రేప్ షాకింగ్! పెళ్లికి ముగ్గురిలో ఇద్దరు మలేషియా ఇండియన్స్ నో
కౌలాలంపూర్: మలేషియన్ టెలివిజన్ చానల్ ఆస్ట్రో వరల్డ్ ఓ సోషల్ ఎక్స్పరిమెంట్ ఫిల్మ్ను రూపొందించింది. అందులో ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగులోకి వచ్చాయి. మలేషియాలో ఉన్న ప్రతి ముగ్గురు భారతీయుల్లో ఇద్దరు.. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు నిరాకరిస్తున్నారని తేలిందట.
అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకుంటే తమ కుటుంబ గౌరవం మంటకలుస్తుందని వారు భావిస్తున్నారట. అందుకే అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకోమని చెబుతున్నారట.
ఆ వీడియో నాలుగున్నర నిమిషాలు ఉంది. పలువురిని ఇంటర్వ్యూ చేశారు. అందులో ప్రతి ముగ్గురిలో ఇద్దరు యువకులు పై విషయాన్ని చెప్పారని అందులో పేర్కొన్నారు.
ఓ వ్యక్తి తమిళంలో మాట్లాడుతూ.. తాను లైంగిక దాడికి గురైన అమ్మాయిని పెళ్లి చేసుకోనని, అది తన కుటుంబానికి మచ్చ అని చెప్పాడు.
మరో వ్యక్తి మాట్లాడుతూ... తాను అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకుంటే తనను ప్రశ్నించే ప్రజలకు సమాధానం చెప్పలేని పరిస్థితి వస్తుందని అభిప్రాయపడ్డారు.
కాగా, సదరు వీడియోలో ఎవరిని ఇంటర్వ్యూ చేశారనే పేర్లు వెల్లడించలేదు. అయితే, వారి ముఖాలు మాత్రం స్పష్టంగా కనిపిస్తున్నాయి.
ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రతి నలుగురి మహిళల్లో ఒక మహిళ మాట్లాడుతూ.. అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు ఎవరు ఇష్టపడరని చెప్పారు. అయితే, ఇది బాధిత బాలిక తప్పు కాదని, ఊహించని సంఘటన అని, అయితే అలాంటి వారిని చాలామంది అంగీకరించరని పేర్కొన్నారు.
కొందరు యువకులు మాత్రం అత్యాచార బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు సంసిద్ధత వ్యక్తం చేశారు. అందులో ఆమె తప్పులేనప్పుడు ఆమెను ఎందుకు అనాలని ప్రశ్నించారు. మరో మహిళ మాట్లాడుతూ.. అత్యాచార బాధితురాలిని బహిష్కరించడం సరికాదన్నారు.