ఇద్దరికీ మద్దతిచ్చేలా అడుగులు వేస్తోంది. తద్వారా తన పెద్దన్న పాత్రను కాపాడుకునేందుకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగానే గాజా స్ట్రిప్ ను దీర్ఘకాలం ఆక్రమించుకుంటానంటే కుదరంటూ జో బైడెన్ చేసిన ప్రకటన ఇజ్రాయెల్ కు మింగుడు పడటం లేదు. మరో వైపు బైడెన్ ఇజ్రాయెల్కు వెళ్లాలా వద్దా అనే దానిపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని తెలుస్తోంది.
అయితే తాజాగా గాజా విషయంలో పాలస్తీనియన్లు, అరబ్ నాయకులు వ్యక్తం చేసిన ఆందోళనలను అంగీకరించడంతో పాటు సంక్షోభం మరింత పెరగకుండా అమెరికా ప్రయత్నిస్తోందనడానికి బైడెన్ వ్యాఖ్యలు తాజా సంకేతంగా కనిపిస్తున్నాయి.












Click it and Unblock the Notifications