Kulbhushan Jadhav case: ICJ తీర్పుపై ఆర్డినెన్స్కు పాకిస్తాన్ పార్లమెంట్ ఆమోదం -అప్పీలుకు హక్కు
ఇండియన్ నేవీ మాజీ అధికారి కుల్భూషణ్ జాదవ్ వ్యవహారంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ప్రస్తుతం పాకిస్తాన్ జైలులో ఉన్న ఆయనకు అక్కడి ఆర్మీ కోర్టు మరణ శిక్ష విధించగా, ఇప్పుడా శిక్షను సవాలు చేస్తూ ఇస్లామాబాద్ హైకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం జాదవ్ కు లభించింది. పాకిస్తాన్ జాతీయ అసెంబ్లీ (పార్లమెంట్) గురువారం 'ఐసీజే ఆర్డినెన్స్-2020'కి ఆమోదం తెలపడంతో జాదవ్ కు న్యాయపరమైన హక్కులు దక్కినట్లయింది.
Recommended Video
గూఢచర్యం ఆరోపణలపై అరెస్టయిన జాదవ్ కు పాక్ ఆర్మీ కోర్టు విధించిన మరణ శిక్షను రివ్యూ చేయాలని, ఆమేరకు అతనికి న్యాయ సహకారం అందేలా చూడాలని అంతర్జాతీయ కోర్టు(ఐసీజే) ఆదేశించడంతో విధిలేని పరిస్థితితుల్లో పాక్ ముందడుగు వేసినా, గడిచిన ఏడాది కాలంగా తనకు అలవాటైన వంకర బుద్దిని దాయాది ప్రదర్శిస్తూ వచ్చింది. దీంతో భారత్ మరోసారి ఐసీజేను ఆశ్రయించడంతో మరో దారిలేక జాదవ్ న్యాయ సహకారం పొందే వీలున్న ఆర్డినెన్స్ కు పాక్ పార్లమెంట్ ఆమోదించింది.
జాదవ్ కేసుకు సంబంధించి 'ఇంటర్నేషనల్ కోర్ట్ ఆఫ్ జస్టిస్ (ఐసీజే) ఆర్డినెన్స్ 2020'ని గతేడాది పాక్ ప్రధాని ఇమ్రాన్ ఖాన్ జాతీయ అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దానిపై పెద్ద ఎత్తున రచ్చ జరిగింది. భారత్ సహా అంతర్జాతీయ సమాజం నుంచి ఒత్తిడి పెరగడంతో ఎట్టకేలకు ఆ ఆర్డినెన్స్ కు పార్లమెంట్ ఆమోదం లభించింది. ఈ పరిణామం జాదవ్.. పాకిస్తాన్ హైకోర్టులలో తన శిక్షను అప్పీల్ చేయడానికి అనుమతిస్తుంది.
జాదవ్ కు న్యాయ సహాయం అందించాలని ఐసీజే గతేడాదే తీర్పు చెప్పినా.. ఆ ప్రక్రియకు ఆటంకాలు సృష్టిస్తూ పాక్ డ్రామాలాడింది. జాదవ్ ను కలవనీయకుండా లాయర్లను అడ్డుకుంది. దీంతో భారత్ మరోసారి ఐసీజేను ఆశ్రయించింది. అంతర్జాతీయ కోర్టు ఆదేశాలను పాటించకపోతే పలురకాల ఆంక్షలు ఎదుర్కోనే పరిస్థితి నెలకొనడంతో పాక్ ఎట్టకేలకు జాదవ్ కు న్యాయ సహాయాన్ని కల్పిస్తున్నది. అయితే, భారత్ కోరినట్లు భారత లాయర్లను కాకుండా, ఇరు దేశాలకు ఆమోదయోగ్యమైన ఇతర లాయర్ల ద్వారా మాత్రమే కేసు ముందుకు సాగాలని పాక్ వాదిస్తున్నది.