పుతిన్ మెంటలోడు, బైడెన్,మోడీకి చెప్పినా ఫలితంలేదు: రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై కేఏ పాల్
ఉక్రెయిన్ పై రష్యా యుద్ధానికి దిగడం ప్రపంచంలోని అనేక దేశాలకు ఆగ్రహం తెప్పిస్తుంది. ముఖ్యంగా అమెరికా ఉక్రెయిన్ పై యుద్ధం ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని రష్యాకు వార్నింగ్ ఇస్తుంది. నాటో దేశాలన్నీ యుద్ధంపై సీరియస్ గా ఉన్నాయి. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఎవరు సూచించిన వినిపించుకోని రష్యా అధ్యక్షుడు వాద్లిమీర్ పుతిన్ ఉక్రెయిన్ పై తన బలగాలతో తీవ్రస్థాయిలో విరుచుకు పడుతున్నారు. దీంతో ఉక్రెయిన్ విలవిలలాడుతోంది.
పుతిన్ మెంటలోడు.. నాశనం చేస్తాడు
తాజా ఉక్రెయిన్ రష్యా సంక్షోభంపై, కొనసాగుతున్న యుద్ధంపై ఇంటర్నేషనల్ పీస్ మేకర్ కె ఏ పాల్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే రష్యాలో వేలాది మంది అమాయక ప్రజలు మరణించారని రష్యా అధ్యక్షుడు పుతిన్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. పుతిన్ మెంటలోడ ని, పిచ్చోడని ఆయన సర్వ నాశనం చేస్తాడని తాను ముందే ఊహించానని కె ఏ పాల్ వెల్లడించారు. తాను యుద్ధాన్ని నిలువరించడం కోసం చాలా రోజుల నుంచి ప్రయత్నాలు చేస్తున్నానని చెప్పిన కే ఏ పాల్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
జో బైడెన్ తమ బలగాలను ఉక్రెయిన్ కు పంపాలి .. ఆ పని చెయ్యలేదన్న కేఏ పాల్
21 రోజులుగా తాను నిరాహార దీక్ష చేస్తున్నానని పాల్ విలపిస్తూ చెప్పాడు. ఉక్రెయిన్ పై యుద్ధాన్ని ఆపవలసిన అవసరముందని కె ఏ పాల్ పేర్కొన్నారు. ఉక్రెయిన్ ను స్వాధీనం చేసుకోవాలనే యుద్ధం చేస్తున్నాడని విమర్శించారు. గత నెలలో తాను అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కు తమ బలగాలను ఉక్రెయిన్ కు పంపించాలని చెప్పానని, ఓకే చెప్పి కూడా ఆయన ఆ పని చెయ్యలేదని కేఏపాల్ మండిపడ్డారు. జో బైడెన్ కు కళ్ళు నెత్తి మీదికి వచ్చాయని విమర్శించారు.
ప్రధాని నరేంద్ర మోడీని, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణలకు విజ్ఞప్తి చేసినా ఫలితం లేదు
ఉక్రెయిన్ ప్రజలను కాపాడాల్సిన బాధ్యత ఉందన్నారు. గతంలో సిరియా, ఇరాక్, లిబియా, ఆఫ్ఘనిస్థాన్ లలో జరిగిన యుద్ధాలను వ్యతిరేకించానని, ప్రపంచ శాంతిని కోరుకున్నానని చెప్పారు. ఇప్పుడు కూడా ఉక్రెయిన్ పై రష్యా యుద్ధాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నానని చెప్పారు. ఉక్రెయిన్ పై రష్యా చేస్తున్న యుద్ధం ఆపాలని తాను ప్రధాని నరేంద్ర మోడీని, చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ లను కోరానని కె ఏ పాల్ వెల్లడించారు. కానీ ఎలాంటి ఫలితం లేదని పేర్కొన్నారు.
గుటెరస్ రాజీనామా చెయ్యాలన్న కేఏ పాల్
ఇక ఐక్యరాజ్య సమితి పై కూడా కె.ఏ.పాల్ విమర్శలు గుప్పించారు. యుద్ధాన్ని ఆపవలసిన ఐక్యరాజ్యసమితి సెక్రటరీ జనరల్ గుటెరస్ ఇది పెద్ద సీరియస్ మేటర్ కాదు అన్నట్లుగా మాట్లాడారని కె ఏ పాల్ పేర్కొన్నారు. ఆయన బుర్ర పని చేయడం లేదని మండిపడ్డారు. యుద్ధాన్ని నిలువరించ లేనప్పుడు తక్షణం రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.
రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధ ఫలితం భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుంది
తన సూచనలను ఎవరూ పట్టించుకోవడం లేదని, రష్యా ఉక్రెయిన్ పై చేస్తున్న యుద్ధ ఫలితం భారత ఆర్థిక వ్యవస్థపై పడుతుందని కె ఏ పాల్ పేర్కొన్నారు. అన్ని ధరలు పెరిగి సామాన్యులపై పెను భారం పడే ప్రమాదం ఉందని ఆయన వెల్లడించారు. ఉక్రెయిన్లో అమాయక ప్రజలు చనిపోతున్నారని కే ఏ పాల్, ఇప్పటికైనా స్పందించి యుద్ధాన్ని అడ్డుకోవడానికి భారత్ తో పాటు ఇతర ప్రపంచ దేశాలు ముందుకు రావాలని విజ్ఞప్తి చేశారు.