మోస్ట్ వాంటెడ్ : ఖలిస్తాని అగ్రనాయకుడు హర్మీత్ సింగ్ హత్య... చంపింది వారేనా.?
లాహోర్ : ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్కు చెందిన అగ్రనాయకుడు హర్మీత్ సింగ్ను పాకిస్తాన్లోకి స్థానిక గ్యాంగ్లు హత్యచేశాయి. ఆర్థికపరమైన లావాదేవీల్లో బేదాభిప్రాయాలు రావడంతో హర్మీత్ను లోకల్ గ్యాంగ్లు హత్యచేశాయని పాకిస్తాన్ భద్రతా అధికారులు చెప్పారు. 2016-17లో పంజాబ్లో ఆర్ఎస్ఎస్ నాయకులను హత్య చేసిన ఘటనలో ప్రధాన నిందితుడిగా హర్మీత్ సింగ్ ఉన్నాడు. లాహోర్లోని డేరా చాహల్ గురుద్వారా వద్ద సోమవారం హర్మీత్ హత్యకు గురైనట్లు పాక్ అధికారులు వెల్లడించారు.
హర్మీత్ సింగ్పై భారత్లో పలు కేసులు నమోదయ్యాయి. పాకిస్తాన్ నుంచి ఆయుధాలు డ్రగ్స్ స్మగ్లింగ్ చేసిన కేసుల్లో ప్రధాన నిందితుడిగా హర్మీత్ సింగ్ ఉన్నాడు. 2014లో థాయ్లాండ్లో ఖలిస్తాన్ లిబరేషన్ ఫోర్స్ చీఫ్ హర్మీందర్ మింటూను పంజాబ్ పోలీసులు అరెస్టు చేసిన తర్వాత ఆ స్థానంలో హర్మీత్ ఉన్నట్లు సమాచారం. హర్మీందర్ మింటూ కొందరు గ్యాంగ్స్టర్స్తో కలిసి నభా జైలు నుంచి పారిపోయాడు. అయితే తిరిగి అతన్ని పోలీసులు పట్టుకున్నారు. ఆ తర్వాత కొంతకాలానికే అంటే 2018 ఏప్రిల్లో గుండెపోటుతో మృతి చెందాడు.
ఇక హర్మీత్ సింగ్ అమృత్సర్లోని చెహర్తాలో నివాసం ఉండేవాడు. అతనికి డాక్టొరేట్ కూడా ఉండటంతో అతన్ని అందరూ పీహెచ్డీ అని పిలిచేవారు. ఇక పాకిస్తాన్లో గత 20 ఏళ్లుగా నివసిస్తున్నట్లు సమాచారం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎనిమిది ఖలిస్తాన్ ఉగ్రవాదులపై ఇంటర్పోల్ రెడ్ నోటీసులు జారీ చేసింది. భారత్ ఇచ్చిన సమాచారంతో హర్మీత్ పై కూడా రెడ్ నోటీసులు జారీ చేసింది ఇంటర్పోల్. పాకిస్తాన్ గడ్డపై నుంచి కొన్ని విధ్వంసాలకు హర్మీత్ సింగ్ ప్లాన్ చేశాడు.
1984లో జరిగిన ఆపరేషన్ బ్లూస్టార్లో భాగంగా స్వర్ణదేవాలయంలో నక్కి ఉన్న ఉగ్రవాదులను మట్టుబెట్టిన సందర్భంగా ప్రతి ఏటా వార్షికోత్సవం జరుపుతారు. ఆ వార్షికోత్సవంను టార్గెట్గా చేసుకున్న హర్మీత్ 2019లో పెద్ద కుట్రకు వ్యూహం రచించినట్లు ఇంటెలిజెన్స్ వర్గాలు వెల్లడించాయి. కుట్రను ఇంటెలిజెన్స్ వర్గాలు భగ్నం చేశాయి. 2018లో రాజసన్సీలోని నిరాంకారీ భవన్లో ప్రార్థనలు నిర్వహిస్తున్న సమూహంపై గ్రెనేడ్ దాడి చేసిన ఘటనలో హర్మీత్ నిందితుడిగా ఉన్నాడు. ఈ ఘటనలో ముగ్గురు మృతి చెందగా పలువురు గాయపడ్డారు.