జో బైడెన్ కీలక నిర్ణయం: మళ్లీ ఆమెతోనే అధ్యక్ష ఎన్నికల్లో బరిలో
వాషింగ్టన్: అమెరికాలో 2024లో నిర్వహించే అధ్యక్ష ఎన్నికల రేసులో మరోసారి జో బైడెన్.. ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్తో కలిసి పోటీ చేయనున్నారు. ఈ విషయాన్ని ఆయనే స్వయంగా వెల్లడించారు. రెండోసారి తాను పోటీ చేయాల్సి వస్తే ఉపాధ్యక్ష అభ్యర్థినిగా కమలా హ్యారిస్ ఉంటారని స్పష్టం చేశారు. సాధారణంగా- అమెరికా అధ్యక్షుడిగా పని చేసిన నాయకుడు.. రెండోసారి కూడా ఎన్నికల్లో పోటీ పడటం ఆనవాయితీగా వస్తోంది. ఇదే సంప్రదాయాన్ని బైడెన్ కొనసాగించడం ఖాయంగా కనిపిస్తోంది.
తొలి ఏడాది పూర్తి..
అమెరికా అధ్యక్షుడిగా జో బైడెన్.. తొలి ఏడాదిని పూర్తి చేసుకున్నారు. గత ఏడాది ఇదే రోజున అగ్రరాజ్యం అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేశారు. ఉపాధ్యక్షురాలు, భారత సంతతికి చెందిన కమలా హ్యారిస్తో కలిసి బాధ్యతలను స్వీకరించారు. తొలి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా వైట్హౌస్లో విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అమెరికా కాలమానం ప్రకారం- బుధవారం సాయంత్రం ఈ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటైంది.
కీలక నిర్ణయాలపై కారణాలు..
పలు జాతీయ, అంతర్జాతీయ అంశాలపై తాను తీసుకున్న నిర్ణయాల గురించి జో బైడెన్ ప్రస్తావించారు. అలాంటి నిర్ణయాలను ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయాన్నీ వివరించారు. ఇందులో అత్యంత కీలకమైనవి- ఆప్ఘనిస్తాన్ నుంచి తమ సైనిక బలగాలను ఉపసంహరించుకోవడం, చైనాపై వాణిజ్య యుద్ధాన్ని ప్రకటించడం. ఈ రెండు నిర్ణయాలను కూడా ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందనే విషయంపై జో బైడెన్ కారణాలను వెల్లడించారు.
ఆప్ఘన్ నుంచి బలగాలను ఉపసంహరించుకోవడంపై..
ఆప్ఘనిస్తాన్ నుంచి సైనిక బలగాలను ఉపసంహరించుకోవడాన్ని ఆయన సమర్థించుకున్నారు. ఈ నిర్ణయాన్ని తీసుకోవడం పట్ల తాను బాధపడట్లేదని స్పష్టం చేశారు. తాను క్షమాపణలను కోరాల్సిన అవసరం లేదని తేల్చి చెప్పారు. 20 నుంచి 50 ట్రూపులను వెనక్కి పంపించినట్లు గుర్తు చేశారు. సైనిక బలగాల ఉపసంహరణ తరువాత ఆప్ఘనిస్తాన్లో చోటు చేసుకున్న పరిణామాలు మంచివి కావని వ్యాఖ్యానించారు. తాలిబన్ల అసమర్థత వల్ల ఈ పరిస్థితులు ఏర్పడ్డాయని చెప్పారు.
చైనాపై ఆంక్షలను విధించడంపై..
చైనాతో వాణిజ్య యుద్ధాన్ని మొదలు పెట్టడం, ఆ దేశానికి చెందిన కొన్ని రకాల దిగుమతులపై భారీగా టారిఫ్ విధించడం పట్ల జో బైడెన్ స్పందించారు. చైనాపై విధించిన ఆంక్షలను ఎత్తి వేసే విషయంపై వాణిజ్య విభాగం అధికారులు కసరత్తు చేస్తోన్నారని తెలిపారు. అది ఎప్పటికి పూర్తవుతుందనేది చెప్పలేనని అన్నారు. ఆంక్షలు మరింతకాలం కొనసాగుతాయనే విషయాన్ని జో బైడెన్ పరోక్షంగా స్పష్టం చేసినట్టయింది. పరస్పర అంగీకారంతో తీసుకునే నిర్ణయాలకు చైనా కట్టుబడి ఉండాలని వ్యాఖ్యానించారు.
చైనాపై ఆంక్షలు ఎందుకు..
గ్ఝిన్జియాంగ్ ప్రావిన్స్లో నివసించే ముస్లింలు, హాంకాంగ్పై అనుసరిస్తోన్న వైఖరికి నిరసనగా అమెరికా.. చైనాపై ఆంక్షలను విధించింది. మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ హయాంలోనే దీనికి బీజం పడింది. గ్ఝిన్జియాంగ్ ప్రావిన్స్ నుంచి ఉత్పత్తి అయ్యే ఏ వస్తువును కూడా దిగుమతి చేసుకోమంటూ అప్పట్లో డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. దాన్ని జో బైడెన్ కూడా కొనసాగించారు. ఇంకొన్ని రకాల వస్తువుల దిగుమతులపై భారీగా టారిఫ్ను విధించారు.
2024 అధ్యక్ష ఎన్నికల్లో పోటీపై..
అమెరికాలో 2024లో అధ్యక్ష ఎన్నికలు జరుగనున్నాయి. ఈ ఎన్నికల్లో తాను కమలా హ్యారిస్తో కలిసి పోటీ చేస్తానని జో బైడెన్ చెప్పుకొచ్చారు. ఆమె పనితీరు సంతృప్తికరంగా ఉందని అన్నారు.ఉపాధ్యక్షురాలిగా తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకున్నారని ప్రశంసించారు. రెండోసారి కూడా కమలా హ్యారిస్.. తనతో కలిసి ఎన్నికల్లో పోటీ ఎందుకు చేయకూడదని ప్రశ్నించారు. ఉపాధ్యక్షురాలిగా ఆమె పని తీరు బాగుందని కితాబిచ్చారు.