68ఏళ్ల తర్వాత: నేటి రాత్రి అతిపెద్ద సూపర్ మూన్
న్యూయార్క్: అంతరిక్షంలో అద్భుతం ఆవిష్కృతం కానుంది. సోమవారం రాత్రి పూర్ణచంద్రుడు ఆకాశంలో చాలా పెద్దగా మరింత ప్రకాశవంతంగా కనిపించనున్నాడు. 68ఏళ్లకు ఒక్కసారి వచ్చే ఈ అద్భుత అవకాశాన్ని చూసేందుకు అందరూ సిద్ధంగా ఉండాలని నాసా తెలిపింది.
భూమికి దగ్గరగా రావడంతోనే చంద్రు డు మరింత ప్రకాశవంతంగా కనిపిస్తాడని వెల్లడించింది. 1948లోనూ పూర్ణచంద్రుడు ప్రకాశవంతంగా కనిపించినా ఎక్కువ మంది ప్రజలు చూడలేకపోయారని తెలిపింది. మళ్లీ ఇలాంటి అద్భుతం కనిపించాలంటే 2034 వరకు ఆగాల్సిందేనని చెప్పింది..
దీర్ఘవృత్తాకార కక్ష్యలో తిరుగుతున్న భూమికి చంద్రుడు కొన్ని సమయాల్లో దగ్గరగానూ మరికొన్ని సమయాల్లో దూరంగా జరుగుతాడని తెలిపింది. భూమికి దగ్గరగా వచ్చే సమయంలోనే చంద్రుడు ప్రకాశవంతంగా కనిపిస్తాడని పేర్కొంది. కాగా, చంద్రుడికి భూమి దూరంగా జరుగడాన్ని అపోజీ అని, దగ్గరగా వచ్చేదానిని పెరిజీ అంటారు.
సాధారణంగా పెరిజీ 14శాతం పెరుగడంతో చంద్రుడు భూమికి దగ్గరగా వస్తాడు. అదే సమయంలో చంద్రుడు రోజు కంటే 30 శాతం ఎక్కువ ప్రకాశవంతంగా కనిపిస్తాడని నాసా పేర్కొంది. ఈ అద్భుతాన్ని భారత్లోనూ వీక్షించవచ్చని నాసా డిప్యూటీ ప్రాజెక్టు శాస్త్రవేత్త నహ్ పెట్రో వెల్లడించారు.