కాశ్మీర్కు స్వేచ్ఛ, 1971కి భారత్పై ప్రతీకారం: హఫీజ్ సయీద్
ఇస్లామాబాద్: జమ్మూ కాశ్మీర్లో భారత్ ఎన్నికలు నిర్వహిస్తుండడంపై జమాత్ - ఉద్ - దవా చీఫ్ హఫీజ్ సయీద్ విషం చిమ్మారు. కాశ్మీరీలు స్వాతంత్ర్యం సాధించడానికి పాకిస్తానీలు ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. అమెరికాకు సాయం చేయడానికి అఫ్గనిస్తాన్కు భారత్ సైన్యం పంపుతున్నప్పుడు ముజాహిదీన్కు కాశ్మీరీలకు సాయం చేసే హక్కు ఉంటుందని ఆయన అన్నారు.
భారత ఉప ఖండంలో యుద్ధం అనివార్యమని ఆయన అన్నారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ పదే పదే కాశ్మీర్లో ఎందుకు పర్యటిస్తున్నారని ప్రశ్నిస్తూ కాశ్మీరీల నోరు మూయించడానికేనని ఆయన అన్నారు. లాహోర్లో జరపిగిన ఓ పార్టీ సమావేశంలో ఆనయ ప్రసంగించారు. కాశ్మీర్కు స్వతంత్రం వచ్చి తీరుతుందని, 1971కి ప్రతీకారం తప్పదని ఆయన అన్నారు.

అహ్మదాబాద్ గుజరాత్ బాధితులకు న్యాయం జరుగుతుందని సయీద్ అన్నారు. అక్రమ పద్ధతుల్లో బిజెపి జమ్మూ కాశ్మీర్ ఎన్నికల్లో విజయం సాధించాలని చూస్తోందని ఆయన విమర్శించారు. విజయం సాధించి కాశ్మీర్ వివాదాస్పద ప్రాంతం కాదని చెప్పాలని భావిస్తోందని, అది జరగనివ్వమని ఆయన అన్నారు.
పాకిస్తాన్ రాజకీయ పార్టీలన్నీ ఒకే వేదిక మీదికి వచ్చి కాశ్మీర్పై ఉమ్మడి విధానాన్ని తీసుకోవాలని ఆయన సూచించారు. మన వైఖరి ఏమిటనే విషయంపై స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పారు. సరిహద్దు ఆవల ఉన్న తమ సోదరులకు తాము సహకరిస్తామని అన్నారు. 1971లో పాకిస్తాన్ను చీల్చడంలో భారత్ పాత్ర ఉందని ఆరోపించారు. తమ న్యాయమైన పోరాటాన్ని అడ్డుకోలేరని అన్నారు.
ఐక్య రాజ్యసమితి వేదికపై ప్రధాని నవాజ్ షరీఫ్ కాశ్మీర్ అంశాన్ని లేవనెత్తడాన్ని ఆయన ప్రశంసించారు. ప్రేమపూరితమైన భాషను భారత్ వినకపోతే కాశ్మీరీలకు బహిరంగంగా మద్దతు ఇవ్వాలని ఆయన నవాజ్ షరీఫ్ను కోరారు.,












Click it and Unblock the Notifications