నోబెల్ శాంతి పురస్కారం ప్రకటన- జర్నలిస్టులు మరియా రెస్సా, దిమిత్రీ మురాటోవ్ కు అవార్డు
ఈ ఏడాది నోబెల్ బహుమతుల ప్రకటనలు కొనసాగుతున్నాయి. ఇప్పటికే పలు విభాగాల్లో నోబెల్ అవార్డులు ప్రకటించిన ఎంపిక కమిటీ.. ఇవాళ శాంతి పురస్కారాన్ని కూడా ప్రకటించింది. భావప్రకటనా స్వేచ్ఛ కోసం పోరాడుతున్న జర్నలిస్టులు మరియా రెస్సా, దిమిత్రీ మురాటోవ్ లకు సంయుక్తంగా ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారం దక్కింది.
ప్రజాస్వామ్య ప్రక్రియకు మూలస్తంంభమైన భావప్రకటనా స్వేచ్ఛను కాపాడేందుకు పోరాడుతున్న జర్నలిస్టులు మరియా రెస్సా, దిమిత్రీ మురాటోవ్ లను ఈ ఏడాది నోబెల్ శాంతి పురస్కారానికి ఎంపిక చేస్తున్నట్లు ఇవాళ కమిటీ ఓ ప్రకటనలో తెలిపింది. 2012లో ర్యాప్లర్ పేరుతో న్యూస్ వెబ్ సైట్ ప్రారంభించిన ఫిలిప్పీన్స్ జర్నలిస్ట్ మరియా రెస్సా.. అధ్యక్షుడు జనరల్ రోడ్రిగో ప్రారంభించిన వివాదాస్పద, హంతక, మాదక ద్రవ్యాల వ్యతిరేక పోరాటంపై వరుస కథనాలను ఇవ్వడం ద్వారా ప్రజలను చైతన్య పరిచారని నోబెల్ కమిటీ ప్రశంసించింది. అలాగే ర్యాప్లర్ వెబ్ సైట్.. సోషల్ మీడియాను ప్రత్యర్ధులపై దాడులకు, నకిలీ వార్తల వ్యాప్తికి ఎలా ఉపయోగిస్తున్నారనే దానిపైనా పరిశోధనాత్మక కథనాలను అందించింది.
అలాగే రష్యన్ జర్నలిస్ట్ దిమిత్రీ మురాటోవ్ 1993లో ఇండిపెండెంట్ రష్యన్ న్యూస్ పేపర్ నోవయా గజేటాను ప్రారంభించారు. అధికారంలో ఉన్న వారిపై విమర్శనాత్మక కథనాలు ప్రచురించడంలో ఈ న్యూస్ పేపర్ ఇవాళ్టికీ రష్యాలో ఎంతో ప్రాముఖ్యం పొందిందని నోబెల్ కమిటీ పేర్కొంది. గజేటా వార్తాపత్రిక వాస్తవాలతో కూడిన కథనాల ప్రచురణ, వృత్తిపరమైన సమగ్రత విషయంలో రష్యా సమాజానికి మార్గదర్శిగా నిలిచిందని నోబెల్ కమిటీ ప్రశంసించింది.
నోబెల్ శాంతి పురస్కారాన్ని దేశాలు, లేదా సమాజాలకు మధ్య శాంతి భావాన్ని పంచే వ్యక్తులకు లేదా సంస్ధలకు ఏటా ప్రదానం చేస్తుంటారు. దీని కింద 10 మిలియన్ స్వీడిష్ డాలర్లతో పాటు అవార్డును కూడా విజేతలకు అందిస్తారు. ఈ వారంలో నోబెల్ కమిటీ భౌతిక, రసాయన, సాహిత్యం, శాంతి అంశాల్లో ఇప్పటివరకూ అవార్డులు ప్రకటించింది. సోమవారం ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ విజేతలను ప్రకటించనుంది.