అమెరికాకు కిమ్ జాంగ్ సవాల్: ఉ.కొరియాకు మోడీ సడన్ షాక్
ఉత్తర కొరియా మరో అణు పరీక్షకు సిద్ధమయింది. అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్ అమరికాకు సవాల్ విసురుతున్నాడు. మరోసారి అణ్వాయుధ ప్రయోగం చేస్తే సైనిక చర్యకు దిగుతామని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది.
వాషింగ్టన్: ఉత్తర కొరియా మరో అణు పరీక్షకు సిద్ధమయింది. అధ్యక్షుడు కింగ్ జాంగ్ ఉన్ అమరికాకు సవాల్ విసురుతున్నాడు. మరోసారి అణ్వాయుధ ప్రయోగం చేస్తే సైనిక చర్యకు దిగుతామని డొనాల్డ్ ట్రంప్ ప్రభుత్వం హెచ్చరించింది. దీనికి ఉ.కొరియా ధీటుగా స్పందించింది.
అణ్వాయుధాల విషయంలో దూకుడుగానే వ్యవహరిస్తామని, తగ్గేది లేదని చెబుతోంది. ప్రపంచ దేశాలు వారిస్తున్నా వినకుండా ఇప్పటికే ఎన్నో అణ్వాయుధ పరీక్షలు జరిపిన ఉత్తర కొరియా.. తాజాగా మరో అణు పరీక్షకు సిద్ధమైంది. ఈ మేరకు ప్రకటన విడుదల చేసింది.
అమెరికా సైనిక చర్యకు దిగితే సిద్ధం
అమెరికా హెచ్చరికలను లెక్క చేయకుండా.. పెద్దన్నకు సవాల్ విసురుతూ.. ఏ క్షణంలోనైనా అణు పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది. అమెరికా సైనిక చర్యకు దిగితే ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేసింది.
అమెరికాను లక్ష్యంగా చేసుకొని..
అంతేకాదు తమ దేశం నుంచి సుదూర ప్రాంతాలను ఢీ కొట్టగలిగే సామర్థ్యమున్న క్షిపణిని ప్రయోగించనున్నట్లు ఉ.కొరియా చెప్పింది. ఇప్పటికే అమెరికాపై గుర్రుగా ఉన్న ఉ. కొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్.. ఆ దేశాన్ని లక్ష్యంగా చేసుకునే శక్తివంతమైన క్షిపణులను రూపొందిస్తున్నట్లు చెబుతున్నారు.
మోడీ ప్రభుత్వం సడన్ షాక్
అమెరికాకే సవాల్ విసురుతూ.. ఐక్యరాజ్య సమితి సూచనలనూ ఉల్లంఘిస్తూ దూకుడుగా వ్యవహరిస్తున్న ఉత్తర కొరియాకు భారత్ నుంచి కూడా వ్యతిరకేత వ్యక్తమైంది. ఉత్తర కొరియాకు తెలిసి వచ్చేలా ఓ ఆకస్మిక నిర్ణయంతో మోడీ ప్రభుత్వం సడన్ షాకిచ్చింది.
భారత్కు దక్షిణ కొరియా విజ్ఢప్తి
అంతర్జాతీయ నిబంధనలకు అనుగుణంగా ఉ.కొరియా సైనికాధికారులకు భారత్ దేశంలోని ప్రధాన భాషల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతోంది. 2008 నుంచి మహారాష్ట్రలో ఉత్తర కొరియా సైనికాధికారులు పలు దఫాలుగా భారతీయ భాషల్లో శిక్షణ తీసుకుంటున్నారు. అయితే ఇటీవల ఏర్పడిన పరిణామాలతో ఉ.కొరియా వైరి దేశం దక్షిణ కొరియా.. భారత్కు ఓ విన్నపం చేసింది.
భారతీయ భాషలు ఆపేయాలని..
ఉ. కొరియా సైన్యానికి భారతీయ భాషలు నేర్పడం ఆపేయాలనీ, అంతే కాకుండా ఆ దేశ సైన్యానికి ఉపకరించేలా ఎటువంటి సహాయం చేయకూడదని ద.కొరియా... ప్రభుత్వానికి విన్నవించింది. ఐక్యరాజ్య సమితి సూచనలు, దక్షిణ కొరియా విన్నపాన్ని దృష్టిలో పెట్టుకుని మోడీ ప్రభుత్వం విస్పష్ట నిర్ణయం తీసుకుంది.
గెటిజ్ నోట్
ఉ. కొరియా సైన్యానికి ఇకపై భారతీయ భాషలను నేర్పేది లేదనీ, శిక్షణను తక్షణమే నిలిపివేస్తున్నామంటూ ప్రకటించింది. ఏప్రిల్ 21న దీనికి సంబంధించిన గెజిట్ నోట్ను కూడా విడుదల చేసింది.
అమెరికా ఓడకు జపాన్ యుద్ధనౌక రక్షణ
కాగా, అమెరికాకు చెందిన ఒక సరఫరా నౌకకు రక్షణ కల్పించడానికి జపాన్ తన భారీ యుద్ధనౌకను రంగంలోకి దించుతోంది. రెండో ప్రపంచం యుద్ధం తర్వాత ఆ దేశం నిర్మించిన సాయుధ నౌకల్లో ఇదే అతిపెద్దది. ఉ. కొరియా వ్యవహారంపై ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో తాజా చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.
ఇజుమో అనే హెలికాప్టర్ వాహకనౌక యోకోసుకా రేవును వీడనుంది. పశ్చిమ పసిఫిక్ మహా సముద్రంలోకి వెళుతున్న అమెరికా సరఫరా నౌకకు రక్షణ కల్పించే విధుల్లో ఇది పాలుపంచుకోనుంది. యుద్ధ విన్యాసాలకు వెలుపల జపాన్ చేపట్టిన తొలి మోహరింపు ఇదే. అమెరికా సరఫరా నౌక.. పసిఫిక్లో లంగరేసిన అమెరికా యుద్ధనౌకలకు మద్దతుగా రంగ ప్రవేశం చేసింది. ఉ. కొరియా బాలిస్టిక్ క్షిపణి ప్రయోగాల నేపథ్యంలో ఈ యుద్ధనౌకలు అత్యంత అప్రమత్తతతో ఉన్నాయి.