ఎంహెచ్ 370పై ట్విస్ట్: పైలట్ చివరి మాటలు అవి కావు!
కౌలాలంపూర్: దక్షిణ హిందూ మహాసముద్రంలో జల సమాధి అయినట్లుగా భావిస్తున్న మలేషియా ఎంహెచ్ 370 విమానం పైలట్ చివరిసారిగా గుడ్ నైట్ అన్నట్లుగా వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే, మలేషియా అధికారులు ఆ వ్యాఖ్యలు చేయలేదని తాజాగా చెబుతున్నారు. గతంలో ఆల్ రైట్ గుడ్ నైట్ అన్నట్లుగా వెల్లడించారు. ఇప్పుడు మాత్రం.. గుడ్ నైట్ మలేషియన్ త్రీ సెవెన్ జీరో అని చెప్పినట్లుగా చెబుతున్నారు.
కాగా, ఐదుగురు భారతీయులు సహా మొత్తం 239 మందితో మలేషియా ఎయిర్లైన్స్కు చెందిన జెట్ విమానం ఎంహెచ్-370 అదృశ్యం కావడం వెనుక కొనసాగుతున్న అసాధారణ మిస్టరీని ఛేదించేందుకు నిర్ధేశిత గడువు ఏమీ లేదని ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి టోనీ అబ్బాట్ సోమవారం స్పష్టం చేశారు.
దక్షిణ హిందూ మహాసముద్రంలో తాజాగా గుర్తించిన శకలాలు మలేషియా విమానానికి చెందినవి కావని తెలుస్తున్నప్పటికీ ఆయన ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఈ విమానం ఆచూకీని కనుగొనేందుకు హిందూ మహాసముద్రంలోని 2.54 లక్షల చదరపు కిలో మీటర్ల ప్రాంతాన్ని జల్లెడపడుతున్న పది విమానాలు, మరో పది నౌకలు సోమవారం తమ గాలింపు చర్యలను ముమ్మరం చేశాయి. అయితే ఆస్ట్రేలియా నేతృత్వంలోని బృందం ప్రతికూల వాతావరణ పరిస్థితుల కారణంగా తమ గాలింపు చర్యలను నిలిపివేయాల్సి వచ్చింది.
దక్షిణ హిందూ మహాసముద్రంలో గుర్తించిన నారింజ రంగు వస్తువులు చేపల వేటకు ఉపయోగించే పరికరాలే తప్ప మలేషియా విమానానికి చెందినవి కావని ఆస్ట్రేలియా నౌకాయాన భద్రతా విభాగం పేర్కొంది. మలేషియా విమానం ఆచూకీ కనుగొనేందుకు నిర్ధేశిత గడువు ఏమీ లేదని, దీని కోసం ఇప్పటికే కొంతకాలం నుంచి వెతుకుతున్న తాము మరికొంతకాలం పాటు గాలింపు కొనసాగిస్తామని రాయల్ ఆస్ట్రేలియన్ ఎయిర్ఫోర్స్ (ఆర్ఎఎఎఫ్) కేంద్రంలో అబ్బాట్ తెలిపారు.