అగ్రరాజ్యంపై కన్నెర్ర చేసిన కిమ్ మామ.. జో బైడెన్ కు ఇక దబిడి దిబిడే..!
అమెరికా రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని ఉత్తరకొరియా వార్నింగ్ ఇచ్చింది.
ఉత్తర కొరియా అగ్రరాజ్యం అమెరికా మధ్య మాటల యుద్ధం తారా స్థాయికి చేరింది. ఇక సహనం నశించిందంటూ ఉత్తరకొరియా అధ్యక్షుడు కిమ్ జాంగ్ ఉన్ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు ఆ దేశ ప్రభుత్వ మీడియా ఒక ప్రకటనలో పేర్కొంది. ఇక అమెరికాతో మాటల్లేవ్.. మాట్లాడుకోవటాల్లేవ్ అంటూ వార్నింగ్ ఇచ్చారు కిమ్ జాంగ్ ఉన్. అమెరికా వ్యవహరిస్తున్న తీరు,రెచ్చగొట్టే విధానంపై ఘాటుగా స్పందిస్తామంటూ కిమ్ మాటగా ఆ దేశ ప్రభుత్వ మీడియా ప్రపంచానికి చాటింది.
నో సైలెన్స్ ..
ఉత్తర కొరియా లక్ష్యంగా అమెరికా ఇతర దేశాలతో కలిపి మిలటరీ చర్యలకు పాల్పడుతోంది. ఇక దీనిపై మౌనం వహించేది లేదంటూ కిమ్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. తాము కూడా చాలా ఘాటుగా రిప్లయ్ ఇవ్వాల్సి వస్తుందని వెల్లడించారు. అయితే అమెరికా మాత్రం ఉత్తరకొరియా చేసిన ప్రకటనను ఖండిస్తోంది. కిమ్ జాంగ్ ఉన్తో చర్చలకు అమెరికా సిద్ధమని... వేదికను కూడా ఉత్తరకొరియాకు అనుకూలంగా ఉండే ప్రాంతాన్నే సూచించాలని అమెరికా ప్రభుత్వ ప్రతినిధి ఒకరు వెల్లడించారు.
అమెరికా హద్దు దాటుతోంది
ఇదిలా ఉంటే అమెరికా డిఫెన్స్ సెక్రటరీ లాయిడ్ ఆస్టిన్ దక్షిణ కొరియా రాజధాని సియోల్లో పర్యటించినట్లు ఉత్తరకొరియా ఒక ప్రకటన విడుదల చేసింది. కొరియా భూభాగంలో అమెరికా దక్షిణ కొరియాలు సంయుక్త మిలటరీ ఆపరేషన్స్ నిర్వహిస్తున్నాయని వెల్లడించింది.అంతేకాదు ఉత్తరకొరియా ఆయుధాలను ధ్వంసం చేసేందుకు కూడా అమెరికా ప్రయత్నిస్తోందంటూ ఆ దేశం ఆరోపణలు గుప్పించింది. అమెరికా కొరియా ద్వీపంలో యుద్ధం చేసేందుకు సన్నద్ధమవుతోందని వెల్లడించింది. ఇలాంటి రెచ్చగొట్టే చర్యలకు దిగితే తాము కూడా తగ్గమని ఎందాకైనా వెళతామని కిమ్ హెచ్చరించాడు. అణ్వాయుధాలను ఉపయోగించేందుకు కూడా వెనకాడమని తేల్చి చెప్పారు.
ఖండించిన అమెరికా
మరోవైపు అమెరికా మాత్రం కిమ్ జాంగ్ ఉన్ చేసిన ప్రకటనను ఖండించింది. కొరియా ద్వీపంలో ఎప్పటిలానే మిలటరీ డ్రిల్స్ నిర్వహిస్తున్నామని వెల్లడించింది. ఎవరినీ రెచ్చగొట్టే ప్రయత్నం అమెరికా చేయడం లేదని స్పష్టం చేసింది. గతేడాది ఉత్తరకొరియా పలు మార్లు క్షిపణి ప్రయోగాలు చేసింది.వీటిని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఖండిస్తూ ఇలాంటి ప్రయోగాలపై నిషేధం విధిస్తూ తీర్మానం సైతం చేసింది. అంతేకాదు 2017 తర్వాత అణ్వాయుధాల పరీక్ష ప్రాంతాన్ని మూసివేసిన ఉత్తరకొరియా తిరిగి అక్కడి నుంచి క్షిపణి పరీక్షలు ప్రారంభించడంతో అలజడి మొదలైంది. ఇదిలా ఉంటే బుధవారం అమెరికా దక్షిణ కొరియా దేశాలు సంయుక్తంగా యుద్ధ విమానాలతో డ్రిల్ నిర్వహించాయి.