ఏంటీ 'బైనరీ ఫామ్'?: సోదరుడి హత్య వెనుక కిమ్ ప్లాన్ ఇదే.., ఊహకందని రీతిలో..
ప్యోంగ్యాంగ్: నియంతలా వ్యవహరిస్తూ ఉత్తరకొరియాలో బానిసత్వాన్ని విస్తరింపజేస్తున్న కిమ్ జాంగ్ ఉన్ గురించి మరో ఆసక్తికర కథనం వెలుగులోకి వచ్చింది. తన సోదరుడు, సవతి తల్లి కొడుకైన కిమ్ జోంగ్ నామ్ ను హత్య చేయడం వెనుక ఆయన పెద్ద ప్లానే వేసినట్లు తెలుస్తోంది.
'రుతుస్రావం'.. కొన్ని కఠిన నిజాలు: ఉ.కొరియాలో మహిళా సైనికుల దీనగాథ.. స్నానం చేయాలన్నా!
హత్య చేస్తున్నామన్న సంగతి.. హంతకులకు కూడా తెలియకుండా కిమ్ ఈ ప్లాన్ అమలుపరచడం గమనార్హం. అత్యంత చాకచక్యంగా అమలు చేసిన ఈ ప్లాన్ వెనుక అసలు ఉద్దేశాలు బయటపెడుతున్నాయి. ఒక రకంగా ఈ హత్య ద్వారా కిమ్ ప్రపంచ దేశాలకు కూడా హెచ్చరికలు జారీ చేశారు.
కిమ్ జోంగ్ నామ్ హత్య:
ఈ ఏడాది ఫిబ్రవరి 13న కిమ్ జోంగ్ నామ్ అనూహ్యంగా హత్యకు గురయ్యారు. మలేసియాలోని కౌలాలంపూర్ విమానాశ్రయంలో అతనిపై కెమికల్ దాడి జరిగింది. ఇద్దరు మహిళలు అతని ముఖంపై కెమికల్ తరహా నూనె చల్లి పారిపోయారు. ఆ తర్వాత దర్యాప్తు సంస్థలు ఇద్దరు స్థానిక మహిళల్ని, మరో వ్యక్తిని, ఉత్తరకొరియా దౌత్య సిబ్బందిని, ఎయిర్లైన్స్ సిబ్బందిని అదుపులోకి తీసుకుని విచారించగా విస్తుపోయే విషయాలు వెల్లడయ్యాయి.
ప్రాంక్ పేరుతో:
కిమ్ జోంగ్ నామ్ హత్యకు కిమ్ జాంగ్ ఉన్ పెద్ద ప్లానే వేశారు. ఇందుకోసం ఇద్దరు మలేషియా యువతులను ఎంచుకున్నారు. ఈ ఇద్దరికీ ఒకరితో మరొకరికి సంబంధం లేదు. ఒకరు మసాజ్ పార్లర్ లో పనిచేసే యువతి కాగా.. మరొకరు ఎంటర్టైన్మెంట్ సంస్థలో పనిచేస్తున్న ఉద్యోగి. టీవీ ప్రాంక్ పేరిట కిమ్ జాంగ్ ఉన్ మనుషులు వీరిని సంప్రదించారు. ఒక ప్రాంక్ వీడియో చేస్తున్నామని, అందులో నటిస్తే 90డాలర్లు ఇస్తామని చెప్పారు. టీవీ ప్రోగ్రామ్ అని చెప్పడంతో వారు ఓకె చెప్పారు.
కెమికల్ ఎటాక్:
ప్రాంక్ వీడియోలో భాగంగా కిమ్ జోంగ్ నామ్ ముఖంపై తామిచ్చే ఆయిల్ చల్లి పారిపోవాలని సూచించారు. వీరికి తెలియకుండా మరో ఇద్దరు వ్యక్తులు వారిని రహస్యంగా అనుసరించారు. ప్లాన్ ప్రకారం.. ఆ ఇద్దరు మహిళలు కిమ్ జోంగ్ నామ్ ముఖంపై కెమికల్స్ చల్లి పారిపోయారు. వాటి ప్రభావంతో మెదడు, ఊపిరితిత్తులు, కాలేయం వంటి అవయవాలు పూర్తిగా దెబ్బతిని కిమ్ జోంగ్ నామ్ కన్నుమూశాడు. అప్పట్లో ఈ హత్య ఎవరికీ అంతుచిక్కలేదు.
బైనరీ ఫామ్:
కిమ్ జోంగ్ నామ్ హత్య జరిగిన తీరు పోలీసులనే విస్మయపరిచింది. బైనరీ ఫామ్ అనే కెమికల్ ప్రయోగం ద్వారా అతన్ని హత్య చేయించారు. ప్రాంక్ వీడియో పేరుతో వారు ఒప్పందం కుదుర్చుకున్న యువతులకు.. ఇద్దరికీ వేర్వేరు రసాయనాలు ఇచ్చారు. ఈ రెండు వేర్వేరుగా ప్రమాదకరం కానప్పటికీ.. రెండు కలిస్తే మాత్రం అత్యంత ప్రమాదకరం.
హత్య కోసం కిమ్ జాంగ్ ఉన్ ఇదే పద్దతి అవలంభించారు. తొలుత ఒక యువతి కెమికల్ చల్లగానే.. ఆ తర్వాత మరో యువతి వచ్చి తనకిచ్చిన కెమికల్ చల్లింది. ఆ రెండు కలిసి వీఎక్స్ అనే ప్రమాదకర కెమికల్ గా మారి అతని ప్రాణాలు పోవడానికి కారణమయ్యాయి. ఈ పద్దతిలో హత్య చేసినవాళ్లకు ఎలాంటి ప్రమాదం ఉండదు.
ఇదో హెచ్చరిక:
అణు ఆయుధాలతో పాటు బయోలాజికల్ వార్ కు కూడా ఉత్తరకొరియా సిద్దపడుతున్నట్లు ఇప్పటికే వార్తలు వచ్చాయి. తమ దేశం అత్యంత శక్తివంతమైన రసాయనాలను కలిగి ఉందని చెప్పడానికే కిమ్ జోంగ్ నామ్ ను ఇలా బహిరంగంగా హత్య చేయించి ఉంటారని భావిస్తున్నారు. అటు అణు ఆయుధాలు, క్షిపణులతో పాటు ఉత్తరకొరియా అంటే రసాయన ఆయుధాల పరంగాను అమెరికాకు భయం పట్టుకోవాలని కిమ్ జాంగ్ భావిస్తున్నారు. అందులో భాగంగానే ఈ హత్య జరిగి ఉంటుందని సీఐఏ అంచనా వేసింది.