స్కూల్లో ఘోరం: అల్కాహాల్ పోసి నిప్పు, టీచర్తోపాటు నలుగురు చిన్నారుల మృతి
బ్రెజిల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. జనుబా ప్రాంతంలోని ఓ నర్సరీ స్కూల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డు..
రియో డి జనారియో: బ్రెజిల్లో దారుణ ఘటన చోటుచేసుకుంది. జనుబా ప్రాంతంలోని ఓ నర్సరీ స్కూల్లో పనిచేసే సెక్యూరిటీ గార్డు.. పాఠశాలలోని చిన్నారులపై ఆల్కహాల్ పోసి నిప్పంటించాడు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు సజీవదహనమయ్యారు. వీరితో పాటు ఓ టీచర్ కూడా మృతిచెందినట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. ఆ తర్వాత నిందితుడు కూడా నిప్పటించుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
అల్కాహాల్ చల్లి..
ఘటనకు సంబంధించిన వివరాల్లోకి వెళితే.. స్థానిక నర్సరీ స్కూల్లో నైట్ వాచ్మెన్గా పనిచేస్తున్న నిందితుడు.. గురువారం ఉదయం పాఠశాలకు వచ్చాడు. నేరుగా పిల్లలుండే గదికి వెళ్లి వారిపై మద్యం చల్లాడు. ఆ తర్వాత తనపై కూడా చల్లుకుని నిప్పంటించుకున్నాడు.
చిన్నారుతోపాటు టీచర్ సజీవ దహనం..
ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే అక్కడంతా మంటలు వ్యాపించాయి. దీంతో చిన్నారులు అరుపులు, కేకలు వేస్తూ బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో నలుగురు చిన్నారులు, ఓ టీచర్ సజీవదహనమవగా 50 మంది వరకు గాయపడ్డారు. మృతిచెందిన చిన్నారులంతా నాలుగేళ్ల వయసువారే. ఘటన సమయంలో స్కూల్లో 80 మంది చిన్నారులు ఉన్నట్లు యాజమాన్యం తెలిపింది.
హుటాహుటిన ఆస్పత్రికి..
పిల్లల కేకలు విన్న చుట్టుపక్కల వారు, స్కూల్ సిబ్బంది వెంటనే వారిని ఆసుపత్రికి తరలించారు. నిందితుడిని కూడా ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ అతడు మృతిచెందాడు. ప్రస్తుతం గాయపడ్డ చిన్నారుల పరిస్థితి నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు.
మద్యానికి బానిసౌ...
ఘటనకు బాధ్యుడైన గార్డు గత ఎనిమిదేళ్లుగా ఇదే స్కూల్లో పనిచేస్తున్నట్లు తెలిసింది. కొంతకాలంగా అతడి మానసిక స్థితి సరిగా లేదని.. అందుకే ఇలా ప్రవర్తించి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుడి ఇంటికి వెళ్లి పరిశీలించగా అక్కడ భారీగా మద్యం సీసాలను గుర్తించారు. అతడు మద్యానికి బానిసై ఇలా ప్రవర్తించి ఉంటాడని భావిస్తున్నారు. ఘటనపై లోతుగా దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు.