వణికిస్తున్న మార్ బర్గ్ వైరస్ : ఆ కేసుకు 150 కాంటాక్ట్స్ , ఎబోలా జాతి డెడ్లీ వైరస్ : డబ్ల్యూహెచ్ఓ అలెర్ట్
కరోనా మహమ్మారితో విలవిలలాడుతున్న ప్రపంచానికి ఇప్పుడు మరో వైరస్ భయం పట్టుకుంది. మార్ బర్గ్ వైరస్ ఇప్పుడు కొత్తగా ప్రపంచానికి వణుకు పుట్టిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్ బర్గ్ వైరస్ తో అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది. ఈ వైరస్ సోకితే దాదాపు 88 శాతం చనిపోయే అవకాశాలు ఉంటాయని హెచ్చరిస్తోంది. దీనికి మందులు లేవని, వ్యాక్సిన్లు కూడా లేవని రోగి శరీరంలో చెక్కెర స్థాయిలు పడిపోకుండా ద్రవాలను, జ్యూస్ లను ఇస్తూ ఉండాలని చెప్తోంది. కరోనా మహమ్మారి మాదిరిగానే వ్యాప్తికి ఎక్కువ అవకాశాలు ఉన్న వైరస్ గా మార్ బర్గ్ వైరస్ ను వెల్లడించింది.

ప్రపంచానికి మరో కొత్త టెన్షన్ .. మార్ బర్గ్ వైరస్
ఇప్పటికే ప్రపంచం కరోనా మహమ్మారి గుప్పిట్లో చిక్కి విలవిలలాడుతుంది. ఇంకా కరోనా కేసులు తగ్గలేదు . నిత్యం ప్రపంచ వ్యాప్తంగా లెక్కకు మిక్కిలి ప్రజలు కరోనా మహమ్మారి దెబ్బకు కడతేరిపోతున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ కరోనా ఇప్పట్లో ప్రపంచాన్ని వదలదని, అప్రమత్తంగా ఉండాల్సిందే అని తేల్చి చెప్తుంది. ఇక ప్రపంచ వ్యాప్తంగా మరణాలను తగ్గించే క్రమంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం యుద్ధ ప్రాతిపదికన నిర్వహించాలని సూచిస్తుంది. ప్రపంచమంతా ఆరోగ్య సంక్షోభంతో ఉన్న ఈ పరిస్థితుల్లో మరో పిడుగుపాటు వార్త మార్ బర్గ్ వైరస్ రూపంలో ప్రజలను టెన్షన్ పెడుతోంది. వేగంగా విస్తరించే లక్షణం ఉన్న మార్ బర్గ్ వైరస్ పట్ల అలెర్ట్ గా ఉండాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఇప్పుడు మరో వార్నింగ్ ఇస్తున్నారు.

మార్ బర్గ్ వైరస్ బాధితుడికి ముగ్గురు కుటుంబ సభ్యులతో సహా దాదాపు 150 కాంటాక్ట్స్
ఇటీవల మార్ బర్గ్ వైరస్ సోకిన వ్యక్తి మరణించినట్లు గినియా ధృవీకరించిన కొన్ని రోజుల తర్వాత, ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) ఇప్పటివరకు ముగ్గురు కుటుంబ సభ్యులు మరియు ఆరోగ్య కార్యకర్తతో సహా దాదాపు 150 పరిచయాలు ఈ వైరస్ సోకిన వ్యక్తి కాంటాక్ట్స్ గా గుర్తించబడ్డాయని చెప్పారు. ఇక వీరిని ఐసోలేట్ చేసినట్టు సమాచారం. డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ ఎబోలా జాతికి చెందిన మార్ బర్గ్ ,కరోనా వైరస్ కు చాలా భిన్నమైన వైరస్ అయినప్పటికీ, ప్రతిస్పందన యొక్క అనేక అంశాలు లక్షణాలు, ట్రేసింగ్తో సహా ఒకే విధంగా ఉన్నాయని వెల్లడించారు. ఈ వైరస్ సోకిన వారిని మిగతా వ్యక్తులను కలవకుండా ఐసోలేషన్ చేయడం తప్ప వేరే మార్గం లేదని వెల్లడించారు.

