కరోనా షాకింగ్: మర్కజ్ లాగే చర్చిలు.. ‘పామ్ సండే’కు భారీగా.. వైరస్ సైతానును ఓడిస్తామన్న పాస్టర్లు..
కరోనా ప్రమాదం పీక్సకు చేరినవేళ.. మనదేశరాజధాని ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ మసీదు ప్రార్థనల వ్యవహారం తీవ్ర కలకలం సృష్టించింది. ఆ ఘటనతో పాజిటివ్ కేసుల సంఖ్య రెండింతలు పెరిగింది. ''డాక్టర్లు, ప్రభుత్వం చెప్పినట్లు ఇల్లుకదలకుండా బతకడం కంటే.. సామూహిక నమాజు చేసి చావడం మంచిది''అని మర్కజ్ చీఫ్ మౌలానా సాద్ చేసిన కామెంట్లు కూడా విన్నాం. మొన్న శ్రీరామనవమిరోజున.. నిబంధనలకు విరుద్ధంగా చాలా చోట్ల దేవుడిపెళ్లిని ఘనంగా నిర్వహించిన సీన్లూ చూశాం. సరిగ్గా ఇవే సీన్లు.. అగ్రరాజ్యం అమెరికాలోనూ రిపీట్ అవుతున్నాయి.
క్రైస్తవులకు ఈ వారం కీలకం..
ప్రపంచ వ్యాప్తంగా క్రైస్తవులు.. ఈ వారాన్ని‘పవిత్రవారం'గా ఆచరిస్తారు. ఏప్రిల్5న పామ్ సండే(మట్టల ఆదివారం), 10న గుడ్ ఫ్రైడే, 12 ఈస్టర్ పండుగ జరుపుకోనున్నారు. అయితే కరోనా వైరస్ విజృంభిస్తున్న దేశాల్లో అన్ని మతాలకు చెందిన అన్నిరకాల సామూహిక ప్రార్థనల్ని నిషేధించారు. నిషేధం ఉత్తర్వులకు విరుద్ధంగా ప్రార్థనలు చేయడం ద్వారా మన మర్కజ్ లో జరిగినట్లే.. అమెరికా, ఫ్రాన్స్, సౌత్ కొరియాలాంటి దేశాల్లోనూ చర్చిల ద్వారా వైరస్ వ్యాప్తి చెందినట్లు ప్రభుత్వాలు గుర్తించాయి. ఈ నేపథ్యంలో ప్రస్తుత పవిత్రవారానికి సంబంధించి.. చర్చిలు అన్నింటినీ మూసేసి ఉంచాలనే ఆదేశాలు వెలువడ్డాయి. కానీ పాస్టర్లు మాత్రం ఇందుకు అంగీకరించడంలేదు. మరీముఖ్యంగా అమెరికాలోనైతే కొందరు సవాళ్లు కూడా విసిరారు.
సైతాను పనే ఇది..
కాలిఫోర్నియా నుంచి మైనే దాకా.. టెక్సాస్ నుంచి నార్త్ డకోటా దాకా.. అమెరికాలోని మొత్తం 50 రాష్ట్రాల్లోనూ కరోనా వైరస్ ప్రభావం చాలా తీవ్రంగా ఉంది. ప్రపంచంలోనే మోస్ట్ ఎఫెక్టెడ్ గా మారిన అమెరికాలో పాజిటివ్ కేసుల సంఖ్య రికార్డు స్థాయిలో 3 లక్షలు దాటింది. మరణాలు 10 వేలకు చేరువయ్యాయి. దీంతో పవిత్ర వారంలో జరగాల్సిన సామూహిక ప్రార్థనలు వద్దని ప్రభుత్వం హెచ్చరించింది. కానీ సాలిడ్ రాక్, లోన్ స్టార్ బాప్టిస్ట్ లాంటి చర్చిలు.. తాము ప్రార్థనల్ని జరిపితీరుతామని సవాళ్లు చేశాయి. క్రైస్తవులు సామూహికంగా ప్రార్థనల్ని చెడగొట్టడానికి దుష్టసైతాను ప్రయత్నిస్తున్నదని, వైరస్ రూపంలో పన్నాగాలు రచిస్తున్నదని కొందరు పాస్లర్లు చేసిన కామెంట్లున ప్రఖ్యాత ‘రాయిటర్స్' వార్తా సంస్థ ప్రచురించింది. అయితే..
ఆన్ లైన్ ప్రార్థనలే మంచిది..
కరోనా వైరస్ అనేది.. దేవుడికి సైతానుకు మధ్య జరుగుతోన్న యుద్ధమని, ఇలాంటి సమయంలోనే చర్చిల్లో ప్రార్థనలు చేయాలని కొందరు పాస్టర్లు దుష్ప్రచారం చేస్తుండగా, అమెరికాలోని మెజార్టీ మతపెద్దలు మాత్రం మార్పును స్వీకరించారు. పవిత్రవారంలో పామ్ సండే, గుడ్ ఫ్రైడే, ఈస్టర్ పండుగలన్నీ ఆన్ లైన్ లోనే నిర్వహించుకుందామని పిలుపునిచ్చారు. తమ మెంబర్లు లైవ్ స్ట్రీమింగ్ లో మతగురువుల బోధను వినేలా చాలా చర్చిలు ఇప్పటికే ఏర్పాట్లు చేసుకున్నాయి. వద్దన్నా వినకుండా సామూహిక ప్రార్థనలు నిర్వహిస్తామన్న చర్చిలపై చర్యలకు ప్రభుత్వం రెడీ అవుతోన్నట్లు సమాచారం.
ట్రంప్ అస్త్రసన్యాసం..
కరోనా పుట్టిన చైనాలోనే ఒక సందర్భంలో పాజిటివ్ కేసుల సంఖ్య లక్ష దాటింది. కానీ అమెరికాలో మాత్రం రికార్డు స్థాయిలో 3 లక్షల మందికిపైగా వైరస్ కాటుకు గురికావడం గమనార్హం. మరోవైపు మరణాల సంఖ్య 10 వేలకు చేరడం, రాబోయే రోజుల్లో పరిస్థితులు మరింత భయానకంగా తయారై, కనీసం 2 లక్షల మంది చనిపోయే ప్రమాదముందని వైద్యులు అంచనాలు కట్టడంతో అక్కడి ప్రజలు భయాందోళనలో కాలం గడుపుతున్నారు. భరోసా కల్పించాల్సిన ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్.. తాను అస్త్రసన్యాసం చేశానన్నట్లు వైరాగ్యంతోకూడిన కామెంట్లు చేశారు. మరణాలకు మానసికంగా సిద్ధంగా ఉండాలని ప్రజలకు పిలుపునిచ్చారు. మలేరియా వ్యాక్సిన్ ను కొవిడ్-19కు కూడా వాడుతున్న నేపథ్యంలో ఆ ‘హైడ్రాక్సీ క్లోరోక్వీన్'ను సరఫరా చేయాలంటూ భారత్ ను ట్రంప్ అర్ధించారు.