జుకర్ బర్గ్ పై సంచలనం రేకెత్తిస్తున్న ఆరోపణలు
అమెరికా : ఫేస్ బుక్ మాజీ ఉద్యోగి ఒకరు ఫేస్ బుక్ సీఈవో, వ్యవస్థాపకుడైన మార్క్ జుకర్ బర్గ్ పై తీవ్ర నిందారోపణలు చేశారు. గతంలో ఫేస్ బుక్ లోనే ఉద్యోగం చేసిన ఆంటోనియో గార్సియా మార్టినేజ్ అనే వ్యక్తి తాజాగా తన ఉద్యోగ అనుభవాలను పొందుపరుస్తూ 'చావోస్ మంకీస్ అబ్సెన్ ఫార్చూన్ అండ్ రాండమ్ ఫెయిల్యూర్ ఇన్ సిలికాన్' పేరుతో పుస్తకాన్ని వెలువరించాడు. అందులో మార్క్ జుకర్ బర్గ్ పై సంచలన ఆరోపణలు చేశారు మార్టినేజ్.
2011లో గూగుల్ ప్లస్ ప్రారంభమైన తొలి నాళ్లలో ఆ సంస్థను నాశనం చేయాలని జుకర్ బర్గ్ భావించినట్టుగా సంచలన కామెంట్స్ చేశారు. మొత్తంగా గూగుల్ ప్లస్ సంస్థనే లేకుండా చేయాలని జుకర్ బర్గ్ యోచించినట్టుగా తన పుస్తకంలో పేర్కొన్నారు. ఫేస్ బుక్ ని కూడా అప్పట్లో గూగుల్ పెద్దగా పట్టించుకోలేదని పుస్తకంలో ప్రస్తావించిన మార్టినేజ్, ఫేస్ బుక్ కి పోటీగా గూగుల్ ప్లస్ ని ప్రారంభించాలని గూగుల్ సంస్థ భావించినట్టుగా తెలిపారు.
ఐటీ కంపెనీల మధ్య పోటీ వాతావరణం గురించి పుస్తకంలో వివరించిన ఆయన, ఐటీ రంగంలో ఉద్యోగ అవకాశాల గురించి కూడా ఈ పుస్తకంలో పొందుపర్చినట్టుగా సమాచారం. ఇప్పటికీ కొన్ని విషయాల్లో ఫేస్ బుక్ తో పోలిస్తే గూగుల్ ప్లస్ బెటరని మార్టినేజ్ పేర్కొనడం గమనార్హం.