ఊరట: మాల్యా ఆస్తుల స్తంభనకు నో చెప్పిన బ్రిటన్ కోర్టు
దేశంలో పలు బ్యాంకుల వద్ధ తీసుకున్న వేలకోట్ల రుణాలు ఎగవేసి లండన్లో తలదాచుకుంటున్న లిక్కర్ బ్యారన్ విజయ్ మాల్యాకు బ్రిటన్ కోర్టులో కాస్త ఊరట లభించింది. కింగ్ ఫిషర్ ఎయిర్ లైన్స్ బకాయిలను రాబట్టుకునేందుకు బ్రిటన్ న్యాయస్థానాన్ని ఆశ్రయించిన 13 బ్యాంక్ల కన్సార్టియంకు న్యాయ పోరాట ఖర్చుల కింద 2 లక్షల పౌండ్లు అంటే భారత కరెన్సీలో రూ.1.80 కోట్లు చెల్లించాల్సిందిగా మాల్యాను కోర్టు ఆదేశించింది.
మాల్యా కేసును విచారించిన న్యాయమూర్తి ఆండ్రూ హెన్షా ... మాల్యా ఆస్తులను స్తంభింపజేసేందుకు నిరాకరిస్తూనే... అదే సమయంలో బ్యాంకులకు అవుతున్న ఖర్చులను మాల్యా తప్పకుండా చెల్లించాల్సిందేనని ఆదేశించారు. మరోవైపు మాల్యాను భారత్కు అప్పగించాల్సిందిగా కోరుతూ వేసిన పిటిషన్పై వచ్చే నెల వెస్ట్ మినిస్టర్ కోర్టు ముందుకు రానుంది.
స్టేట్ బ్యాంక్తో సహా దేశంలోని 13 ప్రధాన బ్యాంకుల నుంచి తీసుకున్న రూ.9 వేల కోట్లకు పైగా రుణాలను ఎగవేసి 2016లో మాల్యా దేశం వదిలి లండన్ పారిపోయాడు. ఇక మాల్యా స్కామ్ బయటపడినప్పటి నుంచి అతడిని భారత్కు రప్పించేందుకు ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.