వరదలపై ఒమన్ కేరళవాసి దారుణమైన ట్వీట్, ఊడిన ఉద్యోగం
Recommended Video
దుబాయ్/తిరువనంతపురం: కేరళలో కురిన భారీ వర్షాలు, వరదల పట్ల దేశం మొత్తం ఆవేదన వ్యక్తం చేస్తోంది. ప్రపంచంలోని కొందరు ప్రముఖులు ఈ విషాదం పట్ల స్పందించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, ఆరెస్సెస్, మత్స్యకారులు, సామాన్యులు, ఇతర రాష్ట్ర ప్రభుత్వాలు సహాయ, సహకారాలు అందిస్తున్నాయి.
కేరళ విపత్తు పట్ల అందరూ తీవ్ర ఆందోళనగా ఉన్నారు. ఇలాంటి సమయంలో దుబాయ్లో ప్రముఖ కంపెనీలో పని చేసే ఉద్యోగి కేరళ వరదలపై అసభ్యకర ట్వీట్ చేశాడు. దీంతో అతని ఉద్యోగం ఊడిపోయింది. కేరళకు చెందిన రాహుల్ చెరు పళయట్టు ఒమన్లోని లులు గ్రూప్ ఇంటర్నేషనల్ కంపెనీలో క్యాషియర్గా పని చేస్తున్నాడు.
కేరళ వరదలపై సోషల్ మీడియాలో పోస్టులు వెల్లువెత్తుతున్నాయి. ఈ సందర్భంగా శానిటరీ నాప్కీన్లు కూడా అందిస్తే బాగుంటుంది అని ఓ నెటిజన్ పోస్టు పెట్టారు. దీనిపై స్పందించిన రాహుల్.. కండోమ్లు కూడా అవసరమేనని అభ్యంతరక పోస్టు పెట్టాడు.
రాహుల్ పోస్టుపై లులు గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. అతడిని వెంటనే విధుల నుంచి తప్పిస్తున్నట్లు ప్రకటించింద. రాహుల్ సోషల్ మీడియాలో చేసిన అసభ్యకర కామెంట్లు పెట్టాడని, అందుకే అతడిని ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటన చేసింది.
ఉద్యోగం పోయిన తర్వాత రాహుల్ ఫేస్బుక్ ద్వారా క్షమాపణలు చెప్పారు. ఆ సమయంలో తాను మద్యం తాగి ఉన్నానని, ఏం మాట్లాడుతున్నానో చూసుకోలేదని, జరిగిన దానికి క్షమాపణలు చెబుతున్నానని అన్నారు. అయితే రాహుల్ క్షమాపణలు చెప్పినా కంపెనీ అంగీకరించలేదు. ఇలాంటి ఘటనలను తాము సమర్థించమని, మా సంస్థ మానవ వనరులకు, నైతిక విలువలకు కట్టుబడి ఉందన్నారు.