ప్రాంతీయ యుద్ధం: జీ జింగ్పింగ్ వ్యాఖ్యల కలకలం
బీజింగ్/న్యూఢిల్లీ: చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ సోమవారం చేసిన 'ప్రాంతీయ యుద్ధం' వ్యాఖ్యలు కలకలం రేపాయి. ప్రాంతీయంగా జరిగే యుద్ధంలో విజయం సాధించేందుకు సిద్ధంగా ఉండాలంటూ జీ జిన్పింగ్ తమ సైనిక కమాండర్లకు పిలుపునిచ్చాడు. దీంతో ఎన్డీయే ప్రభుత్వం అప్రమత్తమైంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో జిన్పింగ్ పిలుపు ప్రాధాన్యతను సంతరించుకుంది.
ప్రధానమంత్రి మోడీ సమీక్ష అనంతరం ఇచ్చిన సూచనల మేరకే ఆర్మీ చీఫ్ దల్బీర్సింగ్ సుహాగ్ భుటాన్ పర్యటనను రద్దు చేసుకుని సీనియర్ కమాండర్లతో చర్చలు జరిపారు. సోమవారం పీపుల్స్ లిబరేషన్ ఆర్మీతో జీ జిన్పింగ్ మాట్లాడుతూ.. ప్రాంతీయ యుద్ధానికి సిద్ధంగా ఉండాలని సూచించినట్లుగా వార్తలు వస్తున్నాయి.
పదిహేనుమంది ముఖ్యమైన కమాండర్లను బీజింగ్కు పిలిపించుకుని జిన్పింగ్ చర్చలు జరిపారంటున్నారు. తనకు అత్యంత సన్నిహితంగా ఉండే ముగ్గురు కమాండర్లకు పదోన్నతి కల్పించారు. ప్రాంతీయ యుద్ధంలో విజయం సాధించే సామర్థ్యాన్ని కమాండర్లకు ఆయన పిలుపునివ్వడం చర్చనీయాంశంగా మారింది. జీ జిన్పింగ్ పిలుపు వెనుక ఉన్న ఉద్దేశమేమిటన్నది అనేక ప్రశ్నలకు దారితీస్తోంది.
కాగా, చుమార్లో తిష్టవేసిన చైనా సైనికులు వెనకకు తగ్గే సూచనలే కనిపించటం లేదు. వీరికి చైనా అధికారులు ఆయుధాలతోపాటు ఆహార పదార్థాలను హెలికాప్టర్ల ద్వారా సరఫరా చేస్తున్న నేపథ్యంలో ప్రాంతీయ యుద్ధం గురించి జిన్పింగ్ మాట్లాడటమే భారత్ అప్రమత్తం కావడానికి కారణమైంది.
1962లో చైనా అప్పటి ప్రధాన మంత్రి చౌఎన్లై భారతలో పర్యటించి ప్రధాని నెహ్రూతో పంచశీల ఒప్పందాన్ని కుదుర్చుకుని తిరిగి వెళ్లిన వెంటనే భారత్పై దురాక్రమణ జరిపి ఆక్సాయిచిన్ ప్రాంతాన్ని ఆక్రమించుకున్న విషయం తెలిసిందే.