మార్ బర్గ్ వ్యాప్తి పై శోధనలు ... డబ్ల్యూహెచ్ఓ చీఫ్ వెల్లడి
వ్యాప్తి యొక్క మూలాన్ని పరిశోధించడానికి, పరిచయాలను కనుగొనడానికి మరియు తమను తాము ఎలా రక్షించుకోవాలో స్థానిక సమాజానికి తెలియజేయడానికి ప్రపంచ ఆరోగ్య సంస్థ భాగస్వాములు గినియా ఆరోగ్య మంత్రిత్వ శాఖకు సపోర్ట్ చేస్తున్నారని టెడ్రోస్ వివరించారు. తాజాగా గినియా దేశంలోని నైరుతిలో మార్ బర్గ్ వైరస్ కేసు గురించి యునైటెడ్ నేషన్స్ ప్రపంచ ఆరోగ్య సంస్థకు తెలియజేసింది. పశ్చిమ ఆఫ్రికాలో మార్ బర్గ్ సోకిన వ్యక్తి లక్షణాలు ప్రారంభమైన 8 రోజుల తర్వాత మరణించాడు. ఈ వైరస్ కు అత్యంత ప్రమాదకరమైన వ్యాధికారకము విపరీతమైన జ్వరంతో పాటు రక్తస్రావానికి కారణమౌతుంది.

మార్ బర్గ్ వైరస్ కు వ్యాక్సిన్ లేదు
గత వ్యాప్తి ప్రకారం, ఈ వైరస్ బారిన పడిన వారి సగటు మరణాల రేటు 50 శాతం. ఇదిలా ఉంటే మార్ బర్గ్ వైరస్ కు ఇప్పటివరకు అనుమతులు పొందిన వ్యాక్సిన్ లేదు, అయినప్పటికీ వ్యాక్సిన్లు అభివృద్ధి దశలో ఉన్నాయని డబ్ల్యూహెచ్వో చీఫ్ పేర్కొన్నారు . రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ బ్లూప్రింట్ ద్వారా ఈ వ్యాప్తి సమయంలో వాటిని అంచనా వేసే అవకాశాలను శోధించడానికి మా భాగస్వాములతో కలిసి ప్రపంచ ఆరోగ్య సంస్థ పనిచేస్తోందని టెడ్రోస్ వెల్లడించారు.

కరోనావైరస్ లానే లక్షణాలు .. ప్రారంభంలో గుర్తించటం కష్టం
మార్ బర్గ్ వైరస్ యొక్క వ్యాప్తికి కారణం ఆఫ్రికన్ ఫ్రూట్ గబ్బిలం. ఈ వైరస్ 1967 లో జర్మనీలోని మార్ బర్గ్ నుండి మొదటిసారిగా గుర్తించబడింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రకారం, మార్ బర్గ్ వైరస్ వ్యాప్తి చెందే కాలం 2 నుండి 21 రోజుల వరకు ఉంటుంది. లక్షణాలు అధిక జ్వరం, తీవ్రమైన తలనొప్పి, కండరాల నొప్పి, వాంతులు మరియు విరేచనాలు, టైఫాయిడ్ మరియు మలేరియాతో సమానంగా ఉన్నందున మార్ బర్గ్ ప్రారంభంలో రోగ నిర్ధారణ చేయడం కష్టతరం అవుతుంది. కరోనా మహమ్మారికి ఏ విధమైన లక్షణాలు ఉంటాయో మార్ బర్గ్ వైరస్ కు కూడా అటువంటి లక్షణాలు ఉంటాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది.అయినప్పటికీ ఇది కరోనా వైరస్ తో పోలిస్తే చాలా ప్రమాదకరమైనదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ వెల్లడించారు .
Recommended Video

ఐదు నుండి ఏడు రోజుల తర్వాత రక్త స్రావం .. తొమ్మిది రోజుల్లోనే మరణానికి ఛాన్స్
అయితే మార్ బర్గ్ వైరస్ సోకిన వ్యక్తి రక్తస్రావంతో మరణిస్తారని, ఇది అత్యంత ప్రమాదకరమని హెచ్చరిస్తోంది. సాధారణంగా వైరస్ సోకిన తరువాత ఐదు నుండి ఏడు రోజుల తరువాత, వాంతులు అవుతాయని, మలంలో రక్తం , ముక్కు, చిగుళ్ళు మరియు యోని నుండి రక్తస్రావం జరుగుతుందని వెల్లడించారు. ప్రాణాంతకమైన సందర్భాలలో, ఎనిమిది మరియు తొమ్మిది రోజుల మధ్య మరణం సంభవించే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరిస్తోంది. ప్రపంచం ఈ కొత్త వైరస్ విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచిస్తుంది.












Click it and Unblock the Notifications